Loading...

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

జీవనం ~ మరణం

జీవనం ~ మరణం

నిద్ర పోయినపుడు మనకు కలలు వస్తుంటాయి. కలలో ఉన్నంత సేపు అది నిజమనే భ్రమిస్తూ ఉంటాము. మెలకువ వచ్చేవరకూ అది కల అని తెలీదు. మెలకువ వచ్చాక అది ఎలాంటి భయంకరమైన పీడకల అయినా, మామూలు కల అయినా కూడా గుర్తొచ్చినపుడు నవ్వుకుంటామే కానీ, ఆ కల మనమీద పెద్దగా ప్రభావం చూపే దృష్టాంతాలు తక్కువ.

కల లాంటిదే మన జీవితం. మనం పుట్టిన నాటి నుంచీ చనిపోయే వరకూ ఉండే ఓ పెద్ద కల తో మనమీ జీవితాన్ని పోల్చవచ్చు. కలలో మనం దేనికైనా భయపడి ఏడ్చినట్టే, ఏ ఫస్ట్ రాంకో వచ్చినట్టు ( అది నిజం కాదని మనకు తెలీదు గదా!)జీవితంలో జరిగే విషయాలకు మనం ప్రతిస్పందన చూపుతుంటాం. అంటే మనకు ఇష్టమైన విధంగా మనుషులు, పరిస్థితులు ఉన్నప్పుడు పొంగిపోవటం, అలా కానప్పుడు కుంగిపోవటం చేస్తుంటాము.

కానీ జీవితమే బుడగ లాంటిదనీ, ఎప్పుడు పగిలిపోతుందో చెప్పలేమని, కోటానుకోట్ల నీటి బిందువుల్లో బుడగ గా ఏర్పడుతూ, కాసేపటికే పగిలి మళ్ళీ అదే నీట్లో కలిసిపోయినట్టుగా మన జీవితం కూడా అంటే మన శరీరం కూడా పంచభూతాలైన నీరు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశము ..వీటి సహాయంతో ఏర్పడి, మళ్ళీ ఓనాడు వీటి లోనే కలిసిపోతుంది. ఈ మధ్యలో ఉండేది శాశ్వతం కాదు. అసలు మనది కాదు.

పంచభూత స్వరూపమైన ప్రకృతిని పరమాత్మగా భావించే సంప్రదాయం మనది. పరమాత్మ ప్రకృతి రూపం దాల్చి ఉన్నాడని మనం నమ్ముతాము. ఆ ప్రకృతిలో ఓనాడు మనం కలిసిపోబోతున్నాము అంటే సంతోషం గాక దు:ఖమెందుకు? మన శరీరం అగ్నిలో కాలి, బూడిదై మట్టిలో కలిసిపోతుంది. ఊపిరి గాలిలో కలిసిపోతుంది. ఆత్మ అనంతాకాశంలో కలిసిపోతుంది. అస్థికల్ని నీటిలో వదులుతారు. ఈ విధంగా పంచభూతాలలో కలిసిపోబోయే రోజే మనకు కల ముగిసి మెలకువ వచ్చిన క్షణం.


నిద్రలో ఏడుస్తున్న వారిని చూసి కలలో ఏదైనా చూసి ఉంటారని మనం అనుకుంటాము. వారిని లేపి కూర్చోబెట్టి, మంచినీళ్ళు తాగించి, వెన్ను తట్టి విశ్రాంతిగా పడుకోమని చెప్తాం కదా! అలాగే మన జీవితంలో కష్టాలు మనని బాధించినపుడు మనం తేలిగ్గా తీసుకోవటానికి ప్రయత్నించాలని పెద్దలు చెపుతుంటారు. సుఖంగా ఉన్నపుడు మనం మిగతావేమీ పట్టించుకోము. కష్టం వచ్చినపుడు ప్రపంచంలో ఎవరికీ లేని కష్టం మాకే వచ్చిందని అనుకుంటాం.

అవతలివారి కష్టం ఎప్పుడూ మన కష్టం కన్నా తేలిగ్గానే కనిపిస్తుంది. ఎలాగంటే ఏనాటికీ మన కల మనం చూసినంత స్పష్టంగా అవతలి వారి కలల్ని మనం చూడలేము కదా! అలాగే ఇదీనూ!

భూమి మీద పుట్టిన జీవరాసులన్నీ భూమిలో కలిసిపోవడం సహజమైన ప్రక్రియ. పుట్టుక, పెరుగుదల లాగే మరణం కూడా సహజమైనదే అయినప్పుడు సంతోషం కలగాలిగా! అందుకే నేనెప్పుడూ మరణాన్ని సహజంగా, సంతోష కరమైనదిగా భావిస్తాను.

సుఖదు:ఖాలను సమంగా తీసుకోగలిగే స్థితప్రఙ్ఞత ఇంకా నాకు అలవడలేదు.
తన పర తారతమ్యం ఇంకా నాకు పోనేలేదు.

కానీ మరణం మాత్రం నాకు బాధని కలిగించే విషయం కాదు. జీవితంలో కలగబోయే అన్ని పరిణామాలను స్వీకరించడానికి ఎదురుచూసినట్లే మరణానికై కూడా ఇష్టంగా ఎదురు చూడగలుగుతున్నాను.

మరణాన్ని ప్రేమించగలిగితే, జీవితాన్ని ద్వేషించాలని నా ఉద్దేశ్యం కాదు.
జీవితాన్ని ప్రేమించగలిగిన మనం మరణాన్ని ద్వేషించకూడదని.
భయపడకూడదని.

ఆ మాటనే అపశకునంగా భావించడం తప్పని నా ఉద్దేశ్యం.
ఉన్న ఊరు వదలి ఏదైనా పనిమీద బయటి ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ మన ఊరు వెళ్ళాలని ఎలా అనుకుంటామో అలాగే మరణించి ప్రకృతిలో లీనం అవ్వాలని ఆశించడం కూడా.

ఇక్కడ ఉన్న మనుష్యుల వల్లనో, పరిస్థితులవల్లనో చనిపోవాలని ఎవరూ కోరుకోకూడదు. తప్పకుండా మన ప్రయత్నం ద్వారా, దైవకృపతోనూ అన్నీ అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ కష్టపడ్డా, సుఖపడ్డా భగవంతుని ప్రసాదం అని నమ్మేదాన్ని నేను. అలాగే మరణం కూడా భగవంతుని కరుణయే.

అయ్యో, మనం లేకపోతే ఇల్లు ఏమౌతుంది, సంసారం ఏమౌతుంది, పిల్లలేమౌతారు, ఆయన/ఆవిడ/అమ్మ ఎలా తట్టుకుంటారని భయపడ్డం అర్థంలేని విషయం. నేను ఉన్నా లేకపోయినా ప్రపంచం ఎప్పటి లాగే ఉంటుంది. ఇలాగే తెల్లవారుతుంది. ఇలాగే పొద్దు గుంకుతుంది. అందరి జీవితాలు, వాటిలో వ్యస్తత, గొడవలు, సర్దుబాట్లు అన్నీ అలాగే ఉంటాయి.

పెద్దలు, మహానుభావుల పలుకుల్లో తెలుసుకున్న సత్యాలివి. పునశ్చరణ చేసుకుంటూనే ఉండాలి. రోజూ తోమినా రాగిచెంబు రోజూ గాలి తగిలి నల్లబడినట్టు అన్నీ తెలిసినా విషయాసక్తి, ప్రపంచం పట్ల మోహం వదలని మనసుకు ఇలాంటి పునశ్చరణ కొంతైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.

13, ఏప్రిల్ 2010, మంగళవారం

వర్తమాన కాలంలో జీవించాలి అనే మాటలన్నీ ...

భూత కాలం, భవిష్యత్కాలం అవసరం లేదు. వర్తమాన కాలంలో జీవించాలి అనే మాటలన్నీ మంచివే. కానీ ఎవరికి? తన ప్రస్తుత పరిస్థితికి భూతకాలమే కారణమని చింతిస్తూ, వర్తమానాన్ని పాడుచేసుకునే వాళ్ళకు, భవిష్యత్కల్పనలో పడి వర్తమానాన్ని పట్టించుకోని వాళ్ళకూ! (ఆ ఒక్కటీ అడక్కు లో హీరో రాజునవుతానని....)

సాధారణంగా మానవులు తనకూ, సమాజానికీ ఉపయోగపడేలా తనపని చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నప్పుడు భవిష్యత్ గురించి కలలు కనొచ్చు, గతంలోని తన మిత్రులనో సంఘటనలనో తలచుకొని సంతోషమో, దు:ఖమో వెలిబుచ్చనూ వచ్చు. అలా చేయటం వల్ల ఎవరి వర్తమానమూ బాధింప బడకూడదు. అంతే..

గతాన్ని మర్చిపోవాల్సిన విషయంగా పరిగణిస్తే, మనం జీవించటంలో అర్థం లేదు.
* మనల్ని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల్ని, లోకఙ్ఞానాన్ని కలిగించే గురువుల్ని మనం మరిచిపోగలమా!
* మనతో ఆడిపాడిన స్నేహితుల్ని, పెద్దయ్యాక ఏదో ఒక అవసరానికి అండగా నిలిచిన స్నేహితుల్నీ మరిచిపోగలమా!
* ఎన్నో ఢక్కామొక్కీలు తిని నేర్చుకున్న జీవిత పాఠాల్ని మరిచిపోగలమా! (మరిచిపోతే మళ్ళీ అవే తినాల్సొస్తుంది కదా..!)

ఇవన్నీ మరిచిపోతే, ఇబ్బందులు ఎదురయ్యేది మనకే!
ఎందుకంటే, గడచిన కాలంలోని మన జీవితాన్ని, పరిస్థితుల ఆధారంగా మనం చేసిన పనులనీ, తీసుకున్న నిర్ణయాలనీ ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటేనే, జీవితంలో మళ్లీ జరిగిన తప్పు జరక్కుండా, సంతృప్తికరంగా జీవించేట్టు చూసుకోగలం. కనీసం ప్రయత్నించగలం.

చాలామంది ప్రతిరోజు డైరీ ఎందుకు రాస్తారు?

ఆవేళ జరిగిన విషయాల్ని తలచుకుంటూ డైరీ రాస్తారు. ఎందుకని మరిచిపోయి వదిలేయరు? జరిగిన సంఘటన మనసుని బాధపెట్టిందా లేదా సంతోష పెట్టిందా అనిన్నీ, వాటి విషయంలో తమ తాత్కాలిక మరియూ శాశ్వత ప్రతిక్రియనీ నిదానంగా ఆలోచించి నమోదు చేసుకుంటారు.

డైరీ రాసేవాళ్ళూ, రాయని వాళ్ళూ కూడా అప్పటి తమ భావోద్వేగాలు రేకెత్తించే ప్రతికియనే గాక రోజులు గడిచే కొద్దీ మారే తమ ప్రతిక్రియనీ ఎవరితోనైనా పంచుకుంటారు. అది కొన్ని విషయాల్లో చెప్పుకోవడంతో ఆగిపోవచ్చు. కొన్ని విషయాల్లో తరతరాల జీవనాన్ని ప్రభావితం చేసే విషయాల్లో అయితే సన్నిహితులతో మాత్రమే కాక సమాజం అంతటితో పంచుకుంటారు. అవే పండుగలు, ఉత్సవాలు, ఉర్సులు, మొ||గునవి.

నిజమే.. ఉగాది, వినాయక చవితి, కృష్ణాష్టమి మొ||నవి ఒక ప్రత్యేక సందర్భం మానవాళికి కల్పించిన సంభ్రమానందాల్ని సమాజంతో కలిసి మరి మరి పంచుకోటానికి జరుపుకుంటారు. దీపావళి, దసరా మొ||నవి చెడు పై మంచి సాధించిన విజయాన్ని సమాజంతో కలిసి మరి మరి పంచుకోటానికి జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం అంటే, అది వ్యక్తిగతమైనది కాదు. తన తండ్రి తద్దినాన్నో, తన పాప పుట్టిన రోజునో సమాజం జరుపుకోవాలని ఆశించం. అయితే మానవాళికి శుభం కూర్చే సందర్భాన్నే సమాజంతో కలిసి ఉత్సవాలు చేసుకునేది. ఉదాహరణకు శ్రీరామ చంద్రుడు రావణున్ని సంహరించటం అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సంహరించటం కాదు. కౌరవుల్ని అంతం చేయటం కూడా అంతే. నీ స్వాతంత్ర్యం నీవు సుఖంగా సంతోషంగా ఉండటం కోసమే గానీ పరులకు హాని కలిగించరాదని లోకానికి తెలియచేయటం కోసమే!

అలా అయితే అందరూ మారిపోయారా, అంటే ఇంక చెడు లేదా అని కాదు.మంచి ఉన్నంత కాలమూ చెడు ఉంటుంది, చీకటి వెలుగులు ఎప్పుడూ ఉంటాయి. చీకటిలో ఉండకు వెలుగులోకి రమ్మని పిలివటమూ, వెలుగు ఇదీ అని చూపించటమూ, ఇలాంటి న్యాయ వ్యవస్థ అమలులో ఉండటం సమాజానికి హితవు అని చెప్పటమూ =====

ఈఉద్దేశ్యాలతోటే పండుగలూ, ఉత్సవాలూ జరుపుకుంటూ, ఆయా సందర్భాల్ని( గతంలోనివే మరి ) చెప్పుకుంటూ ఉంటారు. అందరూ మారరు. కొందరు చీకటినే ఇష్టపడతారు.
అంతేకానీ ఏదో శెలవు, తీపి వంటలు దక్కుతాయని కాదు.

ఇక భవిష్యత్ ...
భవిష్యత్ అనేది అవసరమే లేదంటే ఇక ప్రణాళికలెందుకు?

డైరీ రాయటం గురించి...

ఆ రోజు చెయ్యాలనుకున్నవి చేశామా, లేదా అని ఒక ఉద్దేశ్యం. అంటే భవిష్యత్తు అని రేపటి కోసం వేసిన ప్రణాళిక అమలు చేశామా లేదా అనే కదా! రేపటి కోసంప్రణాళిక అనేది లేకపోతే వారసుల భవిష్యత్ ని తీర్చిదిద్దగలమా?
అనుకోని పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సమాయత్తం కాగలమా?
గతం, భవిష్యత్ రెండూ వర్తమానానికి ముఖ్యమే. కాకపోతే వర్తమానాన్ని బలి పెట్టి గతంలోనో, భవిష్యత్ లోనో జీవించటం మాత్రం తప్పు.

శ్రీ కృష్ణదేవరాయలు, ఇంకా ఎంతోమంది కవులు, కవిపోషకులు ఉండబట్టే, భాష (ఏదైనా) ఇంకా నిలిచి ఉంది. ఈవేళ్టి తరంలో అలాంటి వాళ్ళు లేకపోతే భవిష్యత్ లో భాష మిగలదు.

అలాంటి భాషాభిమానాన్ని అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

ప్రజలు సుఖశాంతులతో జీవించేలా పరిపాలించాడు.

అలాంటి పరిపాలనా దక్షతని (కుటుంబం రాజ్యానికి చిన్న యూనిట్ కదా) అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

రాజ్యాన్ని, ప్రజా జీవనాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దుష్టులను ప్రతీసారీ జయించాడు.
అలాంటి విజయాలకు పట్టుగొమ్మలయిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని, దేశభక్తినీ, సమాజం పట్ల తన కర్తవ్యాన్ని విడిచిపెట్టని ధృడత్వాన్నీ అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

(ఎప్పుడో జరిగిన కృష్ణదేవరాయల పట్టాభిషేకం ఇప్పుడు ఉత్సవం చేసుకోవడం ఎందుకు, నేను వర్తమానంలోనే జీవిస్తాను అన్న ఒక నేస్తానికి సమాధానంగా... ఈ ఉత్తరం)