Loading...

4, డిసెంబర్ 2011, ఆదివారం

కంచి కామాక్షి ఎదుట గోపూజ




                             కంచి కామాక్షి అమ్మవారిని దర్శించేందుకు కంచికి వెళ్ళాం. అక్కడ తెలిసింది ప్రతి ఉదయం ముందు గోపూజ జరిగినతర్వాతే నిత్యపూజలు జరుగుతాయని. ఎంతో సంతోషం కలిగింది. గోపూజ చూడటం కోసం మరు నాడు తెల్లవారుజామున అయిదు  గంటలకల్లా గుడిలో ఉన్నాము. ప్రతిరోజు అయిదు  గంటలకు గోపూజ జరుగుతుందని, కాపలా వాళ్ళు చెప్పటంతో ఆ సమయానికల్లా అక్కడున్నాము.

                                          ఆవరణలో కూర్చుని వేచియున్నాము. మేమే అనుకుంటే సుమారుగా ఒక యాభై మందిదాకా వచ్చారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అంతా ఉన్నారు. నేను లలితా సహస్రనామాలు చదువుకుంటూ కూర్చున్నాను.  పూజారిగారు అప్పుడే వచ్చారు. లోపలికెళ్ళి అమ్మవారి వద్ద దీపం వెలిగించే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక (ఒక పదినిముషాలలో) అందర్నీ పిలిచారు.

                                          కామాక్షీదేవి గర్భాలయం ముందు ఉన్న ప్రదేశంలో క్యూ కోసం పెట్టిన ఇనుప రాడ్లను తొలగించి ఉంచారు. అక్కడే ఎదురుగా ఉన్న ఎత్తైన మండపంలో మేమంతా నించుని చూస్తూఉన్నాము. గోమాత, దూడతో సహా గోపాలకుడు వచ్చాడు.

                                              సరిగ్గా గర్భాలయం ఎదురుగా, అమ్మవారి ఎదురుగా గోమాత పృష్ఠభాగం ఉండేలా నించోబెట్టారు. పూజారిగారు గోమాత తోకకు , ప్రక్కలకు, ముఖానికి పసుపు , గంధం రాసి కుంకుమ అలంకరించారు. పువ్వులు జల్లారు.

                             అమ్మవారికి, గోమాతకు హారతి ఇచ్చారు. అరటి పళ్ళు గోపాలకునికి ఇవ్వగా అతను గోమాతకు తినిపించాడు. క్రితం రోజే మేము అరటి పళ్ళు కొని సిద్ధం గా ఉంచుకున్నాము. మా చేతిలో నుంచి కూడా పూజారిగారు పళ్ళు అందుకొని గోపాలకునికి ఇచ్చారు. మా జన్మ ధన్యమైనట్టుగా మేము భావించి సంతోషించాము.

                                         ఇంతవరకూ ఇంత వివరంగా గోపూజ, అదీ గుళ్ళో, అదీ క్షేత్రంలో చూడలేదు. మా గృహప్రవేశానికి గోపూజ చేశాం కానీ, అప్పుడు హడావిడిలో ఏం చేశామో, ఎలా చేశామో తెలీదు. కానీ ఇప్పుడు గురువుగారి ప్రవచనాల్లో గోమాత ప్రాముఖ్యత, ప్రశస్తి తెలిశాక గోపూజ తిలకించటం మహదానందంగా ఉన్నది.

                                 గోపూజ జరుగుతున్నప్పుడు దూడకు ఒక గిన్నెలో ఏదో పెట్టారు. అది తింటూ ఉన్నది. ఈ పూజ ముగించి పూజారి గారు గోమాతకు ప్రణిపాతం(సాష్టాంగ నమస్కారం) చేశారు. తర్వాత గోపాలకుడు గోమాతను, దూడను తీసికెళ్ళి పోయాడు.

                   తర్వాత అమ్మవారి అభిషేకం కన్నులపండుగగా జరిగింది. అలా ఎదురుగా నుంచుని అభిషేకం చూస్తూ, లలితాష్టోత్తరం చదువుకోవటం నా మహద్భాగ్యం.

27, నవంబర్ 2011, ఆదివారం

భూమమ్మ

భూమమ్మ
కంప చెట్లు =ముళ్ళ చెట్లు కంచె గా కూడా వీటిని వాడతారు.

రాళ్ళ కొండలు మా ఉరి వైపు ఇవే ఉంటాయి.


కొందరు మిత్రులు పచ్చటి చెట్లతో ఉన్న కొండలనే చూసి ఉంటారు. మా రాళ్ళ కొండలనూ చూడండి.

వర్షం లేక ముఖం వేలాడేసిన పంట 

కొన్ని చోట్ల పచ్చగా కూడా ఉందండోయ్!

చిన్న నది



ఉన్నది రెండు రోజులే అయినా బాగుండింది. పక్క ఉరికి దైవదర్శనానికి వెళ్ళినపుడు నదిలో కార్తీక స్నానము, రైల్లో వెళ్తున్నపుడు రామకృష్ణ సంఘం వాళ్ళతో కలిసి భజన చేయటం, ప్రతీ సారికన్నా ఎక్కువ బంధువులను కలవడం అన్నీ సంతోషాన్నిచ్చాయి.

27, అక్టోబర్ 2011, గురువారం

కార్తీకం




                                                                    ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజు తో కార్తీక మాసం మొదలవుతుంది. ఈశ్వర, నారాయణ రూపాల్లో ఏ రూపాన్ని ఆరాధించే వారయినా ఈ మాసం మరింత భక్తి శ్రద్ధలతో నామ జపం చేసుకునే ఆచారం ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ సంధ్యాసమయంలో ఇంటి ముందు మట్టి ప్రమిదలతో కడుప్మాను (గడప) ముందు రెండువైపులా రెండు దీపాలు పెట్టే ఆచారము ఉంది.

                                                                       దీపావళి అమావాస్యకు ముందు రోజు నరకచతుర్దశిరోజు తో మొదలుపెట్టి, నరకచతుర్దశి, దీపావళి రోజుల్లో వరుసగా అనేక దీపాలు పెట్టినా తర్వాత రెండు దీపాలు మాత్రం పెడుతూ వస్తాం నెలంతా. ఈ నెల దీపదానం , కంబళీదానం ప్రశస్తమైనది అని చెపుతారు. త్వరగా చీకటి పడే రోజులు కాబట్టి దీపాల అవసరం, చలి మొదలయ్యే రోజులు కాబట్టి కంబళీ అవసరం గుర్తించిన పెద్ద వారు ఆ రోజుల్లో  ఏర్పరచిన ఆచారాలివి
                                         
                                              నిరంతరం అందరి గురించీ ఆలోచించి పరస్పర సహాయ సహకారాలతో సమాజం జీవించాలని మన పూర్వీకులు ఇలాంటి నియమాలను పెట్టారు. కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానమే చెయ్యాలంటారు. అదెందుకో తెలీదు కానీ, రోజూ చన్నీళ్ళ స్నానాలు చేస్తున్నా కార్తీకం వచ్చేసరికి నీళ్ళు మరీ చల్లబడి వేణ్ణీళ్ళు కావాలనిపించటం వింతగా ఉంటుంది.

                   
                                                                                ఇక కార్తీక మాసం లో శుద్ధద్వాదశినాడు క్షీరాబ్ధి/చిలుకద్వాదశి అని సర్వరోగనివారిణి, సకలశుభదాయిని అయిన తులసి మాత పూజ జరుపటం విశేషం. తలంటి నీళ్ళు పోసుకొని వంట చేసి తులసికి నైవేద్యం చేయటం, సాయంకాలం నలుగురిని పిలిచి తాంబూలాలు ఇచ్చుకోవటం ముఖ్యం. నా చిన్నతనం లో తెల్లవారేసరికి తులసి దగ్గర అమ్మ వెలిగించే దీపం (నూటఎనిమిదేమో మరి) నాకింకా కళ్ళలోనే ఉంది. మా ఇంట్లో నాలుగడుగల ఎత్తు బృందావనం హుందాగా నిలబడి ఉండేది. అందులో తులశమ్మ, ముందుభాగములో ఇద్దరు కూర్చునేంత  అరుగు లా ఉండేది. సాయంకాలం అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, మా చిన్న చిన్నాన్న మూడో కూతురికి ళ శ్రద్ధగా పలికించటం మనసులో అప్పుడప్పుడూ మెదలుతూ ఉంటాయి.

4, అక్టోబర్ 2011, మంగళవారం

భువనేశ్వరీ !

భువనేశ్వరీ !
అఖిల లోకములఁ గన్న తల్లివీ,
ఆశీస్సులనే కోరివచ్చితిని........... భువనేశ్వరీ!

రాగము ద్వేషము లేని దానవు
లోకములన్నిటి నేలెదవూ..
ద్వేషము పెరుగగఁ బంతముఁ బూనిన
దేశము నిపుడు కావగరావా... భువనేశ్వరీ!

ఎల్లరమూ నీ పిల్లలమమ్మా
చల్లటి నీ ఒడి నుండగ నిమ్మా..
కల్లల,కపటాలన్నిటినీ..
చెల్లగబోవని చూపగదమ్మా.....భువనేశ్వరీ!
                -----లక్ష్మీదేవి

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

శరన్నవరాత్రులు

           దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు ఏ పేరుతో పిలిచినా దేవీ పార్వతి ని కొలిచే శుభదినాలివి. అమ్మవారు పార్వతీ, సరస్వతీ, లక్ష్మీ రూపాలతో మనలను అనుగ్రహించమని వేడినవారికి వేడని వారికి అందరికీ శుభాలను ప్రసాదించి, ధైర్యాన్ని, తద్వారా విజయాన్ని, జ్ఞానాన్ని తద్వారా ముక్తిని, సంపత్తును తద్వారా పరోపకారం చేయగల శక్తిని ప్రసాదిస్తూ ఉండే కరుణాస్వరూపమైన అమ్మవారిని స్మరిద్దాం.

         ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకూ అమ్మవారిని వివిధ ఆలయాల్లో వివిధరూపాలుగా అలంకరింపచేసి, మనకు దర్శన భాగ్యం కలిగిస్తారు గుళ్ళో అర్చకులు. వారికి ముందుగా అభివందనాలు.

            భీకరస్వరూపస్వభావాలు గలిగిన రాక్షసులను వివిధ రకాలుగా అంతమొందించిన అమ్మవారి మహిషాసుర మర్దినీ రూపం, ఆ స్తోత్రం అందరినీ ప్రభావితం చేస్తాయి.

              కనకదుర్గ, కాళీ, మహిషాసుర మర్దిని రూపాల్లో దేవిని పూజించటం చాలా చోట్ల కనిపించినా కొన్ని చోట్ల విజయదశమి సందర్భంగా పిల్లలకు మొదటిసారి పాఠశాలా ప్రవేశం చేయించటం మంచిదని విజయదశమి రోజు చేస్తుంటారు.

         చదువుకుంటున్న పిల్లలకు శలవులు అయిపోయి విజయదశమి రోజు తప్పని సరిగా చదవాలని బళ్ళు తెరవటం కూడా జరుగుతుంటుంది.

            మరికొన్ని చోట్ల శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకోవటానికి అనుకూలం కాకపోతే కూడా నవరాత్రుల్లో ఒక రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.

            ఏరూపంలో కొలిచినా సృష్టికి మూలకారకమయిన శక్తి స్వరూపం ఒక్కటేనని మనందరికీ తెలుసు.
చిట్టిగౌను వేసినా, పట్టులంగా ,రవిక వేసినా, పైట వేసినా, చీరకట్టినా కన్నకూతురి మీద ఒకే ప్రేమే ఎలాగో అలాగన్నమాట.

            ఆ దేవి సకల జనులకూ శాంతి సౌభాగ్యాలను కల్గించాలని కోరుతూ ఈ వేళ తల్లిని ప్రార్థిద్దాం.

5, సెప్టెంబర్ 2011, సోమవారం

నేర్చుకోవాల్సి ఉంది.

                               అక్షరానికి ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుందా? అక్షరం - క్షరం కానిది, నేర్చుకున్నాక ఎప్పటికీ పోనిది అక్షరం- అలాంటి అక్షరాన్ని తొలిసారి పరిచయం చేసేది గురువు. నా విషయంలో మా అమ్మ బడికి చేర్చకముందే నాకు అక్షరాలు నేర్పిన తొలి గురువు.

                         ఆ మాటకొస్తే అక్షరాలే కాదు, ఏ విషయాన్నైనా, పనినయినా, గుణమయినా ఏదైనా నేర్పే వారంతా మనకు గురువులే. అలా చూస్తే ఎంతమంది గురువులో మనకు ఉంటారనేది సత్యము. ప్రపంచంలో మనకు ఎదురుపడే ప్రతి ఒక్కరి వల్లా మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. మననించీ ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్చుకుంటాం.


ఎన్ని నేర్చుకున్నా కొన్ని విలువైనవి ఉంటాయి.
అవి మనమంతా తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి.

  • పసిపాప ల నుంచి ఏ కల్మషమూ లేని అందమైన నవ్వులు.
  • అతి చిన్న జీవితమైనా, కాళ్ళక్రిందో , రాళ్ళక్రిందో పడి నలగి పోయే మరణమైనా సువాసనలు వెదజల్లుతూ, ఎవరి మనసునైనా ఉల్లాసంగా మార్చే రంగురంగుల పువ్వులు
  • స్వేచ్ఛ అంటే ఏమిటో అనుక్షణం నిరూపిస్తూ కూడా బాధ్యత తెలిసి పిల్లలను పెంచి, వాళ్ళు తమను చూడలేదని నిందించే అలవాటు ఆశ కూడా లేని రివ్వున ఎగిరే గువ్వలు
  • ఎన్ని అడ్డంకులెదురైనా, అడ్డుకట్టలు కట్టినా చివరంటా అలుగకుండా,ఆగకుండా ప్రవహించే నదీలలామలు.
  • బడబాగ్నులను దాచుకున్నా అతి ప్రశాంతంగా,        ప్రపంచాన్ని ముంచేసేంత జలమున్నా గంభీరంగా ఉన్నచోటనే ఉండే సముద్రుడు.                                                                                                                                                                                                                                                    వీళ్ళతో మనం నేర్చుకోవాల్సి ఉంది. ఈ గుణాలు ఉంటే జీవితం ఎంతో శోభిస్తుంది. చుట్టూ ఉన్న ఎవరికీ ఏ కష్టం కలిగించకుండా అందరూ ప్రేమనే పంచుకోగలరు.

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........

ఈ మాట మొట్ట మొదట శ్రీరాముడు అన్నాడుట. లంకావిజయానంతరం అక్కడే ఉండి పోవచ్చు కదా అని అన్నప్పుడు అన్నమాట.
కన్నతల్లి, సొంతఊరు  స్వర్గం కన్నా మించిన ఆనందం కలిగిస్తాయి. అని.
ఈ మాట ని బాగా అందరికీ తెలిసేలా చేసింది బహుశా నందమూరి తారక రామారావు గారే అనుకుంటాను. ఈ
 పాట ని ఇప్పుడు విందామా! జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ........ నీ తల్లి మోసేది నవమాసాలేరా,      ఈ తల్లి మోయాలి కడ వరకురా....................కట్టె కాలేవరకురా...

29, ఆగస్టు 2011, సోమవారం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ !


మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
--------శంకరంబాడి సుందరాచారి.

తెలుగువారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు !

13, ఆగస్టు 2011, శనివారం

జో శహీద్ హువే హై ఉన్ కీ జరా యాద్ కరో కుర్బానీ(కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.)



తెలుగులో , హిందీ లో చదవండి. వినడానికి ఇక్కడ నొక్కండి.
తెలుగు భావం చదవండి

 యె మేరే వతన్ కే లోగోం!
తుమ్ ఖూబ్ లగా లో నారా
యే శుభ్ దిన్ హై హమ్ సబ్ కా
లహరా లో తిరంగా ప్యారా
పర్ మత్ భూలో సీమా పర్
వీరోంనె హై ప్రాణ్ గంవాయె
 కుఛ్ యాద్ ఉన్హే భీ కర్ లో - 2
జో లౌట్ కె ఘర్ నా ఆయె-2

 యె మేరే వతన్ కే లోగోం!
జరా ఆంఖ్ మే భర్ లో పానీ
జో  శహీద్ హువే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

జబ్ ఘాయల్ హువా హిమాలయ్
ఖత్ రే మే పడీ ఆజాదీ
జబ్ తక్ థీ సాంస్ లడే వో
ఫిర్ అప్ నీ లాశ్ బిఛాదీ
సంగీన్ పే ధర్ కర్ మాథా
సో గయే అమర్ బలిదానీ
 జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

జబ్ దేశ్ మే థీ దివాలీ
వో ఖేల్ రహే థే హోలీ
 జబ్ హమ్ బైఠే థే ఘరోం మే
వో ఝేల్ రహే థే గోలీ
 థే ధన్య జవాన్ వో అప్ నే
 థీ ధన్య వో ఉన్ కీ జవానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

కోయీ సిఖ్ కోయీ జాఠ్ మరాఠా
కోయీ గురఖా కోయీ మదరాసీ
సరహద్ పె మర్ నేవాలా
హర్ వీర్ థా భారత్ వాసీ
జో ఖూన్ గిరా పర్వత్ పర్
వో ఖూన్ థా హిందూస్థానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

థీ ఖోన్ సె లథ్ పథ్ కాయా
ఫిర్ భీ బందూక్ ఉఠాకే
దస్ దస్ కో ఏక్ నే మారా
ఫిర్ గిర్ గయే హోష్ గంవా కే
జబ్ అంత్ సమయ్ ఆయా తో
కహ్ గయే కి అబ్ మర్ తే హై
ఖుష్ రహ్ నా దేశ్ కే ప్యారోం
అబ్ హమ్ తో సఫర్ కర్ తే  హై
క్యా లోగ్ థే వో దీవానే
క్యా లోగ్ థే వో అభిమానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ

తుమ్ భూల్ న జావో ఉన్ కో
ఇస్ లియే కహీ యే కహానీ
జో శహీద్ హుయే హై ఉన్ కీ
జరా యాద్ కరో కుర్బానీ
జయ హింద్ జయహింద్ కీ సేనా
జయ హింద్ జయ హింద్ జయ హింద్!!!

భావం ---------

నా దేశ ప్రజలారా!
నినదించండి, ఈవేళ  మనందరికీ శుభదినం. మువ్వన్నె ల జెండా ఎగరేయండి
కానీ హద్దుల్ని కాపాడుతూ ప్రాణాలను బలి ఇచ్చిన వీరులను కూడా స్మరించండి. వారిక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదని మరువకండి.

నా దేశ ప్రజలారా!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
హిమాలయాలు గాయపడినపుడు, మన వాళ్ళ స్వేచ్ఛకు ఆటంకం కలిగినపుడు ఊపిరున్నంతవరకూ పోరాడారు వాళ్ళు. ఆ తరువాత తాము శవాలయ్యారు. తమ శిరస్సుమీద తుపాకీ మొన గురి పెట్టబడి ఉందని తెలిసి పోరాడి అమరులయ్యారు.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.

నా దేశ ప్రజలారా!
దేశమంతా దివాలీ జరుపుకుంటుంటే వారు రక్తపు హోలీ ఆడారు.
మనమంతా దేశం లోపల భద్రంగా ఉంటే వాళ్ళు తుపాకీ గుండ్లతో ఆడారు.
మన సేనలు,వారి సమర్థత ధన్యం చెందాయి.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
సిఖ్ఖులు, జాట్ లు, మరాఠీలు, గుర్ఖాలు, మదరాసీలు, సరిహద్దుల్లో ప్రాణాలు వదిలినవారంతా ఎవరైతేనేం---భారతీయులు. ఆ కొండల మీద చిందిన రక్తం భారతీయులది.
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
దేహం మొత్తం  తుపాకీ గుండ్లతో రక్తసిక్తమైనా సరే తుపాకీలు గురి పెట్టి ఒక్కొక్కరు పది మంది  శత్రువులనైనా చంపే అసువులు బాశారు.
మేం లోకం వదిలేస్తున్నాం, నా ప్రియమైన దేశవాసులారా! సంతోషంగా జీవించండి అని చెప్పి మనకు వీడ్కోలిచ్చారు.
ఎంత ఆత్మాభిమానం, ఎంత పట్టుదల !!!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
వారిని మనం మరవకూడదనే ఈ కథ!
కన్నుల్లో కొంచెం నీరు రానివ్వండి.అమరులైన వారి త్యాగాన్ని కొంచెం గుర్తించండి.
జయ జయ హిందూదేశం! జయ జయ హిందూ దేశం!!!








5, ఆగస్టు 2011, శుక్రవారం

నాగుల చవితి


శ్రావణమాసం శుద్ధ చవితి మేము నాగుల చవితి గా జరుపుకుంటాము. కొన్ని ప్రాంతాల్లో కార్తీకమాసంలో జరుపుకుంటారని తెలుసు.
నాగుల చవితికి మిగతా పండుగల్లాగా సున్నాలవీ పూయకూడదు.
ఇళ్ళల్లో కానీ, పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చకూడదు.
ఇల్లు తుడిచాక ముగ్గుపిండి తో ముగ్గు పెట్టకూడదు. సుద్దముక్కలు/చాక్ పీసులతో పెట్టాలి.
మొత్తానికి నాగులకు, ఏ కీటకానికీ ఏ హాని, పొరబాటుగానైనా, కనీసం ఆ వేళనైనా జరగకూడదు.
ఇదీ సంప్రదాయం. అన్ని గుమ్మాలకీ/తలుపులకీ ఆస్తీక అని వ్రాయాలి.
ఆస్తీకుడు ఎవరంటే--------------
అర్జునుని కొడుకు అభిమన్యుడు
అభిమన్యుడు యుద్ధంలో వీరమరణం పొందినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి
అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు
పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు
అనాలోచితం గా చేసిన పాప ఫలితంగా, శాపఫలితంగా పరీక్షిత్తు పాము వలన మరణిస్తాడు
తండ్రి మరణానికి ఖేదం చెందిన జనమేజయుడు పాముజాతిని అంతటినీ మట్టుపెట్టే ఒక గొప్ప సర్పయాగాన్ని నిర్వహిస్తాడు.
యాగ మధ్యలో సర్పజాతిని రక్షించటానికి (వాతావరణ చక్రభ్రమణానికి అన్ని ప్రాణుల అవసరమూ ఉంది) వస్తాడు
తన మాటలచాతుర్యంతో జనమేజయున్ని ఒప్పించి సర్పయాగం ఆపి జగత్కల్యాణకారకుడౌతాడు ఆస్తీకుడు
అందుకే నాగులచవితి నాడు ప్రతి వాకిలి దగ్గరా ఆస్తీక అని రాసి సర్పజాతిని కాపాడినవాడిని అభినందనాపూర్వకంగా తలచుకొనడం జరుగుతుంది.

ఇక ఆనాడు అందరూ తలస్నానం చేసి నాగదేవతకు పాలు పోస్తారు. పల్లెల్లో అయితే పొలాల్లో పుట్టలు ఉంటాయి.అక్కడికే వెళ్ళి పాలు పోస్తారు. పూజలు చేస్తారు. ఆ అవకాశం లేకపోతే ఇంట్లో చిన్న విగ్రహం పెట్టుకుని, పాలు పోసి, పూజచేసి, నూల ఉంటలు, చలిమిడి నైవేద్యం పెడతారు. కొందరు రోజంతా ఉపవాసం ఉండి పూజిస్తారు.

నూల ఉంటలు ఎలా చేయాలో ఇక్కడ చూడండి. 

చలిమిడి - బియ్యప్పిండి లో మెత్తటి బెల్లపు పొడి కలిపి ఉండలు కడతారు. నూల ఉంట రుచి ముందు అదేం పనికి రాదు. అయినా ప్రసాదం కదా , తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది కూడా.

ఇప్పుడు నూల ఉండలు చాలా ఇష్టం. పండుగ కాకపోయినా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను.
నాగుల చవితి రోజు చెప్పుకోవాల్సిన కథ కూడా ఒకటుంది. అది ఇంకోరోజు రాస్తాను. :-)
                                                                          

20, జులై 2011, బుధవారం

మౌనమె నీ భాష

మౌనమె నీ భాష పాట విందామని అనిపించింది. మీకూ అనిపిస్తే ఇక్కడ నొక్కండి.

3, జులై 2011, ఆదివారం

నీలమాధవా!


లోకాధిదైవతం దేవేశపూజితం జగన్నాథ నాయకం సదాఽహం స్మరామి!

ఈ వేళ పురుషోత్తమపురమైనటువంటి పూరీ పట్టణమునందు విరాజితమైన శ్రీ జగన్నాథుని రథయాత్రా మహోత్సవం ప్రారంభమైనది.

జగన్నాథుని నీలమాధవుడని కూడా పిలుస్తారు. గర్భగుడిలో ప్రధాన విగ్రహాలు దారు శిల్పాలు. అంటే చెక్కవిగ్రహాలు. ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి కొత్త చెక్కతో విగ్రహాలు తయారు చేస్తారు. అప్పటివరకూ ఉన్న పాత విగ్రహాలలో నుంచి ఒక దివ్యపదార్థం తీసి కొత్త విగ్రహాలలో పెట్టి తయారు చేస్తారు. అలా అది కొన్ని వందల ఏళ్ళ నుంచి వస్తూ ఉన్న ఆచారం. మతదురహంకారులైన కొందరు సుల్తానులు పాలించేటప్పుడు అన్ని గుళ్ళను ధ్వంసం చేసినట్లుగానే పురాతనమైన ఈ గుడి మీదా దండయాత్ర చేసేందుకు వచ్చారని, అప్పుడు అసలు విగ్రహాలు కొన్నేళ్ళపాటు ఎక్కడో దాచేసి, అదే రూపంతో వేరే విగ్రహాలు అప్పగించగా, వాటిని ఆ మూర్ఖులు బహిరంగంగా వ్రేలాడదీసి భస్మము చేసి సముద్రంలో పడవేశారని చెపుతారు.

జగన్నాథుని గుడి చాలా విశాలమైన పెద్ద గుడి. అంతేకాదు రథయాత్ర ప్రపంచంలోనే పెద్దరథయాత్ర అని చెప్తారు. లక్షలమంది పాల్గొంటారు. సాధారణంగా హిందువులని మాత్రమే దర్శనానికి అనుమతించినా, సర్వులకూ దర్శనం ప్రసాదించటానికి స్వామి గుడి బయటకు వస్తారు. మానవాళికే కాక తాను సృజించిన విశ్వం లోని ప్రతి జీవికీ దర్శనభాగ్యం కలిగించి మోక్షాన్ని ప్రసాదించే అవకాశం ఇవ్వటానికే స్వామి రథయాత్ర అని చెపుతారు. జగత్తుకే నాథుడు కదా మరి.

ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమయ్యే ఈ రథయాత్ర కు అవసరమైన రథాలను అంటే ౩ రథాలను (చక్రాలను, ఇరుసులను కూడా)వరసగా జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రకు ప్రతి సారి కొత్తగా తయారు చేస్తారు. రథయాత్ర పూర్తయ్యాక ఆ చెక్కను విక్రయిస్తారు. కొన్న జనాలు వాటిని తమ ఇంటికి సింహద్వారాలుగా బిగించుకొని శుభం జరుగుతుందని సంతోషంగా ఉంటారు.

పూరీ సముద్రతీరం చాలా అందమైనది. శుభ్రంగా ఉంటుంది కూడా. ప్రపంచవ్యాప్తం గా ఎంతోమంది పూరీని దైవదర్శనం కోసం, పురసందర్శనం కోసం కూడా వస్తారు.

12, జూన్ 2011, ఆదివారం

గృహస్థాశ్రమంలో ఎన్ని కష్టాలో!

మానవజీవితంలో అనుసరించవలసినవిగా నాలుగుఆశ్రమాలను పేర్కొంటారు. వాటిల్లో గృహస్థాశ్రమము మిక్కిలి బాధ్యత్తో కూడుకున్నది. గృహస్థులు తమ గృహవ్యవహారములను నిర్వహించుకుంటూ, అతిథులను ఆదరిస్తూ మిగిలిన (బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస) ఆశ్రమాలలో ఉన్నవారికి శక్త్యానుసారం సహాయసహకారాలందిస్తూ ఉండవలసిన బాధ్యత ఉన్నది.


కానీ ఇవన్నీ నిర్వహిస్తూ ఇహపరసాధనలో గమ్యాన్ని చేరుటకు ప్రయత్నించుట అసాధ్యము కాదని పలువురు మహానుభావులు నిరూపించినప్పటికీ కష్టసాధ్యముగానే తోస్తున్నది. గృహస్థాశ్రమమంలో ఇహపరసాధన అనగా :-
ఇహమునందు - ఈ లోకమునందు బతికియుండగా లక్ష్యసాధన - అదీ సక్రమమైన మార్గాలద్వారా మాత్రమే సుమా. లక్ష్యసాధనలో ధనసముపార్జన మాత్రమే కాక కళత్ర, సంతానాదులతో పాటు తల్లిదండ్రులు, తోడబుట్టినవాళ్ళు , ఇతర బంధుమిత్రులు వీరందరికీ ఆర్థిక, సామాజిక పరమైన చేయూతనిస్తూ , కుటుంబవ్యవహార నిర్వహణల్లో అందరు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ మధ్యమధ్యలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరిస్తూ, అడ్డంకుల్ని అధిగమిస్తూ ముందుకు సాగటం చేయాలి.

ఇందులో ధనార్జన లో కొన్ని కష్టాలు, అందరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండటంలో కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ధనము సంపాదించటం యెట్లా? ఇష్టమైన పని చేద్దామంటే చాలినంత డబ్బు రాదు. చాలినంత డబ్బు అంటే ఎంత? పదివేలు వస్తే లక్ష, లక్ష వస్తే పది లక్షలు కావాలని అనిపిస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో దొరికే అన్ని సౌకర్యాల మీద మనసు పడేవాళ్ళే అరవై శాతం మంది.

ఉన్నదాంట్లో తృప్తి పడటం, అత్యాశలకు పోకుండా ఉండటం, దేన్నీ వృథా చేయకుండా వినియోగించటం అనే మంచి అలవాట్లు మన సమాజంలో ఉండేవి. ఎప్పుడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావాల వల్ల తూర్పు దేశాల్లో ఇవి మృగ్యమై పోయాయో అప్పుడే సమాజంలో అశాంతి ప్రబలింది. ఈ మంచి అలవాట్లు లేకపోవటం వల్ల గృహస్థాశ్రమ నిర్వహణలో ఎంత డబ్బు సంపాదించినా, తక్కువే అనిపించటంతో మనిషి మనశ్శాంతి కోల్పోతున్నాడు.

సేద్యం చేయటం, పాడిని నిర్వహించటం ఎక్కువగా ప్రకృతి మీద ఆధారపడాల్సి రావటం వల్ల ఆ వృత్తుల్ని నిర్లక్ష్యం చేస్తూ నెలసరి జీతాల (ఎంత పెద్ద అంకైనా సరే) వైపు ఆకర్షింపబడ్డారు.

ఇంటి వ్యవహారాలు నిర్వహించుకోవటం , పిల్లలను ప్రేమతో , బాధ్యతతో పెంచటం అనేవి జీవితమంతా ఎంగేజ్డ్ గా ఉంచుతాయి కానీ, చివరి రోజుల్లో ఆర్థిక సెక్యూరిటీ ని ఇవ్వకపోవటం వల్ల వీటికి సహాయకులని, పనివాళ్ళని పెట్టుకొని నెలసరి జీతాలవైపు పరుగులు పెడుతున్నారు.


సేద్యం పూర్తిస్థాయిలో లేకపోవటం వల్ల అన్ని రకాల తిండి పదార్థాలూ సమాజానికి కావలసినంత పరిమాణంలో లభించటం లేదు. లభించినా ధరలు అందుబాటులో ఉండటం లేదు.

పాడి లేక స్వచ్ఛమైన కల్తీలేని పాలు, పెరుగు, నెయ్యి వీటికీ ఇదే పరిస్థితి. కొరత ఎక్కువగా ఉండి, కల్తీలకు పాల్పడుతున్నారు.

ఇక ఇంటివ్యవహారాలని నిర్వహించటం అంటే ఇంటిపనులు చేయటం/చేయించటం, ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉండటం, ఇంటి పెద్దవారిని, పిల్లలను ప్రేమతో, బాధ్యతతో చూసుకోవటమే కాక పదార్థాలనీ, వస్తువులనీ, డబ్బునీ వృథా చేయకపోవటం, అతిథుల నాదరించటం, సమాజంలో కుటుంబానికున్న గౌరవాన్నీ కాపాడుకోవటం ఇవన్నీ సమిష్టి బాధ్యతలు. వ్యక్తి ప్రాధాన్యతలు, ఇష్టాలు ప్రాముఖ్యత వహిస్తున్న ఈ రోజుల్లో ఇవన్నీ సక్రమంగా జరగటం లేదు. దీనివల్ల్ల కూడా మనిషి అశాంతి కి గురి అవుతున్నాడు.

ఇలా ధనార్జన, కుటుంబనిర్వహణల్లో అశాంతికి గురికావటం లో ఇహసాధన కష్టమౌతోంది. ఇహమే సాధించటం కష్టంగా ఉంది కాబట్టి పరం గురించి ఆలోచించనే వద్దనుకుంటున్నారు.

అంటే జన్మ ముగిసిన తర్వాత మరిక జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలని కోరిక ఉంటే సకల స్వార్థ బావాలనూ వదిలివేసి పరమాత్మునిలా పరమార్థ భావనతో జీవించ గలగాలి. ఇంట్లో మనతో పాటు జీవించే చీమలు, దోమలు, ఎలుకలు మొదలైన వాటివి విషప్రయోగాలు చేసి చంపటం సర్వసామాన్యమై పోయింది.

ప్రతిజీవిలోనూ ఉండే పరమాత్మను దర్శించలేక స్వంత సౌఖ్యం కోసం, సౌలభ్యం కోసం వాటిని చంపటానికి వెనుదీయటం లేదు. నరహంతకుల మాట అటుంచితే మంచివారం అనుకునే మన సంగతే .

మొక్కలు నాశనమౌతాయనీ తెలిసీ రాత్రీ పగలు తేడా లేకుండా విద్ద్యుద్దీపాలను వెలిగించే ఈ లోకం ఇక వాతావరణాన్ని పూర్తిగా పాడుచేసే ఫ్రిజ్ లు, యంత్ర వాహనాలను,కర్మాగారాల్ని వదిలేస్తుందా?

ఈవిధంగా బ్రతుకుతున్న మనం పరమార్థ భావనతో జీవించటం అసాధ్యంగా మార్చుకుంటున్నాము. ఈ విధంగా ఇహపరాలు రెండింటిలో అతి ఘోరంగా విఫలమవుతున్న మానవాళికిది దిశానిర్దేశం చేయుటకు ఆ భగవంతుడే ఏదో మార్గం సూచించకపోడన్న నమ్మకం తో బతకాలి.

పూర్తిగా నిరాశావాదం కమ్ముకున్న ఈ పరిస్థితిలో భగవంతుని మాత్రమే ఆశాకిరణం అనుకోవటం గాలిలొ దీపం బెట్టి భగవంతుడికి సవాల్ విసరుతున్నట్టుగా ఉంది. అతడు దీపాన్ని రక్షించే శక్తి కలిగినవాడే.కానీ మనకు వెలుగు చూపే దీపాన్ని రక్షించుకోవటానికి దీపాన్ని గూట్లో పెట్టడమే విహితకర్మ. అలాగే మానవ ప్రయత్నం ఎలా చెయాలో , ఏం చెయ్యాలో విజ్ఞులు జనావళిచే చేయించగలగాలి.

11, ఏప్రిల్ 2011, సోమవారం

శ్రీరామ రక్ష!

పిల్లలు, పెద్దలం దరును వేడుక మీఱఁగఁ జూడఁగా, యదో!
విల్లును ఫెళ్ళనన్ విరిచె వీరుఁడు; పెండ్లికిఁ దండ్రియాన,నా
కిల్లిడఁ గావలెన్ యనెను, కీరఁపుఁబల్కుల జాణ,జానక
మ్మిల్లునుఁ జేరెఁగోసలము, మెచ్చఁగఁ మామయు సంతసంబునన్.



విల్లును విరిచెను రాముఁడు
పిల్లల మగు మననుగాఁవ; వీరునిఁ గనిమిల్
మిల్లను మెరిసెడి బల్చె
క్కిళ్ల రమణి యా కిశోరు కిల్లా లయ్యెన్


అందరికీ శ్రీరామ రక్ష కలుగు గాక!

పిల్, విల్, కిల్, మిల్ అను దత్తపదికి ఇవి నా పూరణలు.

28, ఫిబ్రవరి 2011, సోమవారం

పూరీ జగన్నాథాష్టకం

లోకాధి దైవతం
దేవేశ పూజితం |
జగన్నాథ నాయకం
సదాఽహం స్మరామి ||

అంబుధీ తటస్థితం
శ్రీ నీలమాధవం |
జగన్నాథ నాయకం
సదాఽహం స్మరామి ||

మహాదారురూపం
సదా చారుహాసం |
జగన్నాథ నాయకం
సదాఽహం స్మరామి ||

సహోదరప్రణీతం
సుభద్రా సమేతం |
జగన్నాథ నాయకం
సదాఽహం స్మరామి ||

మహారాజ సేవితం
భక్తకోటి వందితం |
జగన్నాథ నాయకం
సదాఽహం స్మరామి ||

కాననాంతర్గతం
కారుణ్యసాగరం |
జగన్నాథ నాయకం
సదాఽహం స్మరామి ||

మనోరథ పూరకం
మహానంద కారకం |
జగన్నాథ నాయకం
సదాఽహం స్మరామి ||

నవ్యరథారోహిణం
కృష్ణమంగళరూపిణం |
జగన్నాథ నాయకం
సదాఽహం స్మరామి ||
-లక్ష్మీదేవి



నేనే రాశాను. తప్పులను సూచించిన యెడల కృతజ్ఞురాలిని.

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

జయము నీకు తెలుగుతల్లి!

జయము నీకు తెలుగుతల్లి! జయము జయము జయము!
అక్షరాల ఆకులతో శోభిల్లే పూలవల్లి జయము జయము!

సొంత భాషనెఱుగకుండ
పెఱుగుతున్న యువతరాన్ని
కొత్తరకపు బానిసలని
దరిఁజేర్చి కాపాడవే
తేనెలూరు పలుకు తల్లి!


మన పాటల మన మాటల
మన పద్యపు భావాలను
తెలియలేని మా తరాన్ని
మెఱుగుపఱిచి తీర్చిదిద్ది
మమ్మేలవే కల్పవల్లి!
-లక్ష్మీదేవి

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

కోటి మాటలు దొంగప్రచారాలకే!

బెంగళూరు రైల్వే స్టేషనులో నేను వేచి యుండగా ఒక చక్కటి అమ్మాయి వచ్చి నన్ను పలకరించింది.
హలో మేడం! మేము ఒక రీసెర్చ్ చేస్తున్నాము. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చెపుతారా ? అంది.
మీకు ఇంటరెస్ట్ ఉంటేనే అనేమాట మాటిమాటికీ వాడుతూ మాట్లాడుతోంది.
సరే అన్నాను. మీరు రోజూ పేపర్లో ఏం చదువుతారు? మంచి వార్తలు /చెడు వార్తలు ఏవి ఎక్కువ ఉంటాయి?
అశాంతి ఎక్కువవుతోంది కదా? మానవ జీవితం శాంతిమయం కావాలంటే ఏం చెయ్యాలంటారు అంటూ అడుగుతూంది.
సరే, మాకూ బండికి ఇంకా బోలెడు సమయం ఉంది. చక్కటి మాటతీరు ని చూసి నేనూ ఇంప్రెస్ అయ్యి ఏదో నాకు తోచింది చెపుతూ వచ్చాను.
ఇక ఓ పుస్తకం తీసింది.చిన్నది. డైలీ స్ ఆదివారం ఎడిషన్ సైజులో ఉంది. వివాహవిచ్ఛేదన లను తగ్గించాలంటే ఏంచెయ్యాలి? మేం అమ్మటానికి రాలేదు మేడం. మీకు చదివే అలవాటు ఉంటే ఈ పుస్తకం తీసుకోండి. అంది. సరే తీసుకున్నాను. ధర చెప్పండి అన్నాను. అబ్బే ఇది ఫ్రీ మేడం. ఇందులో మా సైట్ అడ్రెస్ ఉంది. కావాలంటే కాంటాక్ట్ చేయండి, డొనేషన్ ఇస్తే తీసుకుంటాం. అంది. ఇంతలో ఒకతను కూడా వచ్చాడు.
సరే ఏదో సంఘసేవ కాబోలు అనుకున్నా. నాకు ఫోన్ రావటంతో వాళ్లూ వెళ్ళిపోయారు. నేనూ పుస్తకం నా పెట్టెలో వేసుకున్నాను. తర్వాత ఒక గంటయ్యాక తీసి చూద్దును కదా, ప్రతి వ్యాసంలోనూ వారి మత గ్రంథం పేరు!! దంపతులు గొడవలు రాకుండా ఉండాలంటే అందులో ఇలా వ్రాసి ఉంది, అలా వ్రాసి ఉందంటూ.
మతం మారమని చెప్పటం నేరమని అవేర్నెస్ బాగా పెరిగి హిందువుల్లొ వ్యతిరేకత వచ్చాక ఇలా మోసపుచ్చి బ్రైన్ వాష్ చేయటం మొదలుపెట్టారు. సున్నితమైన విషయాల్లో ఏ సలహా దొరుకుతుందేమోనని చూసేవారికి ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారేమో. నీవిది చదివితేనే నీకు పరిష్కారం దొరుకుతుంది అంటే విపరీతంగా టెన్షన్ లో ఉన్నవారు అటువైపు మళ్ళుతారు.
నాకు భలే కోపమొచ్చి ఆ పుస్తకం చింపి పడేసాను.
ఒక కుటుంబం లో యజమాని కి బాగా సుస్తీ చేసి ఇక బతకడన్న తరుణంలో వాళ్ళు మతం మారారని తెలిసింది. ఏమిటా ఎలా మారారు? ఆ దేవుడైతే కాపాడతాడని వాళ్ళకు ఎలా అనిపించింది అని క్లూ దొరకలేదు. ఇదిగో ఇలా మతం మాటే ఎత్తకుండా మెల్లగా బ్రైన్ లో దింపేయటానికి బాగా శిక్షణ ఇచ్చి పంపిస్తారేమో అనిపించింది. ఇప్పుడూ అతనికి సీరియస్ గనే ఉంది. ఏమిటో మరి ఈ బలహీన క్షణాలలో, బలహీన మనస్కులపై ఇలాంటి ప్రయోగాలు?

21, జనవరి 2011, శుక్రవారం

మరచిపోవట్లేదూ!

ఆఁ .... మనం కాపాడ్డమేమిటి, మనం వదిలేస్తేనే పోతుందా ఏమిటి తెలుగు? ఇవన్నీ పిచ్చి మాటలు అనేవాళ్ళని చూస్తూ ఉంటాం. నేను చిన్నతనం లో మాత్రం తెలుగు చదివాను. అంటే నేనుచెప్పేది తెలుగు పాఠాలు చదువుకున్నది. పెద్ద తరగతులకొచ్చేసరికి తెలుగు ఉండటం లేదు. ఆంధ్రప్రదేశం లో ఉన్నవాళ్ళకే అదీనూ. లేకపోతే అదీ ఉండదు. ఇప్పటి చిన్న పిల్లలకు ఇంట్లో తెలుగు మాట్లాడే వారే ఉండరు. వాళ్ళల్లో వాళ్ళు తెలుగు మాట్లాడినా, పిల్లలతో మాత్రం ఆంగ్లమే . ఇంకా ఫ్రెంచ్, జర్మన్ మొదలైనవి అన్ని స్థాయిల్లోనూ లభ్యంగా ఉంటాయి.

తెలుగునిలా వదిలేయటం వల్ల మన సభ్యమైన అలవాట్లను కొన్నింటిని మనం వదిలేస్తున్నాం. ముఖ్యంగా ఆడవాళ్లని, చిన్న పాపలని సైతం అమ్మా అని సంబోధించి మాట్లాడటం ఉండేది. ఇప్పుడు ఎవరినీ ఎవరూ అమ్మా అనటం లేదు. అమ్మా అనిపించుకోవటానికి మా ఆడవాళ్ళలోనే చాలామందికి ఇష్టం ఉండదు. అసలు పేరు చివర చేర్చి అమ్మ అనేవారు. అంటే కమలమ్మ, విమలమ్మ లాగా. ఎంత హుందాగా ఉంటుంది.

ప్చ్....ఏంటో, అక్కా, ఆంటీ అనాలి. పనివాళ్ళు గానీ, పాలవాళ్ళుగానీ . ఇక సహోద్యోగులు, బయట అద్దెకారు వాళ్ళు ఎవరైనా సరే మేడమ్ అనాలి. అమ్మా అని అలవాటు చేయటంలో ఒక చిన్న విషయం ఉంది. మన భారతీయ సంస్కృతి లో భార్యని తప్ప మిగతా వాళ్ళనంతా అమ్మలుగా చూడాలి. ఇది ఒక రకంగా మనసులో స్థిరపడుతుంది. అందరూ అలా ఉంటారా అని అడక్కండి. కొందరైనా తమని తాము మంచిమార్గంలో మలచుకోవటానికి ఉపయోగపడుతుందిది. ప్రతి విషయానికి ఒక మితి అనేది ఉంటుంది. చపలచిత్తాన్ని దారిలో పెట్టుకుంటే వారికే మంచిది.

పెద్దబాలశిక్షలో ఎన్ని విషయాలుంటాయి. మనం ఎలా నడుచుకోవాలో తెలిపేవవి. మంచివన్నీ వదిలేశాం. మేం చదువుకున్నపుడే లేదు. నేను ఓ నాలుగేళ్ళ క్రితం కొని చదివి ఆశ్చర్యపోయాను. ఇంత విజ్ఞానాన్ని, క్రమశిక్షణనీ ఇచ్చే పుస్తకాన్నా వదిలేశారు? అని. మన పెద్దవాళ్ళు రాసిన గ్రంథాల్లో ఎన్నో విషయాలు సంఘ జీవనానికి మనిషి అలవర్చుకోవటానికి కావలసినవన్నీ ఉంటాయి. అన్నీ వదిలేశాం. కాలం పాడైపోయింది అనుకోవటానికి ఎవరు కారణం? మనం కదూ!
ఎన్ని భాషలు నేర్చుకున్నా మన భాష వదిలేయటం చాలా తప్పు.
కొన్ని పుస్తకాలైనా చదివితే కదా ఇష్టం పుట్టేది. ఎంతో నచ్చజెప్తే కానీ ఉత్తరం చదివేంత ఇష్టం కూడా రాదు. ఇంకేం చెప్పను? చదివే అలవాటు లేదా అంటే ఉంది.( ఆంగ్లంలో) .చలనచిత్రాలు మనవి చూస్తే ఏమిటి,ఆంగ్లం వి చూస్తే ఏమిటి? అన్నీ ఒకే రకం. కళాశాలలంటే చూపించేది అల్లరి, అధ్యాపకులని అవమానించటం. ప్రేమంటే త్యాగం లేదా మోసం. అదీ అమ్మాయి-అబ్బాయి. మిగతా సంబంధాలన్నీ అక్కర్లేదన్నట్టు చూపించటం. బాధ్యతలు అనేమాటే ఎక్కడా ఉండదు. చ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక బాధ్యతలేవీ ఉండవు. ఇక ధారావాహికల గురించి ఏమీ తలచుకోకుండా ఉంటే మంచిది.

ఏ పోటీ కార్యక్రమాల్లో కానీ సభాసంగతం కాని విషయాలు లేకుండా ఉండవు. మంచి విషయాలు అనేవి ఎక్కడ నుంచి నేర్చుకోవాలి ? నిజమైన నాగరికులం ఎప్పుడు అవుతాము? మన తెలుగుని వదిలేయకుండా ఉండాలి. మన పుస్తకాలని, మన మాటలని, మన సామెతలని, మన చదువునీ మనం వదిలేయకుండా ఉండాలి. అదే దీనికి పరిష్కా రం. దీన్ని ఎలా అమలు పరచాలని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందేమో మీరూ చెప్పండి.


మనమే కాదు, మన భాషలన్నిటికీ ఈ సమస్య ఉంది. తమిళ, కన్నడ వాళ్ళ బాధ కూడా ఇదే. కాకపోతే ఒక మణిపురి అమ్మాయి నాతో పాటు ఇవ్వాళ జనబండి లో (బస్సు) వచ్చింది. ముఖం చూస్తేనే ఈశాన్య భారతం అని తెలిసిపోతుంది కదా!

మణిపురి అని, ఉద్యోగరీత్యా వచ్చానని చెప్పింది. (హిందీ లో మాట్లాడుకున్నాము). ఆ అమ్మాయికి హిందీ సరిగ్గా అర్థం కాలేదు. (నా హిందీ నేమో!) సరే పోనీ సరదాగా మణిపురిలో మాట్లాడడాన్ని ఏమంటారు అని అడిగాను. వొహయ్ బా అంది.


మణిపురిలో పుస్తకాలు చదువుతారా అని అడిగాను. చదవనంది. కవిత్వం ఉంటుందే అన్నాను. ఉంటుంది.అంది. రచయిత పేరేదైనా చెప్పమన్నా. ఊహూఁ... పోనీ మణిపురిలో నృత్యాన్ని ఏమంటారుఅంటే తెలీలేదు కాబోలు చాలాసేపు ఆలోచించింది. చివరకి తెలీదు అనేసింది. నేను వదల్లేదు. అమ్మనేమంటారు అన్నా. పూమాయి అంది. హమ్మయ్య .
ఏదో ఒకటి చెప్పింది కదా , సంతోషం. చివరికి దిగేటపుడు దయచేసి మణిపురి ని మరవొద్దు. అన్నా. అర్థమయ్యిందో లేదో కానీ, వెళ్ళొస్తా నని తలాడించి వెళ్ళిపోయింది.