Loading...

10, అక్టోబర్ 2012, బుధవారం

మేరునగతప్పిదం -వరుస టపాలు

కడుపు నిండా వేళ తప్పకుండా భోజనం దొరుకుతుంటే ఆకలి అంటే తెలిసే వీలే లేదు.
నీడలో కూర్చున్న వారికి మాడ్చే ఎండ లో పని చేసే వాళ్ళ కష్టం తెలిసే వీలే లేదు.
ఇట్లా వ్రాసుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.

               దేశం మనది, మన భారత దేశాన్ని మనమే పాలించుకోవాలని, మన ప్రజలను ఎక్కణ్నించో వచ్చి సంస్కృతి పరంగా పూర్తి అపరిచితుల చేతుల్లో మనము, ముందుతరాలు బాధలు పడకూడదని మన పూర్వీకులెంతగానో శ్రమించారు. వాళ్ళల్లో ఇద్దరి ముగ్గురి గురించైతే పాఠాల్లో చదువుకుంటూ ఉంటాము.

              కానీ మారిన పరిస్థితుల్లో అప్రకటిత యుద్ధాలు చేస్తున్న పొరుగు రాజ్యాల కుతంత్రాలకు బదులు చెప్తూ, బలి అవుతూ ఉన్న మన సైనిక సోదరుల గురించి మనకెంత తెలుసు? వారు రోజువారీ సమస్యలను ఎదుర్కొంటూ, శత్రువులను కూడా ఎదుర్కొంటూ దేశాన్ని రక్షించటానికి ఎట్లాంటి వాతావరణంలో ఉన్నారో మనకేమాత్రం తెలుసు?

                   హిమగిరి సొగసుల గురించి ఎంతచెప్పినా తనివి తీరదంటారు. మనకు పెట్టని కోట అంటారు. భరింపరాని చలిలో , విరిగిపడే కొండ చరియల మధ్యలో, బాగుపఱచని, కొండొకచో అసలు వేయని మార్గాల్లో ప్రయాణిస్తూ ఎన్ని సైనిక దళాలు సరిహద్దుల్ని చేరుకోటానికి ప్రయాస పడుతున్నాయి? యుద్ధం చేయడం మాత్రమే కాక , వారికి రోజూ కావలసిన వంట పదార్థాలు, సామగ్రి తీసుకొని పోవడానికి అదనపు మనుషులు లేక వాళ్ళే అన్నీ ఎట్లా చేసుకోగలుగుతున్నారు? హెలికాప్టర్ ల నించీ విసరడం ద్వారా అందే సామాగ్రి ఎంత వరకూ వాళ్ళని చేరుతున్నాయి?
                        ఈ బాధలన్నీ కాక సరిహద్దు ప్రాంతాల్ని మ్యాపుల్లో చూడడం తప్ప ఇంకెలాంటి పరిచయం లేని రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం నోటికి వచ్చిన ప్రతిపాదనలను, వాగ్దానాలను చేస్తున్నపుడు వాటిని పూర్తి చేయడానికి ఎటువంటి సదుపాయాలూ మాకు లేవు మొఱ్ఱో అని నివేదికలను పంపిస్తే వాటిని పట్టించుకునే అధికారులు, మంత్రులు , ప్రధానులు, రాష్ట్రపతులు మనకు లేరే?

ఎందుకీ అలసత్వం? ఎందుకు ఈ తరం పాలకులు ఇంత స్వార్థమతులయినారు?

             చైనాతో యుద్ధం వచ్చిన నాటి పరిస్థితులను వివరిస్తూ  బ్రిగేడియర్ జే.పీ. దాల్వి వ్రాసిన హిమాలయన్ బ్లండర్ అనే పుస్తకంలోని కొన్ని అంశాలను వివరిస్తూ మేరునగతప్పిదం అనేపేరుతో మన బ్లాగర్ సుబ్రహ్మణ్య చైతన్య గారు వ్రాస్తున్న వరుస టపాలను చదవండి.
వారికి నా ధన్యవాదాలు.