Loading...

21, డిసెంబర్ 2014, ఆదివారం

గంగా స్తుతి - తిక్కన

క. మును పాపములెన్ని యొన,
    ర్చినఁ బిదపను గంగనాడఁ జీఁకటి రవి దోఁ
    చిన విరియుగతి విరియు న,
    య్యనఘుఁడిలాతలము దొఱఁగి యమరతనొందున్.
తా. ఎన్ని చీకట్లున్నా రవి ఉదయించగనే అన్నీ అంతరించినట్లు, గంగా స్నానము చేసినవెంటనే పాపాలన్నీ తొలగి పోయి పాపరహితుడై జీవుడు అమరత్వమును పొందగలడు.

క. మేనించుక సోౕఁకిన గం,
    గానదితోయములు జనుల కల్మషకోటిం
    బో నడచి పురందర లో
    కానందముఁ బొందఁ జేయు నాగమవేదీ!
తా. గంగానదీజలములు మేనికి తాకగానే జనుల కల్మషాలన్నీ బోగొట్టి ఇంద్రలోకము చేరుస్తాయి.

సీ. అనఘ సోమము లేని యధ్వరంబును శశి
     లేని రాత్రియు రవి రవి లేని నభము
     నాత్మధర్మము లేని యాశ్రమంబును బుష్ప
    సంపద లేని భూజమును బోలె
   హీనత నొందు గంగానది లేని దే
    శంబు చాంద్రాయణ శతములైన
   గంగాపయః పానకరణంబు గావించు
  నిర్మలత్వముఁ జేయ నేరవగ్ని
ఆ. యందుఁ బడిన దూది యట్లగు గంగావ
   గాహనమునఁ బాతకంబులఖిల
   భూతములకు దుఃఖములు వాపికొనుటకు
   నేవిధములు గంగ కీడుగావు.
తా. సోమము లేని యజ్ఞము, చంద్రుడు లేని రాత్రి, రవిలేని ఆకాశము, ఆత్మధర్మము లేని ఆశ్రమము, పుష్పించని చెట్టు వలె గంగా నది లేని దేశం హీనమైనది. నూరు వ్రతములైన గంగాజలము లిచ్చు నిర్మలత్వములియ్యలేవు.
అగ్ని యందు పడిన దూది వలె సకలపాతకములనుఁ బాపి, దుఃఖములను దీర్చే గంగకు ఏవీ సాటి రావు
క. విను గంగ గంగ యను కీ
  ర్తనములతో నొండు నీటఁ దగ మునిఁ గిన య
  జ్జనులు దురితములఁ దొఱగుదు
  రనియార్యులు సెప్ప విందునంచిత చరితా.
తా. గంగ నామస్మరణ చేస్తూ మామూలు నదుల్లో మునిగినా దురితములు దొలగునని ఆర్యులు చెప్పుదురు.
తే. మూఁడు పథములఁ జని లోకములకు మూఁటి
    కుజ్జ్వలాలంకృతియుఁ బెంపు నొసఁగినట్టి
   యమలతరమూర్తి యగుదేవి నాశ్రయించు
   వాఁడు కృతకృత్యుఁడిది నిక్కువము కృతాత్మ.
తా. మూడు లోకములలో (స్వర్గలోకములో మందాకిని, భూలోకములో గంగానది, పాతాళములో భోగవతి) ప్రవహిస్తూ వాటికి అలంకారముగా నిలచిన  త్రిపథ అని పిలువబడిన గంగ నాశ్రయించువాడు సఫలుడగును.
--------------
తిక్కన విరచితమైన అనుశాసనికపర్వము, ద్వితీయాశ్వాసము నుండి ధర్మరాజు అడిగిన సందేహాలను నివృత్తి చేస్తున్న భీష్మపితామహుని మాటల్లో కొన్ని.

19, నవంబర్ 2014, బుధవారం

ఆనాటి జాతీయ రచనలు

       వందేమాతరం పలుకునే నిషేధించి కఠినంగా అప్పటి దురాక్రమణదార్లు ప్రవర్తిస్తున్నప్పటికీ, మొక్కవోని ఆత్మస్థైర్యంతో వెనుదీయని గుండెబలంతో మన జాతీయస్ఫూర్తిని పెంపొందించే విధంగా జనచైత్యన్యం కదం తొక్కే విధంగా కవులు ఎందరో ఎన్నో జాతీయ రచనలు చేసినారు.
    గురజాడ అప్పారావు గారి దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా అటువంటిదే. రాయప్రోలు వారి సిరులు పొంగిన జీవగడ్డయి పాలుబారిన భాగ్యసీమై అటువంటిదే.
  ఇప్పుడు మరి కొన్ని చూద్దాము.
****************
బలిజేపల్లి లక్ష్మీకాంతమ్మ గారి స్వరాజ్యసమస్య అన్న పద్యగ్రంథము లోని పద్యము.

సకల రత్న ప్రభా చటులాంబరంబైన హిమనగం బాత పత్రముగ మెరయ
చేరి భాగీరథీ సింధునదీ తటుల్ విమల వీచీ చామరములు వీవ
ప్రాక్పశ్చిమాగ్ర భూముల గొల్చి గభీర వారిధీశ్వరులు కైవార మొసగ
ఆర్షసంతతి యుదాత్తాను దాత్తములైన  స్వరములు స్వస్తి వాచనములిడగ
ముప్పదియు మూడుకోటుల ముద్దు సతులు
సమత తన యాజ్ఞ శిరసావహింప
సింహళద్వీప పీఠికాసీన యగుచు
కరుణ జగమేలుగాత మాభరతమాత.

గౌతమీ కృష్ణవేణి తుంగభద్రాది పావనోదక ముగ్గుబాలు త్రావి
నన్నపార్యాది మాన్య కవిత్రయము చేత నల్లనల్లన మాటలాడనేర్చి
ఆంధ్రరాష్ట్ర స్థాపనాచార్య వర్యుడౌ విష్ణువర్ధను భుజాపీఠి నెక్కి
ఆంధ్రసేవాపరాయణ కృష్ణ రాయాది పతులచే సకల సంపదల బొదవి
కడుపు చల్లగ గాంచి పెక్కండ్ర సుతుల
బహువిక్రమతేజః ప్రభావధనుల
నిస్సమాన మహోన్నతి నెగడినట్టి
ఆంధ్రమాతా నమస్కారమమ్మ నీకు.
*********************
జాషువా గారి ప్రసిద్ధ పద్యము

సగరమాంధాత్రాది షట్చక్రవర్తుల యంకసీమల నిల్చినట్టి సాధ్వి
బుద్ధాది ముని జనంబుల తపంబున మోద బాష్పము ల్విడిచిన భక్తురాలు
కాళిదాసాది సత్కవి కుమారుల గాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు
కమల నాభుని వేణుగాన సుధాంభోది మునిగిదేలిన పరిపూతదేహ
సింధు గంగానదీ జల క్షీరములను
కురిసి బిడ్డల బోషించుకొనుచున్న
పచ్చి బాలింతరాలు మా భరతమాత
మాతలకు మాత  సకలసంపత్సమేత
****************

మన రాజపుత్రవీరుల శౌర్యచరిత్రలు దాస్యములో మగ్గి ఎలా కాంతి సమసినాయో చెపుతూ
ఓలేటి నారాయణమూర్తి గారు
సూత్రయుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల చండశౌర్యము
చిత్ర దాస్యముచే చరిత్రల
చెరిగిపోయెర తమ్ముడా!!

జనపదుల గీతాలూ ఎంత ఉత్తేజపూరితంగా ఉన్నాయో చూడండి.

అచ్చరాలొచ్చీ అచ్చన గాయలాడుకుండే రాజ్యములో రయ్యో కొయ్యోడ!
కిన్నరులొచ్చీ కీర్తనపాడే కీర్తివంత రాజ్యములో రయ్యో కొయ్యోడ!

కొయ్యోడ= కోయవాడా!

************
గరిమె ళ్ళ సత్యనారాయణ గారి

నూరు మంది మలబారు వాసులానూ
 కూరినాడొక పెట్టె లోన (!!!అమ్మో, పాపం కదా!!)
గాలి దూరనీయడు ఇంచుకైన
నోట నీరు పోయడు దేవునాన

పరపాలకులదౌర్జన్యాలు చూడండి. గుండెలవిసిపోతాయి.

******************

చారిత్రక క్షేత్రాలూ పుణ్యక్షేత్రాలూ శిథిలమైనాయని చూపి చెప్పడము దేశము వన్నె తరిగి కృశిస్తున్నదనీ, అన్యాపదేశంగా దేశాన్ని నీవు పునర్నిర్మించవలెననియు చెప్పడమే.

శేషాద్రి రమణకవుల పలుకులు
అది తటాకము కాదాంధ్ర కుమార అరివీర దుస్సాధ్యమైనట్టి పరిఘ
అద్ది కుంకుమము గాదాంధ్ర కుమార తెలుగు నెత్తుటి గడ్డ దెరలిన దుమ్ము
****************

ఓరుగల్లు కోట దుస్థితి గురించి వానమామలై వరదాచార్యులు
కుక్కలు చింపు విస్తరిగ కూలిన యోర్గలు కోటకంటివే?
మక్కువ ఊపిరుండియును మూతికి మీసము గల్గు నాథుడా
*********************

కొడాలి సుబ్బారావు
శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల
గుడి గోపురమ్ములు సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు
************

పురిపండా (అప్పలస్వామి)
భయద దాస్య విశృంఖలా బంధితుడవు ఓయి! జీవచ్ఛవాంధ్రుడా!
ఒక్కమారు ఒలుక నిమ్మిట నింత కవోష్ణ బాష్ప మలినధార స్వాతంత్ర్య సంప్రాప్తి కొఱకు
 *************

కాళోజీ
ఇల పుట్టిననాటి నుండి ఇలవేల్పుగ నిల్చి మనల ఇరుగుపొరుగు
దుండగాల కొరగాకుండగ కాచిన హిమవంతునికాపద యట
పదపదపద ఆదుకొనగ ఆంధ్రావళి అండదండ అస్సాముకు అందింపగ
నయ్యర్లకు తోడ్తోడుగ నాయర్లను నిలిపి ఉంచ
బదరీనాధుని రక్షకు మధురను కంచిని కదుపగ
కాశ్మీరమునకు జంటగ కన్యాకుమారిని నిలుపగ
బిహారీల రణభేరిగ మహా రాష్ట్రము హుంకరింప
గురుగోవిందుని గర్జన ఘార్జరులను కదలింపగ
కర్ణాటక చాముండియే కలకత్తా కాళికాగా
కైలాసము పిలుపును విని కాకతి చిందులు త్రొక్కగ
ఏడుకొండలెలుగెత్తుచు హిమవంతుని పురిగొల్పగ
నగరము చేయూతకు రంగము ఎగిరి దుముక
శైలము గంతులిడుచు శీత నగరము నాదుకొనగ
కలము కుంచె కదలింపుము
సరిహద్దును కాపాడే జై సేనా జైహింద్
లద్దాకును కాపాడే లచ్చన్నా జై హింద్
ఈశాన్యము రక్షించే ఎంకన్నా జైహింద్
ప్రాణాలకు లెక్కించని పంజాబీ జైహింద్
అరచేతిలో తల ఉన్న అస్సామీ జై హింద్
సాదోబా జై హింద్ మదోజీ జైహింద్
మల్హారూ జైహింద్
******************

విశ్వనాథ సత్యనారాయణ
పాడినగీతమే మరల బాడెదం గూడిన భావమే మరి గూడెద వేమి పేయవలె గుండియ శోషలి దుఃఖ వేదనల్ గాడిన
నా హృదంతర ముఖంబున మా తొలినాటికీర్తి రాపాడిన నాదు వాక్కులెగబారదు నూత్నపథాల వెంబడిన్.

నా జాతి పూర్వ ప్రథాజీవరహితమై శక్తి నాడుల యందు చచ్చిపోయి
నా మాతృభూమి తేజో మహాశ్యుతుని బ్రహ్మ క్షత్రతేజంబు మంటగలిపి
నా మాతృభాష నానా దుష్ట భాషల యౌద్ధత్యమును తల నవధరించి
నా తల్లినేల నేనాటి వాచారముల్ పై మెరుగులు చూచి భ్రమసిపోయి
ఏమి మిగిలినదీనాటికిట్లు
పొంగులొలయు వర్షానదీ గభీరోదకముల
దైన్యగర్భచారిత్రముల్ దక్క భిన్నగిరి
శిఖర దుర్గ పరిదీన గీతి దక్క
***************


తుమ్మల సీతారామమూర్తి
నీ రమణమూర్తి కమనీయ వచస్స్ఫురణంబు దాతృతాగౌరవ  మద్వితీయ రసికత్వ విభూతి విశిష్ట శౌర్య విద్యా రుచిరత్వ మంతకొని యాడినా మత్కవితా పిపాస చల్లారదదేమి తల్లి! ఇది యారక మారక ఇట్లె నిల్చుతన్.
అన్నారు.
" తథాస్తు" అని దీవించును గాక తెలుగుతల్లికి తల్లి.


డా శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారిచే రచింపబడిన అర్థశతాబ్దపు ఆంధ్రకవిత్వం పుస్తకం నుంచి  తీసుకోబడిన వివరాలివి.

 _/\_        _/\_       _/\_         _/\_       _/\_      



































13, నవంబర్ 2014, గురువారం

అందరికీ తెలియవలసిన నిజాలు.

పూర్తి వివరాలకు ఈ వ్యాసం చదవండి.

http://tetageeti.wordpress.com/2014/11/13/nehru_the_great/#comment-2695

24, సెప్టెంబర్ 2014, బుధవారం

మనవిజయం --ఘనవిజయం

               ఈరోజు ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ సాధించని ఘనత సాధించిన మన భారతీయశాస్త్రవేత్తలందరికీ అభినందనలు వేల కోట్లుగా మన వందకోట్లమందీ ఇయ్యాల్సిన రోజు.

           స్వపరిజ్ఞానంతో ఎన్నో ఘనమైన విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల బృందం పదినెల్ల క్రిందట శ్రీహరికోటలో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ కోట్ల మైళ్ళ దూరం ప్రయాణించి  అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. నిరంతరం పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేసిన మన శాస్త్రవేత్తలు, వారికి జ్ఞానాన్ని పంచిన వారి పెద్దలు, వారి జ్ఞానాన్ని పంచుకోబోయే వారి శిష్యులు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు.

       మొదటి ప్రయత్నంలోనే సఫల ప్రయోగం జరిపిన భారతదేశం ఇతోధికంగా పొరుగుదేశాలకు తన జ్ఞానసంపదద్వారా లభించిన ఫలాల్ని పంచుకోవాలనుకోవడం దేశ గౌరవ చరిత్రకే గర్వకారణం.

   పొరుగు వారికి తోడ్పడే గుణమే కానీ కయ్యానికి కాలుదువ్వే అలవాటు ఎన్నడూ లేని సత్ప్రవర్తన మన చరిత్రది. మన వర్తమానం కూడా అదే అనుసరించాలంటే యువతరం జ్ఞాన పరిశోధనలో, కార్యసాధనలోనూ, పని నైపుణ్యంలోనూ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలువగలిగే రోజు తొందర్లోనే రావాలని , వస్తుందని ఆశిస్తూ.....


                  జయ సైన్యం ! జయ వ్యవసాయం ! జయ విజ్ఞానం !

5, ఆగస్టు 2014, మంగళవారం

ఏది నాది?

                                                
           నాది నాదనియేవు అని ఏదో పాట ఉంది కదా అట్లే మనమందరం నాది నాదని మురిసిపోతుంటాము కదా! కానీ నిజానికి చూస్తే ఏదీ నాది కాదు. ఏదీ మనది కాదు.
              ఉల్లిపొర ఒక్కొక్కటీ విడిపోయినాక కొనాకు ఏమీ మిగలనట్లే మన జీవితంలో కూడా ఒక్కొక్కటీ విడిపోతూ ఉండగా మనదంటూ ఏమీ లేదని తెలిసిపోతుంది. కానీ ఈ తెలియడం ఒక్కొక్కరికీ ఒక్కొక్క దశలో మాత్రమే అర్థమైతుంది. కొందరికి ఎప్పటికీ జీవితమంతా అర్థం కాకపోవచ్చును. కాకపోవచ్చనేముంది ముక్కాల్ భాగం మందికి అర్థమే కాదు. మాట ఒప్పుకున్నా మనసు ఒప్పుకోవడం కష్టం. మనసు ఒప్పుకున్నా ఆచరణలో పెట్టడం కష్టం.
               చిన్నప్పట్నించీ వాడినబట్టలు, పెరిగిన ఇల్లు, చదివిన బళ్ళు, కలిసిన స్నేహితులు అందర్నీ, అన్నిటినీ ఒక్కొక్కదాన్నీ నాది అనుకునీ, నాది కాదు అనుకునీ సులభంగా విడిచేస్తాం. సులభంగా ఎందుకంటే అంతకన్నా మంచిదో పెద్దదో మనకు తగినదో మనకు దొరుకుతుంటే విడిచిపెడుతుంటాం.దొరుకుతుందనే ఆశవంటిదున్నా కూడా  విడిచిపెడుతుంటాం.
        కానీ ఎప్పుడైతే ఇది పోతే మళ్ళీ రాదనీ దీన్ని విడిచిపెట్టలేననీ ఎప్పుడనుకుంటామో అప్పుడే కమ్మేస్తుంది దుఃఖం. ప్రాణం అల్లాడిపోయేంతగా. నాకు కావాలనీ , నేను విడిచిపెట్టననీ పోరాటాలు/హింసలు ఎన్నో.
అయినా జరిగేది జరక్కమానదు.
        పెళ్ళయితే ఆడపిల్లలు, ఎంతలేదన్నా కాదన్నా కొన్నాళ్ళ తరువాత అయినా మగవాళ్ళు కూడాముక్కాల్ భాగం మంది పుట్టినయింటినీ తోడబుట్టినవారినీ విడిచిపెడుతుంటారు. మగపిల్లలలో ఇంకొంచెం ఆలస్యంగా విడిచి పెడతారు. అందర్నీ, అన్నిటినీ కలుపుకుపోయే సామర్థ్యం అందరికీ ఉండడం కుదరదు. ఎవ్వరూ విలన్లు కాకపోయినా, అందరూ ఒకరి గురించి ఒకరు ఆలోచించే వాళ్ళయినా అంతా కలిపి మోసే భారం ఎక్కువై భారం తగ్గించుకోవాల్సి వస్తుంది . ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తమ సంపాదన, తమ పిల్లలు, తమ లక్ష్యాలు, లేదా మనశ్శాంతీ ఇదే కష్టమైతే ఏం చేస్తారు పాపం. విడిచిపెడుతుంటారు.
         తర్వాత పిల్లలు పెద్దయితే వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ప్రపంచం వేరైనపుడు వాళ్ళనూ విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎవరూ ఎవరికీ దూరం కాకపోవచ్చు. అయినా ఎక్కడో ఏదో బాధ ఉంటుందేమో కదా!
       తర్వాత తమ పనులు, లక్ష్యములు తమ ఇష్టాలు విడిచి పెట్టాల్సి వస్తుంది. అంతవరకూ ఆయా పనులు చేయటానికి ఉపకరించిన శరీరాంగాలు(దేహాంగాలు) సహకరించవు. అందువల్ల తమ పనుల్లో సహకరించే వ్యక్తులే వెళ్ళి విశ్రాంతి తీసుకోమంటారు. ఇక నీవు పనికి రావని అన్యాపదేశంగా చెపుతుంటారు.(నెగెటివ్ సెన్స్ లో చెప్పట్లేదు. ఫాక్ట్స్ !!) ఉద్యోగాలు, వ్యాపారాలు, వంటిళ్ళూ తమతర్వాతి తరాలకు విడిచిపెట్టాల్సి వస్తుంది. పని సామర్థ్యాలూ, పాలసీ విధానాలు, ఇంటి సామాన్లూ మనవని అనుకోకుండా విడిచిపెట్టాల్సి వస్తుంది.
           తర్వాత పూర్తిగా దేహం మొండికేయడం మొదలు పెడుతుంది.కళ్ళు, చెవులూ పని చేయరు. మాట స్పష్టత ఉండదు. కాళ్ళూ చేతులూ వణుకు రావడం లేదా చచ్చుపడడం జరగవచ్చు. దాంతో అంతవరకూ దేహయాత్రలో నిర్విరామంగా పని చేసిన దేహాంగాలు కళ్ళు, కాళ్ళు అయినా సరే  వాటిపై అభిమానం విడిచి పెట్టాల్సి వస్తుంది. అన్నిటికీ పక్కవాళ్ళ కాళ్ళ చేతులపై ఆధారపడాల్సి వస్తుంది.
       అట్లా ఉండే స్థితిలో ఏమనిపిస్తుంది? ఈ ఇల్లు నాదేనా వీళ్ళు నావాళ్ళేనా అనిపించే రోజూ రావచ్చు. (రావచ్చనే అన్నా.... అపార్థం చేసుకోవద్దు.)అంతకన్నా బెటర్ ఏదీ దొరకకపోయినా విడిచిపెడుతూ ఉండేటపుడు మనుష్యులు ఒకరినొకరు విడిచి పెట్టుకోకపోవచ్చు. కానీ మోహం విడిచేయాల్సిందే.
                      ఈలోకం మీద, తన గడ్డమీద, తన భూమి మీద , తన వాళ్ళమీద ఆఖరికి తన వంటిమీద కూడా......మోహం విడిచిపెట్టుకోవాల్సిందే. విడువనివాళ్ళకూ కాలం విడిపిస్తుంది. విడువకపోతే దేహమూ విడువలేక బ్రతుకూ చావుకూ మధ్య ఊగిసలాడాల్సిందే.
       కానీ చాలా చాలా కష్టం పుట్టినప్పటినుంచీ ఏళ్ళ తరబడి దశాబ్దాలతరబడి పెంచుకుంటూ వచ్చిన మోహాన్ని ఒక్కసారిగా విడిచిపెట్టడం. చాలానే కష్టం. కానీ తప్పదు. ప్రతిదశలోనూ విడిచిపెడుతూ ఉండాల. మనం వయస్సు పెరిగే కొద్దీ మోహం తగ్గించుకోవాల.
         నాది అనేది ఏదీ లేదీ ప్రపంచంలో. అన్నీ మనం కొంతకాలం వాడుకుంటామంతే. క్లాస్ రూమ్ లో బెంచీ మాదిరి, ట్రైన్ లో బెర్త్ మాదిరి, సినిమాహాల్లో ఫ్లైట్లో సీట్ల మాదిరి కొంతసేపు వాడుకున్నట్టే అచ్చంగా అదేవిధంగా ఈ లోకంలోని మనుష్యుల్నీ, బంధాల్నీ , వస్తువుల్నీ కొంతకాలం వాడుకుంటాము. అంతే కానీ ఏదీ మనది కాదు. ఏదీ నాదు కాదు.
            చివరగా ఒక చిన్న మాట హాయిగా నవ్వేసుకోండి. కానీ ఇదే పెద్ద జీవనసత్యం అనీ మరిచిపోవద్దు.
ఈ సమయంలో భగవంతుడు ఏం చేస్తుంటాడో అని ఒకరు అడిగితే ఇంకొకరు చెప్పారంట..... ఇప్పుడే కాదు ఎప్పుడూ ఆయన పకపకా నవ్వుతూనే ఉంటాడు. అని.
ఎందుకు అంటే ఈ భూమి నాదని ఈ భూమి నీదని వాళ్ళ పేర వీళ్ళపేర రాస్తూనే ఉంటారు. రాయించుకుంటానే ఉంటారు. కానీ ఏ ఒక్కరూ శాశ్వతంగా వాళ్ళ పేరుమీద ఉంచుకోలేకపోయినారు. అదే భూమికి హక్కు దారులుగా వేలమంది వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు అయినా నాదనుకొనే మనుష్యుల వెఱ్ఱి చూసి నవ్వుతుంటాడట.

29, జూన్ 2014, ఆదివారం

నీలమాధవా!


లోకాధిదైవతం దేవేశపూజితం జగన్నాథ నాయకం సదాఽహం స్మరామి!

ఈ వేళ పురుషోత్తమపురమైనటువంటి పూరీ పట్టణమునందు విరాజితమైన శ్రీ జగన్నాథుని రథయాత్రా మహోత్సవం ప్రారంభమైనది.

జగన్నాథుని నీలమాధవుడని కూడా పిలుస్తారు. గర్భగుడిలో ప్రధాన విగ్రహాలు దారు శిల్పాలు. అంటే చెక్కవిగ్రహాలు. ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి కొత్త చెక్కతో విగ్రహాలు తయారు చేస్తారు. అప్పటివరకూ ఉన్న పాత విగ్రహాలలో నుంచి ఒక దివ్యపదార్థం తీసి కొత్త విగ్రహాలలో పెట్టి తయారు చేస్తారు. అలా అది కొన్ని వందల ఏళ్ళ నుంచి వస్తూ ఉన్న ఆచారం. మతదురహంకారులైన కొందరు సుల్తానులు పాలించేటప్పుడు అన్ని గుళ్ళను ధ్వంసం చేసినట్లుగానే పురాతనమైన ఈ గుడి మీదా దండయాత్ర చేసేందుకు వచ్చారని, అప్పుడు అసలు విగ్రహాలు కొన్నేళ్ళపాటు ఎక్కడో దాచేసి, అదే రూపంతో వేరే విగ్రహాలు అప్పగించగా, వాటిని ఆ మూర్ఖులు బహిరంగంగా వ్రేలాడదీసి భస్మము చేసి సముద్రంలో పడవేశారని చెపుతారు.

జగన్నాథుని గుడి చాలా విశాలమైన పెద్ద గుడి. అంతేకాదు రథయాత్ర ప్రపంచంలోనే పెద్దరథయాత్ర అని చెప్తారు. లక్షలమంది పాల్గొంటారు. సాధారణంగా హిందువులని మాత్రమే దర్శనానికి అనుమతించినా, సర్వులకూ దర్శనం ప్రసాదించటానికి స్వామి గుడి బయటకు వస్తారు. మానవాళికే కాక తాను సృజించిన విశ్వం లోని ప్రతి జీవికీ దర్శనభాగ్యం కలిగించి మోక్షాన్ని ప్రసాదించే అవకాశం ఇవ్వటానికే స్వామి రథయాత్ర అని చెపుతారు. జగత్తుకే నాథుడు కదా మరి.

ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమయ్యే ఈ రథయాత్ర కు అవసరమైన రథాలను అంటే ౩ రథాలను (చక్రాలను, ఇరుసులను కూడా)వరసగా జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రకు ప్రతి సారి కొత్తగా తయారు చేస్తారు. రథయాత్ర పూర్తయ్యాక ఆ చెక్కను విక్రయిస్తారు. కొన్న జనాలు వాటిని తమ ఇంటికి సింహద్వారాలుగా బిగించుకొని శుభం జరుగుతుందని సంతోషంగా ఉంటారు.

పూరీ సముద్రతీరం చాలా అందమైనది. శుభ్రంగా ఉంటుంది కూడా. ప్రపంచవ్యాప్తం గా ఎంతోమంది పూరీని దైవదర్శనం కోసం, పురసందర్శనం కోసం కూడా వస్తారు.
(ఇది పాత పోస్టే.)

23, ఏప్రిల్ 2014, బుధవారం

భారత పునర్నిర్మాణం

దేశ సమగ్రతకు, సమైక్యతకు తగినట్టుగా ఆలోచించడం, నడచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత. తమతమ జీవన పోరాటం లో వ్యస్తులైన వారు ఈ బాధ్యత కోసం ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా నష్టం లేదు గానీ పూనుకొని సమైక్యతకు భంగం కలిగించే పని చేయకూడదు. చేసినచో శిక్షార్హులు.
            కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్నదేమి? జీవనపోరాటం కాక జగత్తంతటిపైనా ఆధిపత్యం సాధించాలనే తృష్ణతో స్వార్థపూరితమైన ఆలోచనలతో కనిపించిందంతా దోచుకొని తినే ప్రమాదకరమైన వ్యక్తులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ధనదాహం , అధికారదాహం అనే రోగానికి గ్రస్తులై ఎంతకైనా తెగించి స్వంత దేశస్థులనే అధోగతి పాల్జేస్తున్నారు. పరాయి వాళ్ళ మీద కూడా తలపెట్టని, కూడని విధ్వంసమంతా స్వంత వాళ్ళమీదనే చేస్తున్నారు. విదేశీయులు మనమీద దాడి చేసినపుడు గాని, దొంగదారుల్లో అధికారపీఠాలు ఎక్కినపుడు గానీ భారతీయులు ఎంతో ధీరత్వం, శూరత్వం ప్రదర్శించి జయించినారు.
        స్వదేశీయులే మాటలగారడీతో నమ్మబలికి చిత్రవిచిత్రమన పథక రచన చేసి సర్వనాశనం చేస్తుంటే సహనం వహించినారు కొంతకాలం. ఇంకెంతకాలం సహిస్తారు? దేవుని దయవలన ఎన్నోదేశాల్లో లేని ప్రకృతివనరులు, మానవ వనరులు , అద్భుతాల్ని సృష్టించ గల మేధావులు మన దేశం లో ఉన్నా అభివృద్ధి ఏదీ?
 అసలు మన దేశం అనే భావన ఉంటే కదా ముందుకు ఆలోచనలు చేయగలిగేది?
అభివృద్ధి అంటే తెలిస్తేనే కదా అమలు చేయగలిగేది?
అభివృద్ధి అంటే రైళ్ళు, రోడ్లు, పలు అంతస్తుల మేడలు, సబ్సిడీల లంచాలు కాదు. పథకాల పేరుతో మోసాలు కాదు. అధునాతనమైన పరికరాలు కాదు.
అభివృద్ధి అంటే స్వయం సమృద్ధి.
అభివృద్ధి అంటే అందరి అన్ని అవసరాలూ తీరడం. సౌకర్యాలు కలిగించడం కాదు.
అభివృద్ధి అంటే మనదగ్గర ఉన్న దాన్ని పెంచి పోషించుకోగలగడం అంతే కానీ కొండలున్నా కరిగించి తినేయడం కాదు.
ఇంట్లో పిల్లలకు నచ్చుతాయని ఎప్పుడూ బేకరీ తిండ్లు, తీపి పదార్థాలతో కడుపు నింపుతూ, ఇరవైనాలుగు గంటలూ టీవీ ఇంటర్నెట్టు ఇతర దుర్వ్యసనాలతో పొద్దు పుచ్చనిస్తే వాడి అభివృద్ధి జరిగినట్టేనా? కాదు. వాడి శరీరం రోగభరితం అవుతుంది. వాడిమనసు క్రూరమైతుండి. వాడి తెలివి మసక బారుతుంది.
పెద్దవాడై అష్టకష్టాలూ పడతాడు.
అలాక్కాక వాడికి తగినంత వినోదము కల్పిస్తూ మంచిచెడులు బోధిస్తూ లోక జ్ఞానమూ తెలిసేలా చేస్తూ, ప్రేమను అందిస్తూ తెలివికి పదును పెడుతూ ఉంటే, పెద్దవాడై వాడు సుఖపడతాడు. నలుగురి కి ఉపయోగపడతాడు. మంచి పేరు తెచ్చిన సంతోషంతో శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా నిలిచి అందరికీ ఆదర్శప్రాయుడైతాడు.
పై రెండు దారుల్లో ఏదారిలో పెంచాలన్నా పెంచేవాళ్ళకు కష్టపడవలసే వస్తుంది. కానీ ఫలితం ఏది మంచిది అని ఆలోచించాల.
మొదటిది మంచిది అనుకొనేవాళ్ళకు కొడుకు మీద ప్రేమకన్నా తమ ప్రేమ కొడుకు, ప్రపంచానికి తెలియాలన్నదే ముఖ్యంగా ఆ ప్రేమ ప్రదర్శనపు ఆరాటంలో పడి అసలు ప్రేమను ఎక్కడో విడిచి పెడతారు.
రెండవదే మంచిది అని నిర్ణయించుకోవాలంటే వాడిమీద నిజమైన ప్రేమ ఉండాల. నా స్వంత కొడుకనే భావన ఉండాల. వాడి అభివృద్ధిని మనసారా కాంక్షించాల.
ఇక్కడ ప్రేమ ప్రదర్శన ముఖ్యం కాదు. ఆప్రేమ కొడుకు విజయంలో వాడికి అన్ని విధాలా తోడ్పడాలన్నదే ముఖ్యం. అపుడు ప్రదర్శన మీద మోజు పోయి నిజమైన తోడ్పాటు ను అందించగలరు.
ఇదే దేశానికీ వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ దేశం  మనది, ఈ దేశం నాది అనుకుంటామో అప్పుడే  ఈ దేశం సమైక్యతను గురించీ, అభివృద్ధి గురించీ ఆలోచించగలము, మాట్లాడగలము.
దేశమంతా ఒక్కటే అందరు దేశవాసులు నా వాళ్ళే అనుకున్నపుడు బుజ్జగింపు ధోరణులు, మసిపూసి మారేడుకాయలు చేయడాలూ ఉండవు. దేశంలోని సహజ వనరులైన ప్రకృతి వనరులు, మానవవనరులు దుర్వినియోగం కాకుండా ఆపగలిగే సంకల్పం ఉండాల.
అంటే భూమిపైన ఉన్న భాగాన్ని, లోపల ఉన్న గనులను అక్రమంగా అమ్ముకొనే వాళ్ళను కట్టడి చేయాల. అపుడే దేశానికంతా భూమి పైభాగమూ, లోపలిభాగమూ ఉపయోగపడుతుంది. నల్లధనాన్ని కన్వర్ట్ చేయడానికి పరిశ్రమల పేరుతో భూములను అక్రమంగా కొని వృథాగా పెట్టడమూ, లేదా లోపలి వరకూ గనులు త్రవ్వి ఖనిజాలను అంటే అత్యంత విలువైన ముడిసరుకును  విదేశాలకు అమ్మడం ఆపాల.
ముడిసరుకు అమ్మకుండా భూమిపైన పరిశ్రమలు పెట్టి వాటిని ప్రాసెస్ చేయగలిగితే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. తయారైన సరుకును విదేశాలకు చట్టపరంగా అమ్మితే మరింత లాభమూ, ప్రపంచ వ్యాపారరంగంలో పేరూ నిలుస్తాయి.
నీటివనరులను ఎక్కువైన చోటినుంచి తక్కువైన చోటికి కాలువలుగా పారించి, అన్ని వైపులా సస్యశ్యామలం చేయగలిగే విధానాలెన్నో శ్రీ స్వామినాథన్ వంటి వారు చెప్పినా పట్టించుకోకపోతే అభివృద్ధి ఎట్ల సాధ్యమైతుంది?
ఏ ఆనకట్టనైనా సంకల్పం వరకే అటు తర్వాత వచ్చే నిధులన్నీ మింగే వాళ్ళ నోళ్ళలోనికే పోతున్నాయి.
పెద్ద రాజకీయ నాయకులు, శ్రీమంతులు, ప్రభుత్వ భవనాలో వృథా గా పోయే విద్యుత్తుని ఆదా చేస్తే సామాన్యుడికి విద్యుత్కోత బాధలేకుండా చేయగలిగే మేధావులు మనకున్నారు. వారిమాట ఒప్పుకొనే నేతలే లేరని పుస్తకాలకు పుస్తకాలు అవినీతి కుంభకోణాల గురింఛి వ్రాసి ప్రచురిస్తున్న ప్రభుత్వ ఉన్నతోద్యోగులను చూస్తే తెలియడ లేదా?
ఈ విధంగా భూమి , నీరు , నిప్పులను అన్యాయంగా వ్యర్థం చేస్తున్న వ్యవస్థ పోవాల.
యువతరం లో ఉత్తేజం కలిగించాల. దేశభక్తి భావనను రగుల్కొల్పాల. మనదేశం బాగుపడాలని మది నిండా ఆకాంక్షించే వారే నిజమైన మార్పు తేగలరు.

మనదేశానికి ప్రధానమంత్రి కాబోతున్న శ్రీ నరేంద్రమోడీలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అతడు మాత్రమే కాక అతన్ని వెన్నంటి నడచే యువత కూడా మన దేశాన్ని అభివృద్ధి , స్వీయసమృద్ధి బాటలోకి నడిపించబోతున్నది.
భాజప ఆదర్శాలు, ఆచరణ వల్ల మొదటినుంచీ ప్రభావితురాలినైనా రాష్ట్రం విడగొట్టిన తీరులో వారి పాత్ర వలన ఆ పక్షం మీద ఆరాధన లేకపోయినా నరేంద్రమోడీ నాయకత్వం మీద నమ్మకముంది. అతడు చేసి చూపించిన అభివృద్ధి ఆశలు పెంచుతున్నది.
భారత పునర్నిర్మాణం మనందరి చేతుల్లో ఉంది. దేశభక్తుడై భారతీయులందర్నీ ఒక్కతాటిపై నడిపించగలిగే శక్తి సామర్థ్యాలున్న నరేంద్రుని చేయీ చేయీ కలిపి అనుసరించే తరుణం ఇది. దేశాన్ని సర్వతో ముఖాభి వృద్ధి చెందిన స్థితిలో నిలపాలంటే నరేంద్రమోడీ ని గెలిపించాలని మిత్రులందర్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

20, మార్చి 2014, గురువారం

విద్వేష రాగాలు

     శుభాన్ని ఆశించడం, శుభాకాంక్షలతో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమూ, ఆచరణయోగ్యమూ అయినటువంటి స్వభావ లక్షణము అనిపించుకుంటాయి.
        సార్వజనీనమైన జీవనము గడిపేవారు, సమాజం గురించి ఆలోచించి, తపించి, సమాజాభివృద్ధి చేయాలనుకొనే వారు పై విధముగా తమను తాము మలచుకోవాల గానీ ఎంతసేపున్నా ద్వేషాలను రగిలిస్తూ అందరి దృష్టీ తమమీద పడాలని కోరుకొని తదనుగుణంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇన్నాళ్ళూ నోటికొచ్చిందల్లా హద్దూ అదుపూ లేకుండా మాట్లాడి, ఋజువులే లేని నిరాధార ఆరోపణలు, నిందలు మోపి తిట్టి తిట్టి పోసి  ప్రజల మనసులను భూభాగాలను ముక్కలు చేసినది చాల్లేదని ఇంకా ఎందుకీ ద్వేష రాగాలాపన? అంటే ఒక్కటే ఎన్నికల సమయములో ఈ విధంగా మాట్లాడితే స్వార్థ ప్రయోజనాలు దక్కుతాయి. ఏ పదవులు ఆశించి ఇవన్నీ చేసినారో అవి అందే సమయము. కాబట్టి ఇప్పుడు ఇవి ఆపడం కుదరదు.
      పదవులు దక్కినాక కూడా ఆపడం జరుగదు. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఎదుర్కొనే కష్టనష్టాలకు కూడా గతంలో అవతలి వాళ్ళు చేసిన మోసాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు.
ఇంకా ఎన్నేళ్ళో ఈ నీలాపనిందలు ప్రజలందరూ భరిస్తూనే ఉండాల. మా రాయలసీమ, మా తెలంగాణ, మా కోస్తా జిల్లాల వారెవరూ ఈ పరిణామాలతో ఆనందంగా లేరు. ప్రజలెవరూ బయటికొచ్చి ఏ సంబరాలూ జరుపుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. ఉద్యమాల్లో పాల్గొన్న సమూహాలు, కార్యాచరణ సమితులు సంబరాలు జరుపుకున్నారే కానీ సామాన్యులెవరూ సంతోషంగా లేరు.  పదవీలాభాలు తప్ప  ఇంకేమీ ఒరగని ఈ ప్రక్రియలో ఎన్ని లోపాలున్నాయో రాన్రాను బయటపడతాయి.
         రాజుల  రాజ్యాధికార విస్తరణకాంక్ష ను, వారి యుద్ధాలను తప్పుబట్టని వారే లేరు. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అదికాదా? వీలైనంత వరకూ పదవులు, అధికారాలు పొందాలనే కాంక్ష లేని నేతలెందరు? అది దక్కని వారు అసమ్మతులను, ద్వేషాలను పెంపొందించడం సర్వసాధారణము. ఆ ప్రక్రియలో ప్రజల ఐక్యతను దెబ్బదీసి లాభం పొందాలనుకొనే వారు ఆజ్యం పోయడం. ఇంకేముంది? కొత్త రాజ్యాలనేర్పాటు చేసికొని మరీ విస్తరణకాంక్షలను తీర్చుకుంటారు.
     ఇన్నాళ్ళూ ఏ పిల్లల అమాయకపు బలిదానాలనైతే మెట్లుగా చేసికొని పీఠాలెక్కినారో ఇప్పుడు వారినే తృణీకరించడం , కావాలంటే తెలంగాణా రత్న వంటి బిరుదులిస్తాము, ఉద్యోగాలిస్తాము, పరిహారాలిస్తాము కానీ పదవుల్లో భాగం మాత్రం పంచము అనే స్వార్థ పూరిత నిర్లజ్జాకరమైన వ్యాఖ్యానాల్ని వింటున్న సమాజము , కాలము నేర్పబోయే గుణపాఠం గురించి ఎదురుచూస్తూ ఉంది.

2, మార్చి 2014, ఆదివారం

సామాజిక ధర్మం

                             ఏది జయం? ఏది అపజయం? ఏదిఎన్నాళ్ళు? ఈరోజు వచ్చిన ఫోన్ రేపుండదు. ఈరోజున్న మనిషి రేపుండడు. అన్నీ చూస్తూ కూడా ఏదో ప్రపంచాన్ని జయించేస్తున్న భావనలో మనిషి ఎందుకుంటాడు?

                  నేను లేకపోతే ఇది ఆగిపోతుంది. నేను కాబట్టే ఇంత బాగా చేసినాను. ఇంకెవరైనా ఏమి చేస్తారనే అహంకారం ఎందుకు వస్తుంది? ఎగిరిపడుతున్న ఈ శరీరం ఒక దశలో కదలకుండా మంచం పట్టి ఉండబోతుందేమో, ఎవరికి తెలుసు? ఇప్పుడు అట్లున్న వారు కూడా ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నామన్న భావనతో బ్రతకలేదూ?ఏమయింది చివరకు? మనకెమవుతుందో మనకు తెలుసా? ఎందుకీ మిడిసిపాటు? ఏమి చూసుకొని? ప్రతి నిముషమూ తనను మించిన వారు కనిపిస్తూనే ఉన్నా నాకీ ప్రత్యేకత ఉందని అనుకోకపోతే మనిషి ఎందుకు బ్రతకలేదు?

                        సాధించలేకపోతే , అనుకున్న స్థాయిలో ఏదైనా చేయలేకపోతే ఎందుకు క్రుంగిపోవడం? ఒక చిన్న ప్రశంస కనిపించినా ఎందుకు పొంగిపోవడం. నన్ను గుర్తు పెట్టుకున్నారనగానే , నాకోసం వీళ్ళిది చేస్తారు, చేసినారనగానే ఎందుకంత సంతోషం? ఏది నిజం , ఏదబద్ధం? కనిపించినదానికి ఆ పక్క ఏముంది? అది తెలిసేవరకూ తుళ్ళిపడడం, తెలిసింతర్వాత కుళ్ళుకోవడం ఏదైతే నాకోసం/నాది/ నావల్ల అనుకున్నామో అది కాదని మిగతా వారికోసమంటే తెలిసింతర్వాత  కుళ్ళుకుంటారు కదా!

                        రాజకీయాల్లో ఉన్న వాళ్ళని అనడం ఎందుకు? వాళ్ళు డబ్బు అధికారం కోసం చేసేది మిగతా అందరూ మంచితనమనుకున్నదానికోసం చేస్తున్నా ఏది ఉంటుంది? ఎన్నాళ్ళు అనే ప్రశ్న అన్నిటికన్నా పెద్దది. ఏది మంచి ఏది చెడు అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఏ ప్రాతిపదిక మీద? మంచి కి చెడుకు మధ్య ఒక చిన్న నూలుపోగంత తెర ఉన్నసందర్భాల్లో ఆ జవాబు ఇచ్చేదెవరు? అన్ని దేశకాల మాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ, ప్రతి ప్రాంతానికీ, ప్రతి కాలానికి మారే ధర్మం యొక్క రూపురేఖలేమవి? అందరికీ వర్తించే సామాజిక ధర్మమేది?

                     సామాజిక ధర్మాన్ని అనుక్షణం కాపాడే వ్యవస్థ కాలం చెల్లిపోయింది. ఎక్కడో అక్కడా అక్కడా ఉన్నా మొత్తంగా అందరూ అంగీకరించే ఒక వ్యవస్థ ఇంక లేదా? అటువంటిదే సమాజాన్ని రక్షణ కవచంగా తన కర్తవ్యాన్ని నిర్వహించి సమాజాన్ని కాపాడుతుంది. హెల్మెట్ ధరించడం ఇబ్బందిగా ఉందనో, అందం కనిపించదనే ఒక మాయలోనో పడి విడిచిపెడితే,పడితే.. ఏమవుతుంది? అదే మనము సామాజిక ధర్మాన్ని విడిచి పెట్టడం వలన వచ్చిన నష్టము. ఆచారవ్యవహారాలు పాటిస్తూ సాటిమనిషి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ, మంచి చెడు ల విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించే మంచి అలవాటున్న సమాజాన్ని స్వంత సుఖము, విశృంఖలత్వం, వ్యాపారదృష్టి తో నిరంతరమూ నాకెమి వస్తుందనే ధొరణి పెంచుకున్నాక సామాజిక ధర్మం అనేది నశించిపోయింది. ఇప్పుడు అన్యాయాలు జరుగుతున్నాయో అంటూ గోలపెట్ట్డడం కన్నా, కవచం వంటిది, జనబాహుళ్యానికి ముఖ్యమైనదీ అయిన హెల్మెట్ వంటి సామాజిక ధర్మాన్ని అవతలపెట్టి వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయం.తప్పునితప్పు అని చెప్పేవాళ్ళెవరూ ఇక్కడ లేరు.ప్రతి తప్పుకీ మూలకారణాన్ని అన్వేషించి సమర్థించుకో దలిస్తే మంచి నుంచి చెడుని వేరుగా తీసి పెట్టగల నైపుణ్యం కొరవడుతుంది. సమాజం యొక్క అస్తిత్వం రూపురేఖలు లేకుండా మాసిపోతుంది.
అటువంటి పరిస్థితిని తెచ్చుకోక ముందుగా మేలు కుంటే బయటి సమాజానికి , లోపలి యజమానికి ఋణం తీర్చినవాళ్ళమవుతాం.

20, ఫిబ్రవరి 2014, గురువారం

పాలకుండలో విషపు చుక్కలు


పాలకుండలో విషపు చుక్కలు
జాలిగుండెలో విషాద ఛాయలు
 కన్నుల వెంట కారిన కన్నీళ్ళు
గుండెల మంటల నెగదోయుచున్నవీ...వగ పెంచుతున్నవీ...

మనదీ రాజ్యం మనదీ రాష్ట్రం యనెడి మాటలు కల్లలు కల్లలు
మనలో మనకే సఖ్యత లోపం ధనపు ముల్లెల యాశలు కొల్లలు
ఘనత వహించిన పదవుల కొఱకై చీరుతున్న పదునైన ముల్లులు

చేజారినవెన్నో  హిమవనులు, తక్షశిలలు విభజన వాదుల ఆకాంక్షల కొలుములకు...
బీజాలవి  పక్కన బల్లెపు పెనువృక్షాలకు ఆరని జ్వాలల శత్రుత్వఫలములకు...
మోజూ మోహము- మనదని రాజ్యము పిల్లల మనసుల పెంచగనేలా త్రుంచగనేలా?

 

8, ఫిబ్రవరి 2014, శనివారం

మయూరుని సూర్యశతకము-పదకొండవభాగము-అర్థము- సమాప్తము

96. ఏతత్పాతాళపఙ్కప్లుతమివ తమసైవైకముద్గాఢమాసీ
దప్రజ్ఞాతాప్రతర్క్యం నిరవగతి తథాలక్షణం సుప్తమన్తః
యాదృక్సృష్టేః పురస్తాన్నిశి నిశి సకలం జాయతే తాదృగేవ
త్రైలోక్యం యద్వియోగాదవతు రవిరసౌ సర్గతుల్యోదయో వః ॥

అర్థము

యద్వియోగాత్= ఏ పని ఎడబాటు వలన , ఏతత్ త్రైలోక్యం = ఈ మూడు లోకములు, భువనత్రయము, పాతాళపంకప్లుతమివ= పాతాళలోకమందలి బురదతో పూయబడినదానివలె, తమసా= చీకటితో, ఏకం= ఏకమైనదై, ఉద్గాఢం= మునిగినది, ఆసీత్ = అయినదో, మరియు అప్రజ్ఞాతాప్రతర్క్యం= తెలియబడనిదై, ఊహింపవీలుకానిదై, నిరవగతి = గమనము లేనిదై, తథా= అట్లే, అలక్షణం = గురుతులు లేనిదై, అన్తస్సుప్తం=లోపలనిద్రించునదై యున్నదో, మరియు సృష్టేః పురస్తాత్ = సృష్టికి పూర్వము, నిఖిలం= సమస్తమును , యాదృక్ =ఎట్టిదయి యున్నదో , నిశినిశి = ప్రతి రాత్రి యందును , తాదృగేవ జాయతే= అట్టిదే యగుచున్నదో , అసౌ = అట్టి ఈ, సర్గతుల్యోదయః = సృష్టితో సమానమయిన ఉదయము గల, రవిః =సూర్యుడు, వః = మిమ్ము, అవతు= రక్షించుగాక.

భావము (నాకు తెలిసి)
ఏ సూర్యోదయము లేనట్లయితే , ఈ మూడు లోకములు పాతాళలోకపు మొత్తం బురద పూయబడినట్లుగా, చీకటిలో మునిగిపోతాయో, అంతే కాక ఊహింపవీలే లేనంతగా కంటికి ఏమీ కనిపించనట్లుగానూ, నిద్రలో మునుగుట వలన గమనము ఆగి పోయినదై, సృష్టి కి మొదలు ఉన్నట్లుగా మారి పోతుంటాయో, అవే లోకములను తిరిగి ఉదయముతో సృష్టిని ఆరంభించినట్టుగా అగుపించేవిధంగా చేయగల ఆ సూర్యుడు మిమ్ము రక్షించుగాక.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

97. ద్వీపే యోస్తాచలోస్మిన్భవతి ఖలు స ఏవాపరత్రోదయాద్రి
ర్యా యామిన్యుజ్వ్జలేన్దుద్యుతిరిహ దివసోన్యత్ర తీవ్రాతపః సః
యద్వశ్యౌ దేశకాలావితి నియమయతో నో తు యం దేశకాలా
వవ్యాత్స స్వప్రభుత్వాహితభువనహితో హేతురహ్నామినో వః ||

అర్థము
యః = ఏది, అస్మిన్ ద్వీపే= ఈ ద్వీపమందు , అస్తాచలో=  సూర్యునకస్తమయ పర్వతము, భవతి= అగుచున్నదో, స ఏవ= అదియే, అపరత్ర= వేరొక ద్వీపమందు, ఉదయాద్రిః = సూర్యునకుదయించు పర్వతమగుచున్నది. మరియు ఇహ= ఈ ద్వీపమందు, యా= ఏది, ఉజ్జ్వలేందుః = చంద్రుడు ప్రకాశించుచున్న, యామినీ= రాత్రియగుచున్నదో, సా= అది, అన్వత్ర= యింకొకద్వీపమున, దీప్తాతపః = ఎండమండుచున్న, దివసః = పగలగుచున్నది, దేశకాలౌ= దేశకాలములు , యద్వశ్యే= ఎవనికి వశములగుచున్నవో, ఇతి= అని ,యం= ఎవనిని, నోతు, నియమయతః =నియమింపకున్నదో, సః= అట్టి స్వప్రభుత్వాహీత భువనహితః= తన ప్రభుత్వము చేత జగత్తుకు హితము చేయు , అహ్నాంహోతుః= పగళ్ళకు హేతువయిన, ఇనః= సూర్యుడు, వః= మిమ్ము, అవ్యాత్= రక్షించుగాక.

భావము(నాకు తెలిసి)
అనేక ద్వీపముల నిలయమైన ఈ భూమియందు ఒకద్వీపమున సూర్యుడస్తమించిన పర్వతమే మరియొక ద్వీపమున ఉదయించిన పర్వతమగుచున్నది. (అనగా మనకు పడమరగా కనిపించునది పడమటి దేశాలకు తూర్పు అగుచున్నది). ఒకద్వీపమందు చంద్రుడు వెలిగే రాత్రిగా ఉండగా, మరొకద్వీపమందు ఎండమండే పగలగుచున్నది. ఈవిధముగా భూమిని వసించే జనులు దేశకాలములకు వశులై (లోబడి) ఉన్నారు. కానీ ఎవ్వనినైతే దేశకాలములు వశము చేసుకొనజాలవో అట్టి దినకరుడైనవాడు తన ప్రభుత(పాలన) చేత  మిమ్ముల రక్షించుగాక.

+++++++++++++++++++++++++++++++++++++++

98. వ్యగ్రై రగ్ర్య గ్రహేన్దు గ్రసనగురు భరైర్నో సమగ్రైరుదగ్రైః
ప్రత్యగ్రై రీషదుగ్రై రుదయగిరిగతో గోగణైర్గౌరయన్‌ గామ్‌
ఉద్గాఢార్చిర్విలీనామర నగర నగగ్రావ గర్భామివాహ్నా
మగ్రే శ్రేయో విధత్తే గ్లపయతు గహనం స గ్రహగ్రామణీర్వః ॥

అర్థము

యః = ఎవడు, అహ్నాం అగ్రే = పగళ్ళ మొదళ్ళ యందు (ప్రాతఃసమయములందు), ఉదయగిరి గతః = ఉదయాచలమున నున్నవాడై, వ్యగ్రైః = జాగరూకములయినవియు, అగ్రైరర్గ్యగ్రహెన్దుగ్రసన గురుభరైః =  యెదుటనున్న కుజాది గ్రహములును చంద్రుని మ్రింగు మహాకార్యభారము కలిగినవియు గ్రహాదుల కాంతినతిశయించివని అర్థము) ,నో సమగ్రైః = సంపూర్ణములు కానివియు (అప్పుడే ఉదయించుచుండుట చేత), ఉదగ్రైః = గొప్పవియు, ప్రత్యగ్రైః = కొత్తవియు, ఈషదుగ్రైః =  కొంచెము తక్షణములయినవియునగు , గోగణైః = కిరణసమూహముల చేత , గాం= భూమిని గౌరయన్ = తెల్ల బరచుచు , ఉద్గాఢార్చిర్విలీనామర నగర నగగ్రావగర్భాం ఇవ= (సూర్యుని) గండశిలలను గర్భమున ధరించినదో అనునట్లు , విధత్తే  = చేయుచున్నాడో, సః = అట్టి, గ్రాహగ్రామణీః = గ్రహపతి అయిన సూర్యుడు , అగ్రేః = ముందు, వః = మీ యొక్క , గహనం = పాపమును , గ్లపయతు = క్షీణింపజేయు గాక.

వివరణము
సాధారణముగా సూర్యోదయసమయమున తెల్లవారుచున్నదందురు . అంతవరకు చీకట్లో అంతయు నల్లగానుండును. సూర్యోదయములో భూమి యంతయు తెల్లవారును. అప్పుడు నగరాదులు భూమి గర్భముననుండును. కవి యిచ్చట గర్భిణి అగు స్త్రీ తెల్లల్నగుటను ధ్వనింపజేసినాడు.

భావము (నాకు తెలిసి)

గండశిలలను గర్భమున ధరించినట్లున్న భూమిని తన క్రొంగొత్త లేత శ్వేత కిరణములతో తెల్లబరచు కుజాది గ్రహపతి అయిన సూర్యుడు మీ పాపములను క్షయము చేయుగాక. ( ఈ పద్య భావం మరింత పరిశీలించి వ్రాయవలసి ఉన్నది.)

=====================================
99. యోనిః సామ్నాం, విధాతా మధు రిపు, రజితో ధూర్జటిః శంకరోసౌ,
మృత్యుః కాలో,అలకాయాః పతిరపి ధనదః, పావకో జాతవేదాః
ఇత్థం సంజ్ఞా రివిత్థాది వద మృతభుజాం యా యదృచ్ఛాప్రవృత్తా
స్తాసామేకోభిధేయ స్తదనుగుణగుణైర్యః స సూర్యోవతాద్వః ॥

అర్థము
విధాతా= బ్రహ్మ, సామ్నాం = సామములకు (సామవేదములకు) , యోనిః = కారణము, ముధురిపుః = విష్ణువు, అజితః = ఓడిపోవనివాడు, ధూర్జటి = శివుడు , శంకరః = శుభములు కలుగ జేయువాడు, మృత్యుః =మృత్యుదేవత, కాలం= కలనా స్వభావము కలది (లోకములను పరిణామ శీలములుగా చేయు స్వభావము కలది) , అలకాయాః పతిః అపి = అలకాపట్టణమునకు పతియగు కుబేరుడు, ధనదః = ధనము నిచ్చువాడు , జాతవేదాః = అగ్ని పావకః , (పవిత్రముగా చేయువాడు), యిత్థం= ఈ ప్రకారముగా, అమృతభుజాం= దేవతల యొక్క , యాః సంజ్ఞాః = ఏ పేరులు, (డబిర్ధాది వత్ డబిర్ధాది శబ్దముల వలె ), యదృచ్ఛా ప్రవృత్తాః =యదృచ్చచేత ప్రవర్తించినవో (సార్థకములు కాక ప్రవర్తించినవో యని), తా సామేవ= ఆ పేరులకే (పేళ్ళకే) , అనుగతః గుణగణైః= తనకున్న గుణముల చేత, యః = యెవడు , అభిధేయః = చెప్పదగిన వాడయి యుండెనో, సః= అట్టి, సూర్యః = సూర్యుడు  , వః = మిమ్ము ,అవతాత్= రక్షించుగాక.

తాత్పర్యము
బ్రహ్మాది దేవతలకున్న "సామములకు కారణము" అని మొదలుగానున్న ఆయా పేరులు సార్థకములు కావు , ఆ నామధేయములన్నియును సూర్యునికే అన్వర్థములని , డిద్ధడబిద్ధవంటి శబ్దముల కర్థము లేదు. బ్రహ్మదేవతలకున్న సామయోని అజిత, శంకరాది నామములు డిద్దడబిద్దాదులు వంటివే , సూర్యునకయినచే అవి సార్థకములయినవి.

భావము (నాకు తెలిసి)

సామములకు కారణస్వరూపుడని బ్రహ్మను, ఓడిపోనివాడని మధురిపు(విష్ణువు)ను, శుభములనిచ్చు వాని శం కరుడని , కలనాస్వభావము (మార్పుకుకారణము) గా కాలమును, కుబేరుని ధనప్రదాత యని, అగ్నిని పావకు(పవిత్రముగా చేయువా)డని, ఈ రీతులుగా ఏ ఏ పేరులు దేవతలకున్నవో అంతకన్నా ఎక్కువగా సూర్యభగవానునకు అవి సక్రమంగా నిరూపించబడతాయని ,అట్టి సూర్యుడు మిమ్ముల రక్షించుగాక.

*************************************
100. దివః కిం బాన్ధవః స్యాత్ ప్రియసుహృద థవాచార్య ఆహోస్విదర్యో
రక్షా చక్షుర్ను దీపో గురురుత జనకో జీవితం బీజమోజః
ఏవం నిర్ణీయతే యః క ఇవ న జగతాం సర్వథా సర్వదాసౌ
సర్వాకారోపకారీ దిశతు దశశతా భీషు రభ్యర్థితం వః  ॥

అర్థము
జగతాం = లోకములకు ,దేవః కిమ్= దేవుడా , బాంధవః స్యాత్ బంధువగునా, అధవా= లేక ప్రియసుహృత్ = ప్రియమైన మిత్రమా ! ఆర్యః = కులదైవతమా, రక్షా = రక్షణమా (రక్షకుడా అని) చక్షుః ను= నేత్రమా? దీపః= దీపమా, గురు= అజ్ఞానాంధకారమును పోగొట్టువాడా, ఉతః= లేక జనకః = తండ్రియా? జీవితః= జీవితమా ! బీజం= కారణమా ! మోజః = బలమా! ఏవః= ఈ ప్రకారము ,యః= ఎవడు , కిమితి = ఏ ఒక్కటి అని న నిర్ణీయతే= నిర్ణయింపబడకున్నాడో, అసౌ = అట్టి ఈ సర్వభాసర్వద= అన్ని విధములుగా అన్నిటిని యిచ్చునట్టి సర్వాకారోపకారీ , అన్ని ఆకాశముల ఉపకారము చెయు దశశతభీషుః = సహస్రకిరణములు గల సూర్యుడు, వః= మీకు అభ్యర్థితం = కోరబడినదానిని,  దిశతు= యిచ్చుగాక.

భావము (నాకు తెలిసి)
లోకములకు ఆ సూర్యుడు దేవుడా/బంధువా? ప్రియస్నేహితుడా/ కులదైవమా? రక్షణమా/ నేత్రమా, దీపమా/ అంధకారమును పోగొట్టువాడా? లేక తండ్రియా/ జీవితమా, బీజమా/ బలమా ? ఈ ప్రకారపు కొలతలవి రవిని అంచనా వేయుటకై చాలవు. వీటిల్లో ఒకటిగా ఎవడు నిర్ణయింపబడకుండా నిలిచినాడో అట్టి సర్వోపకారి అయిన వాడే  ఆ సూర్యుడే , అట్టి సహస్ర కిరణములు గల సూర్యుడు , మీకు కోరినవి యిచ్చుగాక.

ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ
                             ___ఫలశ్రుతి______
101. చత్వారింశత్ ప్రభాయాస్త్రయమథచ పునర్వాజినాం షట్కయుక్తం
పశ్చాన్నేతుర్ ద్విషట్కం పునరపిచ దశస్యందన స్త్ర్యైకముక్తం
భూయోష్టౌ మండలస్య , స్ఫుటమథంచ రవేర్వింశతి శ్శ్రీమయూరే
ణేత్థం ప్రాతః పఠేద్యశ్శతకమనుదినః సూర్యసాయుజ్యమేతి ॥


అర్థము
ప్రభాయాః = ప్రభయొక్క (సూర్యప్రభను గురించి), చత్వారింశత్త్రయం = నలుబది మూడు (శ్లోకములు), అథచ పున= తరువాత మళ్ళీ, వాజిన= గుఱ్ఱముల యొక్క (గుఱ్ఱములను ) గూర్చి, షట్కం= ఆరు, ఉక్తం= చెప్పబడినది (బడినవి), పశ్చాత్ =తరువాత, నేతుః = అనూరునకు, ద్విషట్కం= పండ్రెండు , పునరపిచ = మరియు , స్యందనస్య= రథము యొక్క (గురించి) , దశ ఏకం= పదునొకండు , ఉక్తం= చెప్పబడినది, భూయః = తరువాత, మండలస్య = మండలముయొక్క (గూర్చి) , అష్టౌ= యెనిమిది , అధచ= తరువాతను, స్పుటం= స్ఫుటముగా, రవేః = సూర్యునకు గాను, వింశతిః = యిరువది, ఇత్థమ్= యిట్లు , శ్రీమయూరేణ= శ్రీమయూరకవి చేత, ఉక్తం= చెప్పబడిన , శతకం= శతకమును, యః= ఎవడు , అనుదినం= ప్రతిదినమందు ,ప్రాతః =ఉదయమున , పఠేత్ =పఠించునో, వాడు సూర్యసాయుజ్యం = సూర్యసాయుజ్యంను, ఏతి = పొందును.

భావము

సూర్యప్రభను గురించి నలభైమూడు, గుఱ్ఱముల గురించి ఆరు, అనూరుని గురించి పండ్రెండు, రథము గురించి పదునొకండు, భూమండలమును గురించి యెనిమిది, తర్వాత రవి గురించి స్పష్టముగా ఇరవై గా శ్రీ మయూరకవి చేత చెప్పబడిన ఈ శతకమును ఎవరు ప్రతిదినము ఉదయమున పఠించునో వాడు సూర్యసాయుజ్యమే పొందును.

 ఫలశ్రుతి (పాఠాంతరము)

101. శ్లోకా లోకస్య భూత్యై శతమితి రచితాః శ్రీమయూరేణ భక్య్తా
యుక్తశ్చైతాన్పఠేద్యః సకృదపి పురుషః సర్వపాపైర్విముక్తః
ఆరోగ్యం సత్కవిత్వ మపి మతులబలం కాన్తి మాయుః ప్రకర్షం
విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే స్తోత్ర సూర్యప్రసాదాత్‌ ॥

భావము (నాకు తెలిసి)
ఎవరైతే సంకల్పశుద్ధిగా శ్రీమయూరకవి చేత రచింపబడిన ఈ శతకాన్ని చదివినచో సర్వపాపములనుండి విముక్తులగుదురు. మరియు ఆరోగ్యం, సత్కవిత్వం, అతులబలం, తేజస్సు, ఆయువు, విద్యా, ఐశ్వర్యం, అర్థం, సంతానమును సూర్యభగవానుని ప్రసాదం వల్ల లభిస్తాయి.
                             
                                                  శుభమ్ భూయాత్ ॥
౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౨


3, ఫిబ్రవరి 2014, సోమవారం

మయూరుని సూర్యశతకము- పదవభాగము-అర్థము

91. భూమిం ధామ్నో,భివృష్య్టా జగతి జలమయీం, పావనీం సంస్మృతావపి,
యాగ్నేయీం దాహశక్య్తా, ముహురపి యజమానాం యథాప్రార్థితార్థైః,
లీనామాకాశ ఏవామృతకరఘటితాం ధ్వాన్తపక్షస్య పర్వ
ణ్వేవం సూర్యోష్టభేదాం భవ ఇవ భవతః పాతు బిభ్రత్స్వమూర్తిమ్‌ ||

అర్థము

ధామ్నాః= తేజస్సునకు, భూమిం=భూమి అయినదియు, జగతి = లోకమునందు, అభిదృష్ట్యా= వర్షించుటచేత, జలమయీం= జలరూపమగునదియు (జలమును అని) మరియు, సంస్మృతౌ = సంస్మరించుట యందు (ఇతరులు తనను స్మరించినపుడు అని) , పావనీం= వాయుసంబంధమగు దానిని (పావనీం అనుటచేత స్మరించుటచే పవిత్రులుగా చేయునదియు అని శబ్దచ్ఛలము చేత గూడ గ్రహింపవచ్చును.) ,దాహశక్త్యా= దహింపఁజేయు శక్తి చేత, ఆగ్నేయీం= అగ్నిసంబంధమగునదియు, ముహురపి=మాటిమాటికిని , ప్రార్థితార్థైః= కోరబడిన కోరికలచేత, యాజమానాత్మికాం=యజ్ఞము చేయుదాని రూపమగునదియు(యజ్ఞము చేయువాడు ప్రార్థించుట చేత దానికిష్టసిద్ధులు కలుగఁజేయుట చేత ఇట్లు చెప్పబడినది), ఆకాశే= ఆకాశమునందు, లీనాం = కలిసియున్నదియు (ఆకాశమున కలసియుండుట చేత ఆకాశమయమగు మూర్తిని అని) , ధ్వాన్తపక్షస్య పర్వణి= కృష్ణపక్షము యొక్క పర్వదినమున (అమావాస్యయందు), అమృతకరఘటితాం= చంద్రునితో కూడుకొన్నదియునగు, ఏవం= ఈ విధముగా, అష్టభేదాం= ఎనిమిది విధములగు, స్వమూర్తిం=తన స్వరూపమునకు, భవ ఇవ=శివునివలె, దధత్=ధరించిన, సూర్యుడు, భవతః= మిమ్ము, పాతుమ్= రక్షించుగాక.

వివరణము-- భూమి , జల, అగ్ని, వాయు,ఆకాశ, యజమాన, సూర్యచంద్రులు శివుని అష్టమూర్తులని చెప్పిరి. ఆయాస్వభావసామర్థ్యవిశేషములలో సూర్యుని యందు ఈ ఎనిమిది విశేషములున్నవి.అందుచేత కవి సూర్యునిశివునితో పోల్చినాడు.ఈ విషయమున కాళిదాసశాకుంతలమున ప్రార్థనారూపముననున్న "యా సృష్టిస్పష్టురాద్యా" అనెడి శ్లోకమును స్మరింపవలసినది.

భావము (నాకు తెలిసి)
స్వయముగా తేజోభూమి యైనదియు, వర్షానికి కారణమగుచూ జలరూపి యైనదియు, స్మరింపబడి పవిత్రులను జేయుటవలన ( వాయువు తోడ్పాటు వల్లనే ధ్వని ఉత్పన్నమగుటచేత స్మరణకు కారణమై) వాయురూపియైనదియు, దహించు శక్తి గలిగి యుండుటచేత అగ్నిరూపమనియు, ప్రార్థింపబడి కోరికలు తీర్చగలుగుటచేత యజమానస్వరూపమై, ఆకాశములోనుండుటచేత ఆకాశరూపియై,కృష్ణపక్ష అమావాస్యరోజు చంద్రునితో కలిసి యేక స్వరూపమై, అష్టమూర్తిరూపాలనును ధరించి శివునివలెభాసించుచున్నాడో ఆ సూర్యుడు మిమ్ము రక్షించుగాక.
----------------------------------
92. ప్రాక్కాలోన్నిద్రపద్మాకరపరిమళనావిర్భవత్పాదశోభో
భక్య్తా త్యక్తోరుఖేదోద్గతి దివి వినతాసూనునా నీయమానః
సప్తాశ్వాప్తాపరాన్తాని యధిక్రమ మధరయన్యో జగన్తి స్తుతోలం
దేవైర్దేవః స పాయాదపర ఇవ మురారాతిరహ్నాం పతిర్వః ॥
అర్థము
యః=ఎవడు, ప్రాక్కాలోన్నిద్రపద్మాకరపరిమళనావిర్భవత్పాదశోభః= (సూర్యుని పక్షమున) ప్రాతఃకాలమున పద్మములు వికసించిన కొలనుతో కూడుటచేత ఆవిర్భవించిన కిరణముల శోభ కలవాడై (విష్ణువు పక్షమున) పద్మాఅనగా లక్ష్మీదేవి యొక్క కరముల కలయిక చే ఆవిర్భవించిన పాదశోభ కలవాడు), మరియు త్యక్తోరుశోకోద్గతి = (సూర్యపక్షమున)ఊరు అనగ తొడలు, దానివలన కలుగు శోకమును విడచి (విష్ణుపక్షమున) గొప్పశోకము కలుగుటను విడచి, భక్త్యా= భక్తితో దివి= ఆకసమునందు, వినతాసూనునా=(సూర్యపక్షమున), అరుణుని చేత , (విష్ణుపక్షమున) గరుత్మంతుని చే, తనీయమాన=కొనిపోవబడుచున్నవాడై, మరియు (సూర్యపక్షమున) సప్తాశ్వాప్తాపరాన్తాని=ఏడు గుర్రములచేత పొందబడిన పరలోకముల అంచులు (తుదలు) గల , జగన్తి= జగత్తులను, అధికం=ఎక్కువగా, అధరయన్=క్రిందుగా చేయుచున్నవాడై, (విష్ణుపక్షమున) ఆశుఆప్త అపర అన్తాని=శీఘ్రముగా  పొందబడిన పరలోకముల అంతములు కల జగత్తులను, సప్త=ఏడింటిని, క్రిందుగా చేయువాడు అని, [విశేషణమున సప్తాశ్వాన్త అనుదానిని ,సప్తాశ్వా ఆప్త అనియు, సప్త ఆశు ఆప్త అని పదచ్ఛేదమందు భేదము] మరియు, దేవైః = దేవతల చేత, అలం= మిక్కిలి, స్తుతః= స్తుతింపబడుచున్నాడో, (ఈ విశేషణము ఇరువురికి సమమే), సం= అట్టి, అపరః= మురారాతిః ఇవ= ఇంకొక విష్ణువు వలెనున్న , అహ్నాంపతిః= సూర్యుడు, వః = మిమ్ము , పాయాత్= రక్షించుగాక.

భావము (నాకు తెలిసి)
ఈ శ్లోకములో కవి సూర్యునికి , విష్ణువు నకు ఉన్న సామ్యాన్ని నిరూపిస్తూ, ఇరువురికీ అభేదమని ప్రతిపాదన చేస్తున్నారు.
(సూర్యుని పక్షమున) ప్రాతఃకాలమున వికసించిన పద్మములతో నిండిన కొలనుతో తన కిరణములు కలువగా జనించిన శోభకలిగిన వాడైన, తొడలు లేవను శోకమును విడిచి ఆకసములో తనను భక్తితో కొనిపోవుచున్న అరుణుడను సారథిని కలిగినవాడైన, పరలోకపు అంచులనందుకున్న ఏడుగుఱ్ఱములను బూన్చిన రథముపై నెక్కుటచేత లోకములన్నింటిని అధోలోకములు చేయగలిగినవాడై, [విశేషణమున సప్తాశ్వాన్త అనుదానిని ,సప్తాశ్వా ఆప్త అనియు, సప్త ఆశు ఆప్త అని పదచ్ఛేదమందు భేదము], దేవతలందరి చేత స్తుతింపబడినవాడైనట్టి సూర్యభగవానుడు మిమ్ము రక్షించుగాక!

(విష్ణువు పక్షమున) ప్రభాతకాలములో విరిసిన పద్మము వంటి లక్ష్మీదేవి కరములతో అలంకృతమైన పాదశోభ కలిగినవాడైన, అతి పెద్దశోకమును విడిచి తనను భక్తితో కొనిపోవుచున్న గరుత్మంతుడను సారథిని కలిగినవాడైన, పరలోకపు అంచులను దాటగలిగి ఏడు లోకములను అధోలోకములుగా చేయగలిగిన వాడై,[విశేషణమున సప్తాశ్వాన్త అనుదానిని ,సప్తాశ్వా ఆప్త అనియు, సప్త ఆశు ఆప్త అని పదచ్ఛేదమందు భేదము], దేవతలందరి చేత స్తుతింపబడినవాడైనట్టి విష్ణుభగవానుడు మిమ్ము రక్షించుగాక!
-------------------------
93.యః స్రష్టాపాం పురస్తాదచలవరసమభ్యున్నతేర్హేతురేకో
లోకానాం యస్త్రయాణాం స్థిత ఉపరి పరం దుర్విలన్య్ఘేన ధామ్నా
సద్యః సిద్య్ధై ప్రసన్నద్యుతిశుభచతురాశాముఖః స్తాద్విభక్తో
ద్వేధా వేధా ఇవావిష్కృతకమలరుచిః సోర్చిషామాకరో వః ||

అర్థము

యః =ఎవడు, అపాం= నీటిని సృజించినాడో,(సూర్యుడు వర్షించి నీటిని సృష్టించును) బ్రహ్మ " అప ఏవ న సర్జాదౌ" అను ప్రమాణము నీటినే మొదట సృష్టించును.) మరియు, అచల వరసమభ్యున్నతేః = ఉదయాద్రి యొక్క ఔన్నత్యమునకు , ఏకః హేతుః= తానొక్కటే హేతువైనాడో ? (సూర్యుడు ఉదయించి ఉదయాచలమను గౌరవము కలిగించినాడు , బ్రహ్మ ఎత్తైన కులపర్వతములను సృజించి హేతువగుచున్నాడు. మరియు, యః= ఎవడు, దుర్విలంఘేన = ఇతరులు మీరుటకలవికాని, ధామ్నా= తేజస్సు చేత , త్రయాణాం లోకానాం= మూడులోకములకు పరం మిక్కిలి, ఉపరిస్థితః= పైన నున్నవాడో (బ్రహ్మపక్షమున)ధామ్నాః= స్థానము చేత అని చెప్పవలెను మరియు, ప్రసన్న ద్యుతి శుభచతురాశాముఖః = (సూర్యపక్షమున) తన ఉదయము వలనప్రసన్న కాంతి తోప్రకాశింపజేసిన నాలుగు దిక్కుల యొక్క ముఖములు గలవాడు), సః =అట్టి ఆవిష్కృత, కమలరుచిః= కమలముల కాంతిని ఆవిష్కరింపజేసిన (సూర్యుడు వికసింపజేసి పద్మముల కాంతి నావిష్కరించువాడు , బ్రహ్మపీఠముగా జేసుకొని పద్మకాంతికి కారణమయినవాడు, ద్వేధావిభక్తః వేధాః ఇవ =రెండుగా విభజింపబడిన బ్రహ్మవలెనున్న (రెండవబ్రహ్మ అని), అర్చిషాం ఆకరః= సూర్యుడు ,సద్యః=తక్షణం, వః= మీ యొక్క , సిద్ధైన= సిద్ధికొరకు, స్తాత్= అగుగాక.

భావము (నాకు తెలిసి)
ఈ పద్యములో కవి సూర్యునికి బ్రహ్మతో గల సామ్యమును గురించి వివరిస్తూ, సూర్యుని ఉత్తమత్వాన్ని నిరూపిస్తున్నాడు.
 సూర్యుడు వర్షానికి కారణమగుచూ (వర్షము సృష్టి మనుగడకు ముఖ్యాధారము) సర్వము సృజించగల బ్రహ్మ తో సమానమగుచున్నాడు. కులపర్వతాలను సృజించిన బ్రహ్మ వలె ఉదయాద్రిపై ఉదయించడం మూలంగా దాని ఔన్నత్యాన్ని పెంచుతున్నాడు.ముల్లోకాలకంటే ఉచ్ఛస్థితిలో నున్న బ్రహ్మ వలె అద్వితీయమైన తేజస్సుచే ఎవరి చేతనూ మీరబడరాని పై స్థాయిలో ఉన్నాడు. చతుర్ముఖుడైన బ్రహ్మ వలె తన కాంతి తో వెలిగిన నాలుగు దిక్కులనే ముఖములు గలిగియున్నాడు. ఆసనముగా చేసికొనుటవలన బ్రహ్మ పద్మాలకాంతిని బెంచినట్లుగా తన ఆగమనంతో పద్మాల వికసనమునకు కారణమై వాటి కాంతినావిష్కరించుచున్నాడు. ఈవిధముగా వెలుగుచున్నవాడై బ్రహ్మలోని రెండవాభాగమా అనునట్లు ప్రకాశించు సూర్యుడు మీకు సిద్ధి కలిగించుగాక!
****************************************
94.సాద్రిద్యూర్వీనదీశా దిశతి దశ దిశో దర్శయన్ప్రాగ్దృశో యః
సాదృశ్యం దృశ్యతే నో సదశశతదృశి త్రైదశే యస్య దేశే
దీప్తాంశుర్వః స దిశ్యాద్ అశివయుగదశాదర్శితద్వాదశాత్మా
శం శాస్య్తశ్వాంశ్చ యస్యాశయవిద తిశయాద్దన్దశూకాశనాద్యః ||


అర్థము

యః=ఎవడు, ప్రాక్=ముందుగా, సాద్రిద్యూర్వీనదీశాః=కొండలు , ఆకాశము,భూమి, సముద్రములతో కూడిన , దశదిశః=పది దిక్కులను , దర్శయన్= చూపుచున్నవాడై, దృశః= చూపులను , దిశతి= ఇచ్చుచున్నాడో మరియు సదశశతన్నశి= దేవేంద్రునితో కూడిన , త్రైదశీయేప్రదేశే= సర్వలోకముల, సాదృశ్యం= సాటి (ఎవనికి) , నోదృశ్యతే= కనబడుట లేదో, మరియు యః=ఎవడు అశివయుగ దశాదర్శి తద్వాదశాత్మా=ప్రళయకాలదశయందు  తన పండ్రెండు స్పరూపములను చూపుచున్నాడో(ప్రళయకాలమున సూర్యుని రుద్రకిరణములు విజృంభించును.), దందశూకాశనాద్యః= గరుడుని అన్నయగు అనూరుడు, యస్య = ఎవని యొక్క, ఆశయవిత్=  అభిప్రాయమెరిగినవాడై, అశ్వాన్ = గుర్రలను, శాస్తి= శసించుచున్నాడో , నడపు చున్నాడో, సః= ఆ (అట్టి) దీప్తాంశుః =సూర్యుడు, అతిశయాత్ = ఎక్కువగా, ----సుఖమును, దిశ్యాత్= ఇచ్చుకాక.

భావము (నాకు తెలిసి)
ఎవడు ముందుగా తన కాంతుల మూలకంగా కొండలు, ఆకాశము, భూమి సముద్రములు మొదలైన పది దిక్కులను చూచుటకు చూపునిచ్చుచున్నాడో,దేవలోకము మొదలైన సర్వలోకములలొ సాటిలేనివాడైయున్నాడో, ఎవడు ప్రళయ సమయమునందు తన అతి భీకరస్వరూపముగా పన్నెండు పడగలను చూపగలిగి యున్నాడో, ఎవడు మహాత్ముడగు గరుడుని అన్నయగు అనూరుని తన గుఱ్ఱములను శాసించుటకు సేవకునిగా కలిగి ఉన్నాడో అట్టి సూర్యుడు ఎక్కువ సుఖములను మీకిచ్చుగాక.
=======================================

95. తీర్థాని వ్యర్థకాని హృదనదసరసీనిర్ఝరామ్భోజినీనాం
నోదన్వన్తో నుదన్తి ప్రతిభయమశుభశ్వభ్రపాతానుబన్ధి
ఆపో నాకాపగాయా అపి కలుషముషో మజ్జతాం నైవ యత్ర
త్రాతుం యాతోన్యలోకాన్‌ స దిశతు దివసస్యైకహేతుర్హితం వః॥

అర్థము

యత్ర= ఎవడు, అన్యలోకాన్= ఇతరలోకములను, త్రాతుః= రక్షించుటకు, యాతే= వెళ్ళగా, హృద నద సరసీ నిర్ఘారంభోజినీనాం= గుంటలు, నదుల, సరస్సులు, జలపాతములు, పుష్కరిణులు వీటియొక్క, తీర్థాని= ఉదకములు, వ్యర్థకాని= వ్యర్థములో, మరియు, ఉదన్వన్తః=సముద్రములు అశుభశ్వభ్ర పాతాను బంధి =అశుభ్రమగు గుంటలో  పడుటకు సంబంధించిన , ప్రతి భయం= భయమును (నరకమున పడుదుమనెడి పాపభయము నన్నమాట, నోనుదన్తి =పోగొట్టుకున్నవో, మరియు నాకాపకాయాః= ఆ గంగయొక్క, ఆసః = నీరు, మజ్జితాం = స్నానము జేయు వారికి, కలుషముషః= కలుషములు పోగొట్టునవిగా, నైవ = కాకనేపోవుచున్నవో , సః = అట్టి, దివసస్యఏకహేతుః = పగటికి తనొక్కడే కారణమయిన సూర్యుడు , వః =మీకు, హితం = హితమును , దిశతు = ఇచ్చుగాక.

వివరణము
సూర్యసంబంధము లేక ఏ తీర్థములు సముద్రములు, నదులు తమ పని తాము చేయలేవని తాత్పర్యము.

భావము (నాకు తెలిసి)
ఎవడు అయితే నదులు, సరస్సులు మొదలైన వాటి నీరు వ్యర్థము కాకుండా, మనుజులకు అశుభ్రమైన గుంటలలో పడుభయమును పోగొట్టినాడో, గంగాస్నానము జేయువారికి కల్మషహారిగా దేవనది ప్రసిద్ధి పొందుటలో ప్రధానమైన వాడో అట్టి ఏకైక పగటిరాజు ఆ సూర్యుడు మీకు మేలు కల్గించుగాక.
ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ 

26, జనవరి 2014, ఆదివారం

విద్వేషాలు పెంచుకోవద్దండి ప్రజలారా!

విద్వేషాలు పెంచుకోవద్దండి ప్రజలారా!
  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నేతలు అన్నిభాగాల్లో ప్రజలు విడిపోవడానికి కారణమవుతున్నారు. తరతరాలు కలిసి ఉండవలసిన ప్రజల్లో అపోహలు ఉండకూడదు. మనసు వికలమయ్యే ఈ రోజులు ఎప్పుడు పోతాయో అందరూ అందర్నీ మనవాళ్ళని ఎప్పుడు అనుకుంటారో అప్పటి వరకూ ప్రశాంతతకు ఆస్కారం లేదు. అభివృద్ధి జరుగదు. ఇవి రెండూ ప్రసాదించమని భగవంతుని వేడుకుంటూ, మన పెద్దలు ఆనాడు ఎన్నో ఆశలతో  పాడుకున్న ఈ  పాట విందాము.

13, జనవరి 2014, సోమవారం

కనకాంబ గారికి ప్రణతులు.

కాంచనపల్లి కనకాంబ గారు రచించిన "అమృతసారము" లో కొన్ని అమూల్యమైన సంగతులను సులభమైన రీతిలో తేలికైన మాటలలో వివరించినారు. భక్తి తత్త్వమును తెలిసినప్పటికీ నిత్యజీవితములో పాటించుటకు మానవులు పడుపాట్లను

దుష్టకర్మంబు క్రిందికిఁ ద్రోయుచుండ
భక్తి నెగఁబ్రాఁకుచుండి అన్న చిన్న పోలికతో చమత్కారంగా చెప్తారు.

తనువు మఱచి తిరుగుత్రాగుఁబోతునకును
దెలివి గలిగి మెలఁగు దీనునకును
గలుగు భేదమరయఁగలవెట్లొ నిత్యంబు
ముక్తవరునకు భవరక్తునకటు

నని చెప్పి భవబంధములలో చిక్కినవానికి ముక్తి దక్కిన వానికి గల భేదములను సునాయాసంగా వివరించినారు.ఒరులకన్నన్ నేనే మతిమంతుఁడనని మతిహీనుడు భావించునని, పరుల దోషమరయుఁ పాపాత్ముడు- తన పాపముల గణించు పుణ్యుడని,భోజన శయనాదులలో క్రమము విడువని జీవుడు శ్రీరాముని భజించుటలో అలసత్వము చూపునని, సరియైన తరుణములో లక్ష్యపెట్టక మరణంబున నేడ్చునని విలువైన హెచ్చరికలను చేస్తున్నారు.
మరి మనకది సాధ్యమా అని అడుగువారికి సమాధానంగా

కాంచునంతమేరఁ గాలు సాగించిన
దోఁచుచుండు నవలఁ ద్రోవవదియ
ఉన్నచోటనుండి యూహించుచుండినఁ
గోరుదానినెవఁడు చేరఁగలడు
అని భుజంతట్టి ధైర్యం చెపుతారు.

ఇంకా కొన్ని నచ్చిన పద్యాలు
యశమునకో! లోకము దమ
వశముం బొనరించుకొనెడు వాంఛనొ పాపో
పశమనమునకో! కాకీ
పశువుల కుపకార బుద్ధి ప్రభవించునొకో!

పరులబోధ జేయు పనికి బూనెడి వాడు
అనుభవంబు లేని యధముడందు
రదియు గల్గు కొలది యంతర్ముఖుండౌ

తనదుఃఖము పరదుఃఖము
గని యసహనమున విబుధుడు కను సత్పధమున్
తన లేమి పరుల కలిమియు
గనియసహనమున కుకవిగను నాస్తికతన్ ( ఆలోచనల్లో పాజిటివ్, నెగెటివ్ ఎట్ల వస్తాయో చూడండి)

అందరికీ అన్నీ వివరించి చెప్పగలమా, అవతలి వారికీ ఆ పరిణతి రావాలన్నదీ తెలుసుకోవాల. చూడండి-
పెండ్లి యేమిటన్న పిల్లకు బ్రీతిగా
బల్కు బల్కనగునె ప్రసవబాధ
యెప్పుడెంతవఱకుఁ జెప్పగానొప్పునో
తప్పకంతవఱకుఁ జెప్పవలయు

చతురులూ విసిరినారు చూడండి
సుద్దులు సెప్పఁగ వినఁగాఁ
బద్దెములల్లంగ మోహపాశము విడునా?
యద్ధిర! గురుసన్నిధిలో
దిద్దుకొనంజెల్లుఁగాక దీనార్తిహరా!

రూపభేదములెంచక సర్వకారకమైన ఆ పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ
పరమార్థంబది జీవకోటికొసగన్ వాగ్దేవియై ప్రీతియై
హరియై శంకరుడై, గణేశ్వరుడునై యాదిత్యుడై యంబయై
పరుడై దేశికుడె పరాత్పరుడునై ప్రత్యేకరూపంబులన్
ధరియింపంగల నీదు శక్తి దలతున్ ధర్మార్థకామంబులన్
బరినర్జించిన భక్తపాళికి గదాప్రాప్తించు దద్యోగమో
కరుణాసాగర రామచంద్ర నృపతీ కైవల్యదాత్రకృతీ!

పండిత పామర స్త్రీపురుషవయో భేదములేక అందరూ పాశ్చాత్యవిద్య విజ్ఞాన తత్త్వాదులే గొప్పవని భ్రాంతి లో పడిన ఈ శతాబ్దిలోని ముప్పయ్యవ దశకంలో భారతీయాత్మతత్త్వమును దర్శించి ప్రదర్శించిన కనకాంబ గారికి ప్రణతులు.