Loading...

31, డిసెంబర్ 2012, సోమవారం


17, డిసెంబర్ 2012, సోమవారం

శృంగేరి గురువుల అనుగ్రహ భాషణము

        
                             
 ఈ మధ్య భాగ్యనగరానికి ఇరవయ్యేళ్ళ తరువాత వేంచేసి భక్తులను అనుగ్రహించిన స్వామి అనగా శృంగేరీ మఠపీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్థానంలో ఉన్నవారికి నగర వాస్తవ్యులు గురువందన కార్యక్రమం చేసిన సందర్భంగా స్వామి వారు జగత్తుకు ఇచ్చిన సందేశము ఎంతో స్ఫూర్తిదాయకమైనది.

                             వారు చెప్పినది ఏమంటే ఎప్పుడైనా ప్రపంచాన్ని నడిపించేది ధర్మము. ఎవరి ధర్మాన్ని వారు తెలుసుకొని చక్కగా పాటించుట మంచిది. ధర్మము అంటే ఏమి అనగా నీ తల్లిదండ్రులను సేవించి వారి ఋణం తీర్చుకో, పరులకు చేతనైనంతలో సహాయపడు, నీవలన ఇంకొకరికి కష్టము కలుగకుండా చూసుకో మని చెప్పినారు.
                          ఎంతో మంచి మాటలు. ఈ మాటలు ఎవరైనా సరిగ్గా అర్థము చేసుకున్నారంటే, అందరూ మనసా పాటించినారంటే ప్రపంచశాంతి ఎందుకు రాదు? తప్పని సరిగా వస్తుంది. నిలిచి ఉంటుంది. ఇంక సంధ్యావందనము చేయుటకు గాయత్రీ మాత అనుమతి తీసుకున్నవారు తప్పని సరిగా సంధ్యావందనము చేయుట మాని వేసి మాకు ఈ కాలానికి, ఈ వేగానికి తగినట్టుగా ఏదైనా సూచించమని కోరుతున్నట్టు వారు చెప్పి, ఒక ప్రశ్న వేసినారు.

                     ఎప్పుడైనా భగవదారాధనలో ప్రతివారూ కూడా తమతమ శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా చేయమనే మన సనాతనధర్మము చెపుతున్నది కానీ ఈ స్థాయిలో చేస్తేనే చేసినట్టు అని ఎప్పుడూ చెప్పలేదు. అట్లాంటపుడు మీ కాలానికి తగినట్టుగా ఎంత తక్కువసమయము(ఒక్క పదినిముషాలైనా) దొరికితే అందులోనే చేయగల వీలున్నపుడు ఇంకా మార్చమని మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇంతకూడా మీకు వీలు లేదని మీరనుకుంటున్నపుడు ఇంకోటి కొత్తగా సూచిస్తే దానికి మాత్రము వీలు కుదురుతుందని ఏమి నమ్మకము? అసలు ఇది మన ధర్మమయినపుడు దీనిని మార్చే అధికారము ఎవరికీ లేదు.

                           అయినా మిగతాఅన్నింటికీ సమయము ఉన్నప్పుడు (మార్నింగ్ వాక్ ఖచ్చితంగా చేయాలని అదీ అరగంట అయినా తప్పదని అన్నపుడు, రూపాన్ని అభివృద్ధి చేసుకునే వ్యాయామాలు చేయాలనుకున్నపుడు...ఇట్లాంటివి) వీటిల్లో బేరాలాడితే మనకే నష్టమని తెలిసికొన్నమనము......
                  ఇన్నీ మనము చేయడానికి మనకు తగినంత శక్తినిచ్చిన భగవంతుని తలచుకోవడానికి సమయము లేదని , వేగవంత జీవితమని సాకులతో బేరాలాడాల్నా? అని ప్రశ్నించారు.

                   వారు చెప్పిన ఏ మాటా తిరుగులేనిదని అనిపించింది. ఎటూ దారిమళ్ళకుండా, క్లుప్తంగా, విషయాలను నొక్కి చెపుతూ వారు ప్రసంగించడం ఎంతో బాగున్నది.

1, డిసెంబర్ 2012, శనివారం

దైవం పేరుతో....

  సృష్టికి మూలమని నమ్మి దైవాన్ని ఆరాధించడం కాకుండా దైవభక్తి కూడా ఒక ఫ్యాషన్ గానో, సక్సెస్ ఫార్ములా గానో పెట్టుకోవడం కొత్త వింతగా తయారయింది. మన చలన చిత్రాల్లో నాయిక/నాయకుడు దైవభక్తులయి (తర్వాత క్రిమినల్స్ కావటం కూడా మర్చిపోరులెండి.)ఉండడం మిగతా వారు దానిని అతిగా భావిస్తూ సరదా పేరిట వ్యాఖ్యలు చేస్తూ ఉండడం మామూలుగా కనిపిస్తున్నాయి.
                      దైవం పేరుతో సెంటిమెంట్ ఉన్నవాళ్ళని, లేని వాళ్ళని కూడా కాష్ చేసుకోవడమే ఉద్దేశ్యంగా ఉన్నట్టుంది.
               ఇక సినిమాలను మించిపోతూ, ఈ మధ్య వ్యాపారప్రకటనల్లో కూడా మంత్రాలను కూడా నోటికొచ్చినట్టు పలుకుతూ, మారుస్తూ వాడేస్తున్నారు. దీనికంతా వ్యాపారదృక్పథం ఉన్నవాళ్ళే కాదు లేని వాళ్ళే ఎక్కువ సహాయం చేస్తున్నారు. వేదమంత్రాలను , అర్చనలను అన్నిటిని గురువు వద్ద శిష్యులు నేర్చుకోవడం ఉండేది. పూజ చేసేటప్పుడు శుద్ధులై మాత్రమే పలికేవారు.

ఏదైనా తప్పు పలికినా క్షమించమని దైవాన్ని అడిగేందుకే ఒక శ్లోకం ఉన్నది.

యదక్షర పదభ్రష్టం మాత్రా హీనం తు యద్భవేత్|
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే||


అంత నిష్ఠగా ఉచ్చరించడం పోయి నిర్లక్ష్యం ఎక్కువయింది.

ఇప్పుడన్నింటిని సీడిలు, ఇంటర్నెట్లలో ఉంచడం వల్ల ఎక్కడబడితే అక్కడ ఎప్పుడుబడితే అప్పుడు అన్ని మంత్రాలూ వినిపిస్తాయి. కళ్ళకు ఱెప్పలిచ్చినట్టు చెవులకు కూడా ఏదైనా ఉంటే బాగుండేదనిపిస్తుంది. మనం మాట్లాడే తెలుగే మనకు సరిగ్గా రానప్పుడు మంత్రాలను శ్లోకాలను పాడే దుస్సాహసం చేయడం ఎందుకు? అపస్వరం అంటే కూడా తెలియకుండా, గురువు నేర్పకుండా పాడేస్తుంటే వినలేకపోతున్నాము.

10, అక్టోబర్ 2012, బుధవారం

మేరునగతప్పిదం -వరుస టపాలు

కడుపు నిండా వేళ తప్పకుండా భోజనం దొరుకుతుంటే ఆకలి అంటే తెలిసే వీలే లేదు.
నీడలో కూర్చున్న వారికి మాడ్చే ఎండ లో పని చేసే వాళ్ళ కష్టం తెలిసే వీలే లేదు.
ఇట్లా వ్రాసుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.

               దేశం మనది, మన భారత దేశాన్ని మనమే పాలించుకోవాలని, మన ప్రజలను ఎక్కణ్నించో వచ్చి సంస్కృతి పరంగా పూర్తి అపరిచితుల చేతుల్లో మనము, ముందుతరాలు బాధలు పడకూడదని మన పూర్వీకులెంతగానో శ్రమించారు. వాళ్ళల్లో ఇద్దరి ముగ్గురి గురించైతే పాఠాల్లో చదువుకుంటూ ఉంటాము.

              కానీ మారిన పరిస్థితుల్లో అప్రకటిత యుద్ధాలు చేస్తున్న పొరుగు రాజ్యాల కుతంత్రాలకు బదులు చెప్తూ, బలి అవుతూ ఉన్న మన సైనిక సోదరుల గురించి మనకెంత తెలుసు? వారు రోజువారీ సమస్యలను ఎదుర్కొంటూ, శత్రువులను కూడా ఎదుర్కొంటూ దేశాన్ని రక్షించటానికి ఎట్లాంటి వాతావరణంలో ఉన్నారో మనకేమాత్రం తెలుసు?

                   హిమగిరి సొగసుల గురించి ఎంతచెప్పినా తనివి తీరదంటారు. మనకు పెట్టని కోట అంటారు. భరింపరాని చలిలో , విరిగిపడే కొండ చరియల మధ్యలో, బాగుపఱచని, కొండొకచో అసలు వేయని మార్గాల్లో ప్రయాణిస్తూ ఎన్ని సైనిక దళాలు సరిహద్దుల్ని చేరుకోటానికి ప్రయాస పడుతున్నాయి? యుద్ధం చేయడం మాత్రమే కాక , వారికి రోజూ కావలసిన వంట పదార్థాలు, సామగ్రి తీసుకొని పోవడానికి అదనపు మనుషులు లేక వాళ్ళే అన్నీ ఎట్లా చేసుకోగలుగుతున్నారు? హెలికాప్టర్ ల నించీ విసరడం ద్వారా అందే సామాగ్రి ఎంత వరకూ వాళ్ళని చేరుతున్నాయి?
                        ఈ బాధలన్నీ కాక సరిహద్దు ప్రాంతాల్ని మ్యాపుల్లో చూడడం తప్ప ఇంకెలాంటి పరిచయం లేని రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం నోటికి వచ్చిన ప్రతిపాదనలను, వాగ్దానాలను చేస్తున్నపుడు వాటిని పూర్తి చేయడానికి ఎటువంటి సదుపాయాలూ మాకు లేవు మొఱ్ఱో అని నివేదికలను పంపిస్తే వాటిని పట్టించుకునే అధికారులు, మంత్రులు , ప్రధానులు, రాష్ట్రపతులు మనకు లేరే?

ఎందుకీ అలసత్వం? ఎందుకు ఈ తరం పాలకులు ఇంత స్వార్థమతులయినారు?

             చైనాతో యుద్ధం వచ్చిన నాటి పరిస్థితులను వివరిస్తూ  బ్రిగేడియర్ జే.పీ. దాల్వి వ్రాసిన హిమాలయన్ బ్లండర్ అనే పుస్తకంలోని కొన్ని అంశాలను వివరిస్తూ మేరునగతప్పిదం అనేపేరుతో మన బ్లాగర్ సుబ్రహ్మణ్య చైతన్య గారు వ్రాస్తున్న వరుస టపాలను చదవండి.
వారికి నా ధన్యవాదాలు.

5, సెప్టెంబర్ 2012, బుధవారం

నమస్తే నమస్తే నమః


నడకలు, నడవడికలు, అక్షరాలు, ఆదర్శాలు, బాధ్యతలు, కర్తవ్యాలు.....
చెప్పుకుంటూ పోతే ఎన్నో....
మనము పుట్టిననాటినుంచీ, ఈనాటి వరకూ కూడా మనకు తెలిసినవి అంటూ ఉన్నాయంటే , తెలిపినవారంతా గురువులే అని నమ్ముతూ, అందరు గురువులకూ సభక్తికంగా వందనాలు సమర్పించుకుంటున్నాను.
ఈ రోజు గురుపూజోత్సవం అని కాకుండా ప్రతిరోజూ ఈ భక్తి భావనతో వ్యక్తిత్వం మరింత మెఱుగులు దిద్దుకుంటూ ఉండాలని ఆశిస్తూ ఉన్నాను.
ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం శిష్యలక్షణం కాదు.

14, ఆగస్టు 2012, మంగళవారం

శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై ....

శ్రీలు పొంగిన జీవగడ్డయి   పాలు పారిన భాగ్యసీమయి  
వరలినది ఈ భరత ఖండము,  భక్తి పాడర తమ్ముడా !(2)

వేద శాఖలు వెలసెనిచ్చట  ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||

విపిన బంధుర వృక్ష వాటిక  ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన  విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||

సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన||

మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||

పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

                                                 ---రాయప్రోలు సుబ్బారావు.

ఈ పాట ఇక్కడ వినండి.

8, ఆగస్టు 2012, బుధవారం

శివవిష్ణు తత్త్వం

పోతన అమితమైన భక్తిభావముతో వ్రాసిన భాగవతములో దశమస్కంధములో చిన్నికృష్ణుడు పెరిగి పెద్దవుతూ ఉన్నప్పుడు ఆటపాటల గురించి, లీలా విలాసాల గురించి చదివేటపుడు మైమఱిచిపోతాము.

            అందులో కూడా శివవిష్ణు తత్త్వం ఒక్కటే, శివునికీ , తనకూ అభేదమన్న మాట చిన్ని కృష్ణుడు ఆయనకు నయనానందకరంగా దర్శనమిచ్చి ఈ విధంగా తెలియజేశారన్న విషయం ఎంత అందంగా ఆయన చెప్పారు
అంటే ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతితో ద్వాపర యుగానికి వెళ్ళిపోయి మనకు వ్యాఖ్యానం చెపుతున్న రీతిలో ఆనందపరవశులను చేస్తూ మనలను ఆలోకాలకు తీసికొని వెళ్ళిపోయే రీతిలో కన్నులకు కట్టినట్టుగా వర్ణించారు.

            ఆ అద్భుతమైన పద్యం, కరుణశ్రీ గారి సంపాదకత్వ బాధ్యతలో, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు మనకందించిన తాత్పర్యం చదివి తరిద్దాం.

సీసపద్యము:
తనువున నంటిన ధరణీ పరాగంబు
   పూసిన నెఱిభూతి పూఁత గాఁగ
ముందఱ వెలుఁగొందు ముక్తాలలామంబు
    తొగలసంగడికాని తునుక గాఁగ
ఫాలభాగంబుపైఁ బరఁగు కావిరిబొట్టు
    కాముని గెల్చిన కన్ను గాఁగఁ
గంఠమాలికలోని ఘననీలరత్నంబు
   కమనీయ మగు మెడకప్పుగాఁగఁగ

ఆటవెలది:
హారవల్లులురగహారవల్లు గాఁగ
బాలలీలఁబ్రౌఢ బాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెల్ప వెలయునట్లు.

భావము:
ఆటపాటల సమయాలలో బాలకృష్ణుఁడు పరమశివునివలె కనిపించేవాడు. వాని దేహానికి అంటిన దుమ్ము విభూతి పూతవలె కనిపించేది.
ఉంగరాల జుట్టును పైకి ముడిచి ముత్యాలపేరుతో ముడివేసింది యశోదమ్మ. అది శివుని తలపై ఉండే చంద్రవంకలాగా కనపడుతున్నది.
నుదుట నిలువుగా పెట్టిన ఎఱ్ఱని తిలకం మన్మథుని గెలిచిని శివుని ఫాల నేత్రంలాగా కనబడసాగింది.
మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద నీలమణి, శివుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలాగా కనపడుతున్నది.
మెడలోని ముత్యాలహారాలు శివుని మెడలో సర్పహారాలుగా కనపడుతున్నాయి.
ఎదగకుండానే పెద్దవాడైన విష్ణువు బాలకృష్ణుని అవతారంలో ఈ విధంగా లీలలు చూపాడు. శివుడూ, తానూ ఒకటేసుమా అని హెచ్చరిస్తున్నాడా అన్నట్లు చిన్నికృష్ణుడు శివుని వలె కనిపించాడు.

5, ఆగస్టు 2012, ఆదివారం

బొట్టు పెట్టుకోండి.


నుదుటన ఎప్పుడూ బొట్టు ధరించడం మన ఆచారం.విదేశీ అలవాట్ల మోజులో పడి ఎన్నో వదిలేసిన మనం ఈ అలవాటును , ఆచారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. దీనికంతటికీ ఆద్యులు మగవారే. ఈరోజు ఆధునిక, అనాగరిక, అసభ్య వస్త్రధారణను, పెద్దలను బాధపెట్టే ప్రవర్తనను, కుటుంబాన్ని లెక్కచేయకపోవడాన్ని, బాధ్యతలను నిర్లక్ష్యం చేయడాన్ని మొదట పోయినతరాల్లో మగవారే అత్యధికంగా చేశారుఅని నా అభిప్రాయం

.              ప్రతి పనీలో ఆలోచనే లేకుండా సమానత్వం పేరుతో మగవారిని అనుకరించే ఆడవారు ఇప్పుడు ఆ పని చేస్తున్నారు అని నా అభిప్రాయం

                  చాలామంది అమ్మాయిలకు చెప్తుంటారు, బొట్టు పెట్టుకోమని. కానీ మగవాళ్ళైనా సరే ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. అది కుంకుమ అయినా సరే, విభూతి అయినా, చందనమైనా ఏదైనా నుదురు ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉంచుకుంటే ఎదుటి మనిషి ఆధిక్యతకు లోబడడం జరుగుతుంది అంటారు. ఎంతవరకు నిజమో తెలీదు.

              చాలా ఆధునికమని చెప్పుకునే బడులలో బొట్టు పెట్టుకుంటే అనాగరీకమని మౌన ప్రచారం జరుగుతున్నది. ఒకరిని చూసి మరొకరు ప్రభావితులౌతున్నారు. ఈ విధంగా బొట్టు పెట్టుకుని తీరాలన్న నియమం పై పట్టు లేకపోవడంతో ఇంట్లో, బయట కూడా అలాగే తిరుగుతుంటారు. సినిమాల్లో , సీరియల్లో నూ కూడా విలనీ చూపించే వాళ్ళనంతా అత్యాధునికులు గా (నా దృష్టిలో అనాగరీకులుగా) చూపిస్తారు. మొత్తం కథంతా వారి ఆధిక్యతే ఉంటుంది. చివరలో వాళ్ళు మారినట్టు చూపించినపుడు సాంప్రదాయికంగా చూపిస్తారు. చాలామంది మీద ఏ ప్రభావం పడుతుంది చెప్పండి.

                    దైవంపై నమ్మకం ఉంటే ఖచ్చితంగా బొట్టు ధరించండి. బొట్టు ధరించడం వలన మీ అందం ఏమీ తక్కువ కాదు. ప్రత్యేకమైన అందం వస్తుంది. ముఖంలో ఎంతో మార్పు కనిపిస్తుంది.

25, జులై 2012, బుధవారం

కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

కృష్ణాష్టమి వస్తున్న సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు!
శంకరాభరణంలో కాళియమర్దనము చిత్రము చూసి యిప్పుడు వ్రాసిన నా పద్యములివిగో!

పంచచామరము -

మదమ్ముతో చరించు సర్పమై విషమ్ము చిమ్మ, నీ
పదాళి తాండవమ్ము జేసె పంకజాక్ష! "శ్రీ హరీ!
త్వదీయ పాద తాడనమ్ము తాళజాల నం"చు నీ
పదమ్ము బట్టి వేడువాని పాలి దైవమైతివా!

తరళము -

కరుణ కన్నుల నిండియుండగ కంటి నిన్ను గదాధరా!
మరణ భీతిని నేర్పుతోడను మాపిగావుము శ్రీధరా!
సిరియు సంపదలిచ్చి మమ్ముల జేరదీయుము దేవరా!
వరము కోరగ వచ్చినారము, వాంఛితమ్మును దీర్చరా!

మత్తకోకిల -

విందు నేత్రములందు రీతిని వెల్గు వానికి మంగళం!
సుందరమ్ముగ ప్రేమరూపును జూపువానికి మంగళం!
మందహాసము తోడి శోకము మాపువానికి మంగళం!
నందనందనుడైనవానిని నమ్ము వారికి మంగళం!

9, జూన్ 2012, శనివారం

ఎందుకు దొరకదు?


  పుట్టినరోజులు, పెళ్ళి, పెళ్ళిరోజులు, ఏమైనా సాధించిన రోజు, చిరకాలం తర్వాత కలిసిన రోజులు, గౌరవభావంతో, ప్రేమతో, చనువుతో, సంతోషంతో ఇలా ఎన్నో రకాలుగా మనం ఒకరికొకరం కానుకలు, బహుమానములని ఇచ్చుకుంటూ, పుచ్చుకుంటూ ఉంటాం.

           గంటలో వాడిపోయే పువ్వులనుంచి, ఎప్పటికీ మిగిలిపోయే ఆస్తుల వరకూ కానుకల్లో ఉంటాయి.ఇవన్నీ ఎందుకు? అవి నశించినా, నశించకపోయినా వాటితో మనకు నిమిత్తం లేదు. వాటిని ఇచ్చినవారిని ప్రేమగా, గౌరవంతో తలచుకోవటానికే మన ప్రాధాన్యత. ఔనా, కాదా?

          ఆ యా వస్తువులతో మనకు అనుబంధం తాత్కాలికం. ఆ ఇచ్చిన వారికి , తీసుకున్న వారికి మధ్య ఉన్న అనుబంధం కలకాలం పచ్చగా ఉండటానికి అవి ఉపయోగ పడతాయి. ఇవి వస్తువులు గానే ఉంటాయనీ అనుకోలేము. నవ్వులు, పలకరింపులు, కుశలప్రశ్నలు, ఉత్తరప్రత్యుత్తరాలు కూడా ఈ అనుబంధాన్ని నిలపటానికీ, పటిష్ఠ పఱచటానికే. ఈ విషయంలో ఎవరికీ భేదాభిప్రాయము ఉండదు.

                ఇప్పుడు మనం అవతలి వారినుంచి అందుకున్న కానుక ఏదైనా సరే ఆ వ్యక్తిని గుర్తుంచుకొని మనం వారిపట్ల అభిమానం తో ఉన్నట్టే, మనం పుట్టినప్పటినుంచీ చనిపోయిన తర్వాత కూడా మనకు సహకరించే ప్రకృతిని, ప్రతిదీ అందించే పరమాత్ముని పట్ల మనం ఎంత మాత్రం అభిమానంగా, విశ్వాసపాత్రత తో ఉంటున్నాము అనే ప్రశ్న నా మనసుని తొలుస్తూ ఉంటుంది.
                ఆ పరబ్రహ్మ నామ స్మరణ మాత్రం తోనే మనము కృతజ్ఞత ప్రకటించవచ్చే...ఒక్క నమస్కారంతో ఆయనికి ధన్యవాదాలు మనము తెలుపవచ్చే...ఎందుకు మనము ఆసక్తి ని చూపము? మనకు జీవితంలో ఎంత అదృష్టం ఉన్నా , ఎన్ని సౌకర్యాలు ఉన్నా అన్నీ ఆ దైవస్వరూపం యొక్క కృపాకటాక్షమే అని పరిపూర్ణంగా నమ్మే మనము ఆ దేవదేవునితో అనుబంధం ఎందుకు పెంచుకోవటంలేదు?

                     కొంతసేపైనా దైవధ్యానం లో మనసుని ఎందుకు లగ్నం చేయడం లేదు? పొద్దున్న నుంచీ రాత్రి వరకూ ఎన్నో విషయాల్లో పాలు పంచుకోవటానికి మనకు దొరికే సమయం దైవపూజకు ఎందుకు దొరకదు? ఆ విధమైన పూజల్లో దైవంతో సంభాషించే అవకాశాన్ని మనం ఎందుకు విడిచి పెట్టుకుంటున్నాము? పరస్పరం మాటలు జరుగవనా? అలా అయితే మన ఇంట్లో బోసినవ్వుల పాపలతో, మాటలు రాని మూగలతో మనం ఏమీ చెప్పమా? ఆ దైవం మనకెన్నో విధాలుగా అన్నివిధాలు గా మనకు అండదండగా ఉంటుందని నమ్మే మనము ఆ దైవంతో కొంతసేపు ఎందుకు గడపము?

                                ఒక విపత్తు వచ్చినపుడు వెంటనే కాపాడమంటూ చిట్టచివరకు మనము వేడుకునేది ఎవరిని? స్వామీ, నీవే దిక్కు, అమ్మా , నీవే కాపాడాలి అంటూ మొఱ పెట్టుకునేది ఎవరికి? ఆ పరబ్రహ్మానికేగా. ఇన్ని తెలిసి ఉండీ నిర్లక్ష్యము తగదు. ప్రతిరోజూ దైవపూజలకు, భజనలకు, నామస్మరణకు ఎంతో కొంత సమయాన్ని కేటాయించి తీరాలి. అపుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే ఏదో అపరాధ భావన ....ఇందులోంచి బయటపడాలి.

దేవా! నాకు సంకల్పబలము ప్రసాదించు. అనుకున్నది చేయటానికి శక్తిని, మనోదార్ఢ్యాన్ని ఇయ్యి.

12, ఏప్రిల్ 2012, గురువారం

గజేంద్రుని ఆర్తి (నా పద్యములు)



పెద్దలకు నమస్కారము. 
గజేంద్రుని ఆర్తికి పద్యరూపం ఇచ్చెందుకు ప్రయత్నించాను.

ఇందులో కథ వివరంగా చెప్పలేదు. క్లుప్తంగా విషయం చెప్పాను. 
పెద్దల సూచనలు శిరోధార్యము.


చదువును జ్ఞానమునొసగి 
రి దయను గణపతియువాణిరేపవలును నా
మది వీడక కొలువుండగ
కుదురగు బుద్ధిని నిలుపగ కోరుచు నుందున్.


పరుగున నేతెంచి కరిని
హరి గాచిన తీరు యబ్బురమ్మది భువిలో
విరుగగ పాపపు చయములు
సరసముగా జెపుదు నిపుడు ఛందోరీతిన్.

పన్నగశయనుడవయి నెల
కొన్న కమల నయనుడయిన గోవిందాయా
పన్నుల గాచెడు దయ నీ
కున్నదనుచు నమ్మె యేనుగు తనదు మదిలో

స్థానబలముగల మకరమ
దేనుగు పాదమును బట్టి యీడ్చ,మడుగులో
తానే పోరెదననుకొని
దీనత పొందక జతనము తీరుగ చేసెన్.

కడకా గజమది యోడుచు
మడుగున నిన్నే పిలిచెను మాధవదేవా!
"వడివడిగా వచ్చి నిలిచి
విడు నీ చక్రముననుచును వేడెను తానే.

"సృష్టికి నీవే మూలము
భ్రష్టుడనైతిని తెలియక బ్రతుకుననెంతో
నష్టము పొందితి తండ్రీ!
కష్టము గట్టెక్క నన్ను కావగదయ్యా!"

జనకుండెవ్వరు ప్రాణికి,
జననియదెవ్వరుపతియునుజాయయదెవరో,
కనగా సంతును స్వంతమె?
యని నాకు కలుగగ చింతలచ్యుతనాథా!"

ఆదియునంతము నీవే
నాదనుదేమియును లేదునమ్మితి"ననగా
సాదరముగ కదలి కరిని
నీ దరి చేర్చి కరుణింప నీవేగితివే!

పాపపు చీకటులు తొలుగ
దీపము నీవైన కథల దెలుపుచునన్నున్
కాపాడెడు దైవమగుచు,

గోపాలావందనమిదె గొనుమాకృష్ణా!

------------------------లక్ష్మీదేవి.

9, ఏప్రిల్ 2012, సోమవారం

జగమే మాయ......


జగమే మాయ అనే పాట నాకు చాలా నచ్చింది. మొత్తం ప్రవచనాల సారం అంతా నాలుగు ముక్కల్లో చెప్పారు సముద్రాల గారు.

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా

 కలిమిలేములు కష్టసుఖాలు
కావడికుండలనే భయమేలోయీ
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయీ ఈ వింతేనోయీ

కావడి అని భుజంమీద ఒక కర్రను పెట్టుకొని దానికి పెద్ద తాడు కట్టి తక్కెడ మాదిరి ముందు వెనక కుండలు పెట్టుకొని నీళ్ళు మోస్తుంటారు. నీళ్ళు ఖాళీ అయి తేలిక కావటం, మళ్ళీ నీళ్ళు నింపుకుని బరువు మోయటం మారి మారి వచ్చినట్టు కష్టము, సుఖము, కలిమి, లేమి వచ్చి పోతుంటాయి. వాటి గురించి దిగులు చెందకు.
కంటికి కనిపించేదంతా భ్రమ. కావడి రూపంలో ఉన్నా మరే రూపంలో ఉన్నా అదొక చెక్క , కుండల రూపంలో ఉన్నా పగిలినా అది మన్ను తప్ప ఇంకేం కాదు. చెరువులో నీళ్ళు దోసిట్లో తీసుకున్నా అవీ ఇవీ కూడా నీళ్ళే కదా అలాగే జగత్తులో మనకు లభించేదంతా పరమాత్మ పెట్టిన భిక్ష. సుఖము, దుఃఖము అన్నిటినీ స్వీకరించు. అని అర్థము.

ఆశామోహముల దరిరానీకోయీ
అన్యులకు నీ సుఖము అంకితమోయీ
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఈ ఎరుకే నిశ్చలానందమోయ్
బ్రహ్మానందమోయ్

ఇది కావాలని, నాతోనే ఉండాలని ఆశలు, మోహాలు వదలిపెట్టు. ఎందుకంటే ఉండేది ఉంటుంది. పోయేది పోతుంది. ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం కాకపోవటమే ప్రకృతి సహజం. పంటభూమి బీడుగా మారటం, బీడు భూమి భవనంగా మారటం, భవనం కుప్పలా కూలిపోవటం. ఇలా మార్పు అనేది సహజం దీనిని స్వీకరించాలంటే మోహము వదలుకోవాలి.
పరులకొరకు జీవించాలి.
ఉద్యోగం చేసేటప్పుడు చాలా మటుకు సంస్థ లాభనష్టాలతో ఉద్వేగం చెందకుండా, మన జీతం మనకు వస్తుందా లేదా అని చూసుకున్నట్టే పరుల కొరకు ఉపయోగపడే పనులే చేస్తుంటే మోహం దరిజేరదు. విజయం వచ్చినా రాకపోయినా డిప్రెషన్ కు లోను కాకుండా మరలా పని చేస్తుంటాం. మనది అయితే అలా చేయలేం. కాబట్టి ఏదైనా నాకు, నాది అనుకోకుండా చేయగలగాలి.
బాధ , సౌఖ్యము అన్నిటినీ ఒకేలా స్వీకరించగలగాలి. ఎంత బాధ అయినా, ఎంత సంతోషం అయినా కాలం గడిచే కొద్దీ అది ఒక జ్ఞాపకం గా మిగులుతుందే తప్ప ఇంకేమీ కాదు. తండ్రి పోయిన దుఃఖమైనా, స్కూల్ ఫస్ట్ వచ్చిన సంతోషమైనా కొన్నాళ్ళకు అది ఒక జ్ఞాపకం. అంతే. ఇంకేమీ కాదు.ఇది తెలుసుకోవటమే ముక్తి, బ్రహ్మానందం. తెలుసుకోవటం అంటే ఈ పదాలకు అర్థం తెలియటమో, ఇలా వ్రాయగలగటమో కాదు. ఇది ఫీల్ కాగలగాలి. ఆ భావన చేయగలగాలి అని అర్థం.
పాట ఇక్కడ వినండి.

http://mp3skull.com/mp3/jagame_maya.html

27, మార్చి 2012, మంగళవారం

తెలుగులో హనుమాన్ చాలీసా---- యెమ్మెస్ రామారావు రచన పూర్తి పాఠం

https://www.youtube.com/watch?v=wqvh1K_bKOs

https://www.youtube.com/watch?v=1vQKzSxnr4g

శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు        ||శ్రీ||

౧.} జయ హనుమంత జ్ఞానగుణవందిత
జయపండిత త్రిలోక పూజితా
౨.} రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుతనామా
౩.} ఉదయభానుని మధురఫలమని
భావనలీల అమృతమును గ్రోలిన
౪.} కాంచనవర్ణ విరాజితవేషా
కుండలమండిత కుంచితకేశా
౫.} రామసుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజ పదవి సుగ్రీవున నిలిపి
౬.} జానకీపతి ముద్రిక తోడ్కొని

జలధి లంఘించి లంక చేరుకొని
౭.} సూక్ష్మరూపమున సీతను జూచి
వికట రూపమున లంకనుగాల్చి
౮.} భీమరూపమున అసురుల జంపిన
రామకార్యముసఫలము జేసిన                ||శ్రీ||

౯. } సీతజాడ గని వచ్చిన నినుగని
శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని
౧౦) సహస్ర రీతులా  నిను కొనియాడగ
 కాగల కార్యము  నీపై నిడగా
౧౧) వానర సేనతో  వారిధి దాటి
 లంకేశుని తో  తలపడిపోరి
౧౨) హోరు  హోరున  పోరు సాగినా
 అసుర  సేనల  వరుసన గూల్చిన           !!శ్రీ!!

౧౩) లక్ష్మణ  మూర్చతో  రాముడడలగా
 సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాత
౧౪) రామ లక్ష్మణుల  అస్త్ర ధాటికి
 అసుర వీరులు  అస్తమించిరి
౧౫) తిరుగులేని  శ్రీ  రామ భాణమూ
 జరిపించెను  రావణ  సంహారము
౧౬) ఎదిరి లేని ఆ లంకాపురమున
 ఏలికగా  విభీషణు  చేసిన               !!శ్రీ!!

౧౭) సీతా రాములు  నగవుల గనిరి
 ముల్లోకాల  ఆరతులందిరి
౧౮) అంతులేని  ఆనందాశృవులే
 అయోధ్యాపురి  పొంగిపోరులే
౧౯) సీతా రాముల  సుందర  మందిరం
 శ్రీకాంతు  పదం  నీ హృదయం
౨౦) రామ చరిత  కర్ణామృత గానా
 రామ నామ  రసామృత పాన              !!శ్రీ!!

౨౧) దుర్గమమగు ఏ  కార్య మైనా
 సుగమమే యగు  నీ కృపచాలిన
౨౨) కలుగు  శుభములు  నిను  శరణన్నా
 తొలగు  భయములు  నీ రక్షణ యున్నా
౨౩) రామ  ద్వారపు  కాపరి వైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
౨౪) భూత పిశాచ  శాకినీ    డాకిని
 భయపడి  పారు నీ  నామ  జపము  విని           !!శ్రీ!!

౨౫) ధ్వజావిరాజా  వజ్ర శరీర
 భుజ బల తేజా  గదాధరా
౨౬) ఈశ్వరాంశ   సంభూత పవిత్ర
 కేసరీ పుత్రా  పావన గాత్ర
౨౭) సనకాదులు  బ్రహ్మాది దేవతలు
 శారద  నారద  ఆది  శేషులూ
౨౮) యమ కుబేర  దిక్పాలురు కవులూ
 పులకితులైరి నీ కీర్తి  గానముల            !! శ్రీ!!

౨౯) సోదర భరత  సమానాయని
 శ్రీ రాముడు  ఎన్నికగొన్న  హనుమా
౩౦) సాధుల  పాలిట  ఇంద్రుడ వన్నా
 అసురుల  పాలిట  కాలుడవన్నా
౩౧) అష్ట  సిద్ధి  నవనిధులకు దాతగా
 జానకీమాత  దీవించెను గా
౩౨) రామ రసామృత  పానము చేసిన
 మృత్యుంజయుడవై   వెలసినా              !!శ్రీ!!

౩౩) నీ నామ  భజన  శ్రీ  రామ  రంజన
 జన్మ  జన్మాంతర  దుఖ భంజన
౩౪) యెచ్చ టుండినా  రఘువరదాసు
 చివరకు రాముని  చేరుట తెలుసు
౩౫) ఇతర చింతనలు  మనసునమోతలు
 స్థిరముగా మారుతి సేవలు సుఖములు
౩౬) ఎందెందున  శ్రీ  రామ  కీర్తన
 అందందున  హనుమాను  నర్తన               !!శ్రీ!!

౩౭) శ్రద్ధగ దీనిని  ఆలకింపుమా
 శుభమగు ఫలములు  కలుగు సుమా
౩౮) భక్తిమీరగ  గానము సేయగ
 ముక్తి  కలుగు  గౌరీశులు   సాక్షిగా
౩౯) తులసిదాస  హనుమాను  చాలీసా
 తెలుగున  సులువుగ  నలుగురు పాడగ
౪౦) పలికిన  సీతారాముని   పలుకున
    దోసములున్న  మన్నింపుమన్నా             !!శ్రీ!!

మంగళ  ఆరతి  గొను  హనుమంతా
 సీతా రామ  లక్ష్మణ  సమేతా
నా అంతరాత్మ  నేలుమో  అనంతా
 నీవే అంతా  శ్రీ  హనుమంతా  ...ఆ ఆ .............
ఓం  శాంతి  శాంతి  శాంతి:.




25, ఫిబ్రవరి 2012, శనివారం

కాలభైరవాష్టకం



ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కాశీ అనబడే వారాణసికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు.

నేను ఇక్కడ రాసుకున్నట్టుగా కాకుండా
మస్తశూన్య కు మక్షశూల
నిర్మలమ్ బదులు మండలమ్
నిక్వణ్మనోజ్ఞ బదులు వినిక్వణ్మనోజ్ఞ అని కొన్నచోట్ల ఉంది.

బాలు గారి స్వరంలో గంభీరంగా ఎక్కడో విన్నట్టు గుర్తు.
ఆ లంకె  దొరకలేదు.
ఇందులో తప్పులేమైనా ఉంటే తెలిసిన పెద్దలు సవరించగలరు
http://mp3download.ws/mp3/ASa08VbK5V4/Kalabairava%20Astakam/Kalabhairava+Ashtakam/



దేవరాజ సేవ్యమానపావనాంఘ్రిపంకజమ్
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరాం కృపాకరమ్
నారదాదియోగివృందవందితం దిగంబరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||   ౧

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరమ్
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమస్తశూన్యమక్షరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨

శూలటంకపాశదండపాణిమాదికారణమ్
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||   ౩

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహమ్
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||  ౪

ధర్మసేతు పాలకం స్వధర్మమార్గనాయకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకమ్
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే  || ౬

అట్టహాస భిన్నపద్మజాండకోశసంతతిమ్
దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే  || ౭

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకమ్
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮

ఫలశ్రుతి
కాలభైరవాష్ఠకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనం
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం యే
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ద్ధృవం ||
|| ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||



19, ఫిబ్రవరి 2012, ఆదివారం

పదాలతో సదాశివుని పదార్చన







దేవరా! నను గావుమయ్య సతీమనోహర!శంకరా!
దీవనల్ గొన కాచియుంటిమి తృప్తిమాకది నిచ్చు, మా
భావనా జగమంత నిండిన వాడివై కనిపించరా!
నీవె నాకిక దిక్కు,నేరమునెంచకో పరమేశ్వరా!        (మత్తకోకిల)


నటనలొప్పెడి నాట్యశాస్త్రమునందునొజ్జవు నీశ్వరా!
జటలధారివి సుందరమ్మున సాటిగా మరి లేరురా!
భటులపై కరుణారసమ్ము నపారసంద్రము పోలురా!
జటిలమైన భవాబ్ధి పారణ సాగ నీదయ నిమ్మురా!         (తరలము)


మహేశ్వరుండవై, శుభమ్ముమాకు చేయబూనుమా!
సహాయమున్ దయాళువై ప్రసాదమిమ్ము,కోరితిన్
మహానుభావులెందరో హిమాంశుధారునెప్పుడున్
మహామహుండుగా నివాళి మానకుండజేతురే!          (పంచచామరము)


గౌరీనాథుని మనమున
నారాధింపగ నవిద్య నజ్ఞానములున్
చేరక నిర్మలమగునట,
ఆరాటమ్ములు తొలగునటంచును చెపుమా!               (కందము)


నినుగని పొంగిపోవగ ననేకములైన మనోవికారముల్
ననువిడిపోవు నిక్కముగ, నాకములన్నియు నన్నుచేరునే!
మనమిక వెండికొండయగు, మాటయె మంత్రము కాకయుండునా
వినుమొక మాఱు నాదు మొఱ, వేడితి నీకడ నాదిదేవరా!                        


 (చంపకమాల)


ఇంటికి నీవె దైవమయి యెప్పుడు బ్రోచుచు నుండువానివే!
కంటికి రెప్పవై మముల కాచెడు జంగమవీవు దేవరా!
మంటను కంటిలో గలిగి మన్మథ మాయను గెల్చువానిగా
బంటుల తోడునీడవయి భక్తిని పెంచుము రక్తి వీడగన్.                                


 (ఉత్పలమాల)


మాయామర్మమెఱుంగమయ్యనభవా! మమ్మేల రావేలనో
కాయమ్మందున లావు తగ్గెనిక నాకై జాలి చూపించవో! 
న్యాయమ్మీ భువి లేదులేదు, నరులన్యాయంబునే నమ్మిరే!
చేయూతమ్మిడి,భక్తిభావములనే చిత్తమ్ములో నింపుమా!                        


 (శార్దూలము)


నరుడా పొద్దున కొట్టబోయినను బాణాలిచ్చి దీవించవే! (దీవించలేదా అని భావము)
కరువా ముద్దకు నన్నపూర్ణ మగడా! గైకొంటి యెంగిళ్ళనున్,
వరముల్ కోరుచు నిన్ను వేడగనె పాపాలెంచబోవందురే!
గురువే నీవని నమ్మియుంటినిను; నే కోరంగ లేదందువా! (లేదనవు అని భావము)  


 (మత్తేభము)





(ఆష్టమూర్తితత్వమైన ఆదిదేవునికి అష్టపదార్చన.


చివరి ఐదు శ ష స హ(నిషిద్ధాక్షరిలో) లేకుండా శివపూజ
శంకరాభరణం బ్లాగులో నా సమాధానాలు.)

---లక్ష్మీదేవి


18, జనవరి 2012, బుధవారం

సూర్యుని వర్ణన _ రంగుల జానపదం(వీడియో లంకె)

సూర్య దేవుని అనునిత్యం స్మరించి కృతజ్ఞతలు చెప్పుకోవటంఅదీ సూర్యస్తుతికి ఉత్కృష్టమైన ఈ ఉత్తరాయణ ఆరంభంలో.... సర్వ జీవరాశి కి ప్రథమ కర్తవ్యము. సూర్య దేవుని తెల్లని కిరణములో నుంచి అన్ని రంగులు ఉద్భవించినాయంటారు. అలాంటి సూర్యుడు ఆకాశంలో పొద్దున్నుంచీ సాయంత్రం వరకు ఎన్ని రంగులు చూపిస్తాడో , ఎన్నెన్ని పువ్వులతో వర్ణించారో ఈ పాటలో చూడండి. ఇన్ని రంగుల పూలు ఈ లోకంలో పూస్తున్నాయంటే కారణం ఆ పొద్దు పొడుపు వాడే కదూ!
శ్రీ సాయి పదము వారు పంపించిన మెయిల్ లో వచ్చింది. వారికి , పాడిన లక్ష్మి గారికి ధన్యవాదాలు.

"ఉదయ భానునితో మేలుకొలుపు గా ప్రారంభమైన వర్ణన అస్తమాన బాలునివరకూ  -
ఒక్కొక్క స్థితి లో స్వామి వర్ణాన్ని చెప్పడానికి వాడిన ఉపమానాలు
అద్భుతం.   మాఘ మాసమంతా ఆ సూర్యదేవుని స్తుతి స్తోత్ర మాలికలో  ఇది కూడ
పఠించి సర్వ శుభాలు పొందెదరు  గాక." ఈ జానపదానికి వీడియో క్రింది లింకులో
చూడండి.
http://www.youtube.com/watch?v=4hWpHpwHU3U

శ్రీ సూర్యనారాయణ స్వామి - మేలుకొలుపు పాట

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ || 2 ||

పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ ||శ్రీ సూర్య ||

ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ ||శ్రీ సూర్య ||

గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ||శ్రీ సూర్య||

జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ||శ్రీ సూర్య||

మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ||శ్రీ సూర్య||

మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ||శ్రీ సూర్య||




7, జనవరి 2012, శనివారం

తెలిసినా "తెలుసు" కోలేక.......


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబుల్ 
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే దప్ప యితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

            గజేంద్రమోక్షం అనే ఘట్టం భాగవతం లో పరమ పావనమైనది. అందునా మహానుభావులు, పూజ్యులు శ్రీ పోతన గారు తెనిగించిన విధానం ప్రత్యక్ష ప్రసారం వింటూ మనం ఊహల్లో దృశ్యాలన్నిటినీ చూస్తున్నట్టుగా ఉంటుంది. భాగవత పద్యాలన్నీ తేనెలు చిందే మాధుర్యంతో పోతనగారు వ్రాశారు. అంతటి మహా భక్తులు వ్రాసిన పద్యాలను మన గురువు గారు పూజనీయులు, ప్రాతఃస్మరణీయులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలలో వింటే జన్మ ధన్యమౌతుంది. ప్రవచనాల్లో విన్నాక గజేంద్రమోక్షంలోని ముఖ్యమైన పద్యాలను నేను రోజూ మననం చేసుకుంటూ ఉంటాను.పెద్దల సలహా మేరకు మిత్రులందరితో ఈ విషయం పంచుకోవటానికి సంతోషిస్తున్నాను.

       ముఖ్యంగా మనకు తెలియవలసిందేమిటంటే భగవద్గీత, భాగవతాది పుణ్యగ్రంథాలు చదివేటపుడు " ఆఁ ఇప్పట్నించీ ఎందుకు? ముసలివాళ్ళయ్యాక చదువు/ చదువుతాను" అనే మాటలు తప్పు అని తెలియటం.

       ఇప్పుడే మనం చదవలేకపోతున్నామంటే ఇంక ముసలితనము వచ్చాక ఎన్ని దేహ బాధలో ! కాసేపు కూర్చోలేము, కళ్ళు  పెద్ద అక్షరాలైతేనే చదవగలవు, చదవగానే అర్థం చేసుకునే మెదడు వేగం తగ్గిపోతుంది,
    ఎవరితోనైనా చదివించుకుందామంటే అందరూ బిజీ, చెవులు వినబడవు ఇంకా ఎన్నో ఉంటాయని విన్నాము. అనుభవానికొస్తే ఇంకా ఎన్ని తెలుస్తాయో!


     చిన్నప్పటి నుంచీ నేర్చుకుంటే ఈత వస్తుంది కానీ, ప్రాణాపాయం వచ్చినపుడు ఈత వచ్చేస్తుందా?
ఇప్పుడు సమాజంలో కొందరు పుణ్యాత్ములు తప్ప అందరం లౌకిక కార్యక్రమాల్లో అంటే ప్రాపంచిక కార్యక్రమాల్లో మునిగి తేలుతుంటాం. అలాగే ఒక ఏనుగు వనవిహారం, జలవిహారం ఇష్టానుసారంగా చేస్తూ, ఒక కొలను లో ఉండగా ఒక మొసలి పట్టుకుంటుంది. విడిపించుకోవటానికి వెయ్యి సంవత్సరాలు పోరాడి ఇక చాతకాదని తెలిశాక ఏనుగు సర్వేశ్వరుని ప్రార్థిస్తుంది. ఎంత భక్తి తో శరణాగతి చేసి ప్రార్థిస్తుందో పై పద్యంలో చూడండి.

       బలము కొద్దిగానైనా లేదు, మనోధైర్యము  దెబ్బతిన్నది , ఎప్పుడు పడిపోతానో తెలియదు, శరీరం అలసిపోయింది, కుప్పకూలటానికి సిద్ధంగా ఉన్నది, నీవు తప్ప నన్ను రక్షించేవారెవరయ్యా అని ఆర్తితో ప్రార్థిస్తున్నది.

       (సహస్రము)వెయ్యి అనగా అనంతము. అలాగే జీవుడు అనంతమైన కాలవాహినిలో జనన మరణాలనే సుడిగుండంలో పడి తిరుగుతూనే ఉంటాడు. అంటే ఇప్పటికి మనము ఎన్ని జన్మలెత్తామో, ఎన్ని సార్లు మరణించామో, ఇంకా ఎన్ని సార్లు జన్మిస్తామో కానీ ఇక్కడి మంచిచెడులను గుర్తించగలుగుతున్నామా ? లేదు. ఏ వస్తువు/ విషయం/ ప్రాణి ఆనందాన్ని కలిగిస్తున్నాయో వాటి వల్లనే ఒక్కో సమయంలో దుఃఖాన్నీ పొందుతున్నాము. ఇక్కడ కనిపించేదేదీ శాశ్వతం కాదనీ ఆనందం, దు:ఖం వచ్చి వెళ్తూనే ఉంటాయనీ తెలిసినా "తెలుసు" కోలేక చిక్కుకుపోతూనే ఉన్నాం.

       ఈ జీవి పైన పద్యంలో చెప్పిన విధం గా అలసిపోయాడు, శాశ్వతమైన స్థితి అయిన పరమేశ్వర సాయుజ్యాన్ని అన్ని భావాలకూ అతీతమైన పరమపదాన్ని చేరుటకు నీవే వచ్చి నన్ను తీసుకెళ్ళవయ్యా, నేను నిమిత్తమాత్రుడినని జీవుడు దేవుడికి చెప్పుకున్న మాటలుగా తీసుకోవచ్చు. కాబట్టి నాకత్యంత ఇష్టమైన పద్యమిది.

     పాఠంలో ఏమైనా తప్పులుంటే మన్నించి సూచించగలరు.అర్థ తాత్పర్యాలు ఇప్పుడు ఎన్నో చోట్ల పుస్తకాలలో లభిస్తున్నాయి కనుక భావం (నేను అర్థం చేసుకోగలిగినంత వరకూ) వ్రాశాను. 

3, జనవరి 2012, మంగళవారం

క్షేత్ర దర్శనము



             దేవదేవుని దయవలన,  అభిరుచి కారణంగానూ తఱచుగా క్షేత్రదర్శనం అబ్బుతూ ఉంటుంది. ఈ సారి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం, భద్రాచల సీతారామ లక్ష్మణుల దర్శనము చేసే అవకాశము కలిగినది. అదీ రెండు చోట్ల అంతరాలయ దర్శనం టికెట్ తీసుకోవటం వల్ల ఇంకా బాగుండింది.

          భద్రాచలం లో దర్శన సమయంలో పది పదిహైదు మందిని లోపలికి పంపిస్తారు. వారందరిని ఆ చిన్న ప్రదేశంలో కూర్చోబెడతారు. అందరి గోత్రనామాలు అడిగి పూజ చేస్తారు. ఈ లోపు ధర్మదర్శనం ఆగకుండా మా వెనుక వైపు నుంచి వెళుతూనే ఉండటం వల్ల మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందిని ఆపి మనం ప్రత్యేకంగా దర్శించుకోవటం వలన మనం తప్పు చేసినవాళ్ళమవుతాం. ఈ పద్ధతి బాగుంది.

       ఆవరణలో ఆంజనేయుడు సుందరంగా కొలువై ఉన్నాడు. కొంత ఎత్తు మీద గుడి ఉన్నది. ఒక పదహైదు, ఇరవై మెట్ల మీద. మూడువైపుల మెట్లు ఎక్కవచ్చు. నాలుగోవైపు నిర్మాణ/పునరుద్ధరణ జరుగుతున్నది.
మేము వెళ్ళినపుడు వైకుంఠఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయినాయి. జనవరి ఐదు అంటే పుష్యశుద్ధ ఏకాదశి కి ముందు వారం నుంచీ అన్నమాట.

  గుడికి ఎదురుగా పెద్దస్థలము ఖాళీ చేయించి వేదిక నిర్మించారు. వేదిక ముందు భక్తులకోసం కొంచెం ఎత్తైన ప్రదేశంలో పచ్చిక రంగున్న కార్పెట్ ను పఱిచి సిద్ధం చేశారు. మొదటి రోజులు కదా, జనం పల్చగానే ఉన్నారు. మొదటిరోజు విష్ణుసహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం తో సహా చేశారు ఒక బృందం. వాటితో పాటు మామాదిరి వచ్చినవాళ్ళు గొంతు కలిపాం. తర్వాత సీతా స్వయంవరఘట్టం (కవికల్పిత కీర్తన) కు నృత్యప్రదర్శన జరిగింది. తర్వాత ఒక సంగీత కచేరి జరిగింది. తర్వాత దశావతారము అనే విషయం మీద నృత్యప్రదర్శన జరిగింది.

    రెండవరోజు వేరొక బృందం హనుమాన్ చాలీసా ౧౧ సార్లు పారాయణ జరిగింది. యథావిధిగా మేమూ.... ఒక్కొక్క సారి రాగం మార్చి పాడుతూ వచ్చారు. ౧౧ వ సారి శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి అనేపాట ఉంది కదా పాత సినిమాలో ఆఁ... ఆ  ట్యూన్ లో పాడారు. తర్వాత ఒక చిన్న అమ్మాయి చక్కటి కీర్తన సంగీత కార్యక్రమపు అంశం. తర్వాత ఇద్దరు చిన్న అమ్మాయిలు గజేంద్రమోక్షం అనే కీర్తనతో పాటు ఇంకా కొన్ని అంశాలతో నృత్యప్రదర్శన ఇచ్చారు.

   అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. ఎన్నో సార్లు క్షేత్రాలకు వెళ్ళాం కానీ ఈ సారి అదేపనిగా రెండురోజులు ఉండి రిలాక్సింగ్ గా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వలన ప్రధాన ఉద్దేశ్యమయిన ప్రశాంతత అనేది మనసుకు దొరుకుతుంది. ప్రతీ క్షేత్రం లో ఇలా జరుగుతుంటే బాగుంటుంది.

తిరుపతిలో కూడా కోలాటం లాంటివి జరుగుతుంటాయి కానీ అక్కడ విపరీతమైన దోమలు కూడా కచేరీ పెట్టేస్తాయి కాబట్టి నిలువలేము.